"Strike while the iron is hot" అని ఇంగ్లీష్ లో ఒక సామెత. ఇది దత్తాత్రేయుల ఒకానొక అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభులకి సరిగ్గా సరిపోతుందేమో అని అనిపిస్తుంది. అనంత బ్రహ్మాండాలు, గెలాక్సీలు ఆయనలోనే ఇమిడి ఉంటే ఈ సామెతలు ఒక లెక్కా ! ఇంతకీ ఆ సామెత ఎందుకు చెప్పానంటే స్వామి, భక్తుల పాప కర్మల వల్ల వచ్చే అనంతమైన కష్టాలను కాస్త కష్టంతో గట్టెక్కిస్తాడు కాబట్టి. జన్మాంతరాలలో అనుభవించవలసిన చెడు కర్మల ఫలాలను కొద్దిపాటి శిక్ష(ణ)కు గురిచేసి తీసివేస్తాడు కాబట్టి. ఇది నేను చెప్పే మాట కాదు సుమండీ! స్వామి వారి పారాయణ గ్రంధం చెప్పే మాట.
శ్రీపాద శ్రీ వల్లభు చరితామృతం పుస్తకం నా చేతికొచ్చికొన్ని సంవత్సరాలైనా ఈ మధ్యనే అయన అనుగ్రహం మంత్రరూపేణ కలగటంతో పాటు పారాయణ గ్రంధం పూర్తిచెయ్యటం కూడా సంభవించాయి.
పుస్తకం పారాయణ చేసేటప్పుడు ఒక్కోసారి నిజంగా భయం వేస్తుంది. ఏమిటి ఇంత పెద్ద శిక్ష స్వామి అతనికి అంత నిర్దయగా వేసాడు అనిపిస్తుంది. కాని ఆ శిక్షకు గురి అయినా వ్యక్తులు చేసిన పూర్వ కర్మ, గత & ప్రస్తుత జన్మ తీరుతెన్నులు గురించి తరువాత సందర్భాలలో వివరించినప్పుడు మాత్రం తల తిరిగిపోతుంది. కేవలం అది కొద్దిపాటి శిక్ష(ణ)గా మనం అంగీకరించి, ఆ రూపేణా వారి అనుగ్రహించిన తీరు చూసి ఆశ్చర్యంతో, ఆనందంతో చేతులెత్తి మొక్కుతాం. అవన్నీ సరైన నిర్ణయంగా (మనమెవరం ఆ విశ్వేశ్వరుడు నిర్ణయాలు సమీక్షించడానికి) మనసులోనే అంగీకరిస్తాం.
స్వామి వారు పీఠికాపురంలో జన్మించటం దగ్గరనుంచి వారి మహిమలు, లీలలు (వారిని గురించి ఇలా అన్నానో లేదో..... కుక్క అరుస్తుంది పక్కింట్లో :). దత్తాత్రేయుల పాదాల దగ్గర నాలుగు వేదాలు నాలుగు కుక్కల రూపంలో వుండడటం మీకు తెలిసిన విషయమే కదా !. అదే ప్రతీకాత్మకంగా ఇలా కొన్ని సంఘటనలు మనకి అనుభవం అవుతుంటాయి), కురువపురంలో స్వామి వారి తపస్సు దాకా అన్ని విషయాలు వున్నాయి. ఈ గ్రంధం సప్తాశ్వ పారాయణ గ్రంధంగా దొరుకుతుంది.
ఉద్యోగపరమైన ఇబ్బందులు తట్టుకోలేక, చివరి ప్రయత్నంగా స్వామిని మనస్సులోనే దర్శనానికి వస్తానని ఇలా కోరానో లేదో, ఆలా ఇబ్బందులు మాయమయ్యాయి. జగన్నాటక సూత్రదారి కదా ఆయన. కష్టాలు తెచ్చేది, తీసేది అనీ ఆయనే కదా ! కష్టమూ ఆయనే. సుఖమూ ఆయనే. ఇంకా ఉద్యోగ కష్టాలు తీరాయి. మరి మొక్కు తీర్చాలి కదా ! తప్పదు అని సమయం కోసం వేచి చూస్తుంటే, వ్యక్తిగత విషయంగా ఇంటికి వెళ్ళవలసి వచ్చి రాజముండ్రికి ఫ్లైట్ దొరికింది. అక్కడనుంచి 2 గంటలు బస్సు జర్నీ పిఠాపురానికి. పిఠాపురానికి నేరుగా రాజముండ్రి నుంచి బస్సులు లేవు అని చెప్పారు. అందుకని సరాసరి సామర్ల కోట వెళ్లి అక్కడనుంచి పిఠాపురానికి ఆటో పట్టుకుని పిఠాపురం చేరుకున్నాను. జిల్లాలో అన్ని చోట్ల దగ్గర దూరాలకు ఆటో సౌలభ్యం బావుంది.
