ఇక్కడ స్వామి పంచ రూపాలతో దర్శనం ఇస్తాడు.
ఆలయంకు సంబందించిన సమాచారం అంతర్జాలంలో ఇక్కడ లభిస్తున్నది.
నందిగామలో తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల వారి బండి తీసుకుని వెళ్ళటం జరిగింది. సుమారు ౩౦ కిలోమీటర్లు దూరం ఉండవచ్చు. హైవే మీదనుంచి లోపలకి వెళ్ళటం, చిన్న చిన్న పల్లెటూళ్ళు కావటం లైట్లు పెద్దగా లేకపోవటం ఒకరకమైన భయానికి లోనైతే స్వామే వచ్చారా అన్నట్టు ఒకాయన ఒక పల్లెటూరు వచ్చేవరకు వచ్చి వెళ్లిపోయారు. రాత్రిలోపు చేరుకొని దర్శనం చేసుకుని వచ్చేద్దామనుకుని బయలుదేరిన మేము రూట్ కొత్త అవ్వ్వటం వల్లన, ఊరి పేర్లు తెలియక, చిమ్మ చీకటిలో ఒక చిన్న పల్లెటూరు వచ్చాక దర్శనం ఇక దొరకరదు తిరిగి వెళ్ళిపోయి పొద్దునే వద్దామనుకుని వెనక్కి వెళ్ళిపోయాము. ఐతే ఒక్క పడుకోవటానికి చాలా మంది వెళతారు అని కూడా చెప్పారు.
తరువాత రోజు మేము మొదటగా ఎదురయ్యే (5-6KM) గరుడాచలం కొండ మీద వీర నరసింహ స్వామిని దర్శించుకున్నాము. మేము వెళ్లేసరికి ఎవరు లేరు.కింద స్టాఫ్ ఒకరు వున్నారు. మట్టి రోడ్ వుంది కాని ఎత్తు ఎక్కువ వుంది. సరిగా లేదు. మెట్ల దారిలోనే వెళ్లమన్నారు. పైన ఆలయం మూసి వుంది. కానీ స్వామి దర్శనం అవుతుంది. కింద పంతులు గారి ఇల్లు వుంది. ఇంత రిమోట్ ఏరియాలలో ఒకసారి రావడానికే ఇలా ఉంటే స్వామినే నమ్ముకుని బతుకుతున్న పూజారుల జీవితాలు, కుటుంబ సభ్యుల త్యాగం చాలా గొప్పది అనిపించింది. తప్పక నమ్ముకున్న స్వామి కరుణిస్తాడు అనిపించింది.
తరువాత వేదాద్రి ఆలయం చేరుకున్నాం. ఆరోజు స్వామి కళ్యాణం జరుగుతుండటం వల్ల చాలామంది భక్తులు వచ్చారు. అక్కడ నదిలో సాలగ్రామ నరసింహ, అక్కడే కనిపించే కొండ మీద మెట్లు ఎక్కి పైకి వెళ్ళితే జ్వాలా నరసింహ, క్రింద ఆలయంలో యోగానంద, లక్ష్మీ నరసింహ స్వామివార్ల దర్శనం చేసుకున్నాం.
ఫండ్స్ తక్కువగా ఉండటం వల్లనేమో గాని అన్నదానం అప్పటికే అయిపొయింది. ఒకటి, ఆరా షాపులలో కూల్ డ్రింక్స్ కొన్ని స్నాక్స్ తప్ప పెద్దగా తినటానికి ఏమి లేవు. అన్నపూర్ణ కరుణ లేకుంటే పర్సులో వున్న కాష్, లక్షలు విలువచేసే కార్డులు అన్ని వున్న ఒక్కోసారి ఆకలితో అలమటిస్తూ నిస్సహాయంగా నిలిచిపోవలిసి వస్తుంది. బ్రాహ్మణ సత్రం దగ్గరలోనే ఉంది. ఇక్కడ కూడా నిధుల కొరత తీవ్రంగా ఉన్నట్టు వుంది. డొనేషన్ రాస్తే తయారు చేస్తాం అన్నారు. సాధారణంగా 11 గంటలలోపు ముందుగా వారికి చెబితే వారు దర్శనం అయ్యేసరికి రెడీ చేస్తారు. స్వామి దయవల్ల అందరికి ఆహరం లభించింది. ఒక అబ్బాయి డబ్బులు లేవు అని అక్కడే నించున్నాడు. కానీ వాళ్ళు భోజన సదుపాయం కలిపించారు అనుకోండి.
ఇలాంటి చోట చేసే అన్నదానం స్వామి భక్తులకు యెనలేని తృప్తిని, స్వామికి చాలా సంతోషం కలిగిస్తుంది. మీకు వీలు ఐతే ఆలయంలో గాని, ఈ సత్రంలో గాని అన్నదానం విరాళం రాయడానికి ప్రయతించగలరు.





































