పిఠాపురం విశేషాల విషయానికి వస్తే.... ముందుగా పిఠాపురం వూరు సమీపిస్తోందనగా రోడ్ జంక్షన్ దగ్గర కనిపించే కుక్కుటేశ్వర స్వామి ఆలయం, అందులోనే అష్టాదశా శక్తిపీఠాలలో ఒకటైన పురుహూతికా అమ్మవారి ఆలయం, కోనేరు దర్శించుకోవచ్చు. పిఠాపురం పాదగయగా ప్రఖ్యాతి వహించింది (అందుకే శ్రాద్ధం, పిండప్రదానాలు ఎక్కువగా కనపడతాయి). శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానం కూడా పిఠాపురమే. బ్రహ్మహత్యా నివారణ కోసం ఇంద్రుడు స్థాపించిన అయిదు వైష్ణవాలయాలలో ఒకటైన కుంతీమాధవ స్వామి ఆలయం కూడా పిఠాపురంలో దర్శించుకోవచ్చు. అలాగే అమ్మవారి పీఠికా అమ్మవారు అని చాలా చిన్న ఆలయం నిజానికి ఇదే అమ్మవారి శరీర భాగం పడిన చోటు అని ఇక్కడ అభివృద్ధికి అవకాశం లేక కుక్కుటేశ్వర ఆలయంలోకి మార్చారు అన్నట్టు తెలియవచ్చింది. సరే ఇంతకు ముందు పిఠాపురం దర్శనం అయినపుడు విశేషాలు అన్నీ పాత వ్యాసంలో విశదంగా రాసాను కాబట్టి మళ్ళీ అవన్నీ చెప్పటంలేదు పాతది ఆర్టికల్ చూడగలరు.
వికీపీడియా లో చూడండి ఒకేసారి పిఠాపురం గురించి...
శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థాన్ ఆలయపు వెబ్ సైట్ కోసం ఇక్కడ చూడగలరు.
ఈసారి పిఠాపురం దర్శనం ప్రధానంగా శ్రీ పాద శ్రీ వల్లభుల దర్శనం మొక్కు తీర్చుకోవటం గురించి అని చెప్పాను కదా! ఆలా పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ దత్తక్షేత్ర ఆలయంలోకి ప్రవేశించటంతోనే భజనలు వినబడుతున్నాయి. ఐతే ఒక విషయం చెప్పాలి. వూళ్ళో ఆలయానికి దారి కనుక్కుని వెళ్ళేదారిలో ఆలయ ఆస్తులు అక్రమార్కుల తీరును నిరసిస్తూ ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిభిరం కనపడింది.
గుడిని, గుడిలో దేవుడిని మింగే రాక్షసులు తయారయ్యారు అనిపించింది. దర్బారు సమయంలో అలాంటి వారిని ఆలయంలో లోపలికి రానిచ్చి తిరిగి బయటకు వెళ్ళేటప్పుడు దుడ్డు కర్రతో స్వామి కఠినంగా శిక్షిస్తాను అని స్వయంగా చెప్పిన పారాయణ గ్రంథ వ్యాక్యాలు ప్రకటన రూపంలో ఆలయంలో కనిపిస్తాయి. అది చూసాకైనా స్వామి సర్వాంతర్యామి, ఎవరికి ఎప్పుడు ఎలా శిక్ష'ణ' జరపాలి తెలిసినవాడు అన్న ఆలోచన ఆ అక్రమార్కులకు రాదు. వారి కర్మ ఆలా వుంది. నాకు మాత్రం స్వామి వాళ్ళ పని పడతాడు అన్న ఆలోచనతో మన: స్థిమితం వచ్చింది.
కౌంటర్ లో వున్న వారి దగ్గరనుంచి షాపుల వాళ్ళదగ్గర వరకూ కూడా ఎవరూ కదిలిస్తే పెద్దగా ఈ విషయం గురించి ఏమీ మాట్లాడటం లేదు. మాట్లాడదలచుకోవటం లేదు అనటం నిజానికి సబబుగా ఉంటుంది. ప్రభుత్వం అజమాయిషీ లోకి వెళ్ళింది అని మాత్రం చెప్పారు.
అనంత పద్మనాభ స్వామి ఆలయం దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు రాజ మార్తాండ వంశ కుటుంబీకులు ఆలయం బయట వున్న పంపుదగ్గర కాళ్ళు జాగ్రత్తగా కడుగుకొని వెలుపలికి వస్తారంటా. ఎందుకంటే అక్కడ ఆలయపు ఇసుకరేణువులు కాళ్ళకి అంటుకుని వచ్చేస్తాయి అవి కూడా స్వామి సంపదే, స్వామి సొత్తు తిన్నట్టు అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఆలా చేసేవారు అని చెప్పేవారు.
చూసారా ఎంతలో ఎంత తేడా. ఇంతకు ముందు చెప్పిన వారికి, ఈ రాజకుటుంబీకులకి.. అప్పటికీ, ఇప్పటికీ. ఎంత తేడానో కదా!. సౌకర్యాలు పెరిగిపోతున్నాయి కాని వ్యక్తిత్వాలు చచ్చిపోతున్నాయి. కాని వారి కర్మ కాలిన రోజున మాత్రం అన్నీ లైన్ లోకి వస్తాయి. ఆ రోజున మాత్రం జీవితం దానికదే అర్థం అయిపోతుంది!!!
ఆ తరువాత కౌంటర్లో వున్న అయన విభూతి ప్రసాదం ఇచ్చారు. అది తీసుకుని స్వామి పాద ముద్రలు బయట కూడా వున్నాయి (ఆలయం లోపల వుండే అసలు పాదాలు - మనకి పుస్తకం మీద కనిపించేవి. అవి ప్రొద్దున అభిషేకం సమయంలో అనుకుంట దర్శనంకి అవకాశం ఇస్తారు అని చెప్పారు). అవి దర్శించుకుని ఆలయంలోకి అడుగు పెట్టాను.
స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నాను. హమ్మయ్య !!! మొక్కు చెల్లించుకున్నాను అన్న సంతోషంలో వున్నాను. సరే అని కౌంటర్లో ఏమైనా సేవలు ఆ రోజుకి మిగిలి ఉన్నాయా అంటే పల్లకి సేవ వుంది 7 గంటలకి. కాని సేవ చెయ్యాలంటే పంచె కట్టుకోవాలిసిందే అని చెప్పారు. సరే అని పక్కన షాప్ లో కొత్త పంచె ఒకటి తీసుకుని హడావుడిగా నా బట్టలు వాళ్ళని అభ్యర్ధించి అక్కడ పెట్టి, పరుగు పరుగున టికెట్ తో పల్లకి సేవ కోసం మిగతా వారితో కలిసి కూర్చున్నాను.
పల్లకి సేవ మొదలు పెట్టేముందు అందరి పేరున పూజ చేసి పల్లకి ఎత్తించారు. అసలే అలాంటి మనకి అలవాటు లేదు. మరో పక్క కంగారు, భయం. ఏమి చేస్తే ఏమంటారో అని. అందరు పల్లకి ఎత్తి పట్టుకున్నారు. కాని పట్టుకునేలోపే అందరు పట్టుకోవటం వాళ్ళ నాకు పట్టుకోవటమే గగనం అయిపొయింది. దేవుడా మొత్తానికి చివరన దొరికింది అని సంతోష పడేలోగా, అటు కాదు ఇటు తిరగాలి అన్న పిలుపుతో నాతోపాటు అందరూ అటు నుంచి ఇటు తిరిగారు.. నాకు సంతోషం, కంగారు, భయం అన్నీ ఒకేసారి రెట్టింపు అయ్యాయి. ఎందుకంటె ఇటు తిరగగానే, ఇటు నుంచి నేనే ఫస్ట్ అన్నమాట. ఆఖరున వున్న నేను, స్వామి అపార అనుగ్రహం వల్లన, వరసలో మొదటి స్థానానికి వచ్చేసాను అన్నమాట:). ఇలాంటప్పుడే అయన మీద నమ్మకం & ప్రేమ రెండూ ఎక్కువ అయిపోయేవి :)..
మనకేమో ఇలాంటి సేవలు అవీ అలవాటు లేదు. పద్ధతులు అసలే తెలియవు. అక్కడ ఆలయ కమిటీ పెద్దాయన కూడా బాగా కంగారు పెడుతున్నారు. ఆ కంగారుకి నేను కంగారు పడుతుంటే లోపల పంతులు గారు ఒక స్మైల్ ఇచ్చారు మాకు అలవాటే అనో లేక నా భయాన్ని, ఆందోళనని అర్థం చేసుకొని దైర్యంగా వుండటానికో. ప్రతిగా చిరునవ్వు నవ్వా..
అక్కడ మరాఠి భక్తులు ఎక్కువగా వున్నారు. సిద్దమంగళ స్తోత్రం, దిగంబరా దిగంబరా శ్రీ పాద శ్రీ వల్లభ దిగంబరా భజన, నామఘోషతో ఆలయం పరిసరాలు అదిరిపోతున్నాయి. మనసు అనేకసార్లు తన్మయత్వానికి లోనవుతుంది. పంచె వేడికి తడిసిపోతుంది. ఒక పక్క చెమటలు, మరోపక్క కాస్త ఆందోళన. పల్లకి ఒక్కో దిక్కు దగ్గర కొంతసేపు ఆపటం భక్తులతో వింజామరలు స్వామికి వీయించటం. స్తోత్రాలు, పాటలు వాహ్ ! జన్మానికో శివరాత్రి లాగా జన్మనికో పల్లకి సేవ అనిపించింది. మొత్తంగా గంట దాకా పట్టింది. మా పల్లకి ఒక ప్రదక్షిణ పూర్తి అయిన తరువాత వేరే వారి కోసం ఇమ్మంటే, పల్లకి పట్టుకున్న నా స్థానాన్ని ఇచ్చాను. కాని అప్పటికే నిజంగా చాలా వత్తిడికి లోనవడం, నా ఇతర ఆరోగ్య సమస్యలు వల్ల శ్రీ పాదులు మధ్యలో కొంచెం రెస్ట్ ఇచ్చాడు అనిపించింది. నా స్థానంలో పట్టుకున్న వారేమో అవకాశం, అనుగ్రహం అని అనుకున్నారు. తరువాత ప్రదక్షిణకి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చ్చారు. మొత్తానికి పల్లకి సేవ ఎలా జరిగిందని ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతః !!!
పొద్దునే నిశ్చయ తాంబూలాలు పెట్టుకుని తెల్లవారగట్ల 02:50 కి ఇంటికి చేరుకున్న మొట్టమొదటి వ్యక్తిని బహుశా ఈ ప్రపంచంలో నేనే అనుకుంట :). అసలైతే సమయానికి ఇంటికి వెళ్తానో లేదో అనుకున్నవాడిని చెప్పాలంటే చాలా త్వరగానే పంపించాడు మా స్వామి. అసలేమైందంటే...
పిఠాపురంలో దర్శనం అయ్యేసరికి సుమారు 10 అయిపొయింది. పీఠికా అమ్మవారి ఆలయం తప్ప ఇంకేమి దర్శనం అవ్వలేదు. నేను ఐతే సంకల్పంలో అవన్నీ చేసుకుంటానని గాని అవన్నీ దొరుకుతాయి అని కాని ముందు అనుకోలేదు. ఇక అక్కడ ముగించుకుని డబ్బుల కోసం పిఠాపురంలో ఏ.టి.యం లు చాలా ట్రై చేశాను. ఒక్క ఏ.టి.యం కూడా పనిచేయలేదు. సమాల్ కోట అదేనండి మన సామర్ల కోట చేరుకున్నాక ఒక ఏ.టి.ఎం. కష్టం మీద దొరికిందనుకుంటే రెండువేల నోటు వచ్చింది. ఇంకేముంది చిల్లర కోసం చెప్పులు అరిగేలా తిరిగాను. దొరకలేదు. చివరకు బస్సు స్టాండ్ లో వున్న షాపులో దొరికింది గాని వున్న ఒక్క బస్సు వెళ్ళిపోయింది.
రాజముండ్రి రావటానికి రెండు రూట్స్ వున్నాయి. బయట రోడ్ మీద చాలాసేపు వేచిచూశాక ఒక ఆటో అతను వచ్చాడు. అతను రాజముండ్రి వెళ్తున్నా అంటే ఇంకా కొద్దిమంది ప్రయాణికులు వున్నారు నాలాగే అని అన్నాను. కాకపోతే బైపాస్ రూట్ అదేనండి రెండో రూట్ కాకపోవటంతో తనకి పెద్దగా ఆసక్తి లేకపోయినా మొత్తానికి వచ్చాడు. వెళుతూ చెప్పాడు. సర్ వచ్చే దారిలో ఒక కార్ టైర్ పంక్చర్ ఐతే జాకీ ఇచ్చి సహాయం చేశాను అని, ఆలా రోడ్ మీద ఒక్కో సరి ఇబ్బంది వచ్చి ఆగిపోతే సహాయం చెయ్యాలి అని, ఆ సమయంలో సహాయం చెయ్యాలి సర్ అని చెప్పుకొచ్చాడు. దారి మధ్యలో అతను చెప్పినట్టు పాపం హిందీ లారీ డ్రైవర్స్ ఇద్దరు అడ్రస్ పట్టుకుని, వచ్చేవాహనాల వాళ్ళ సహాయం కోసం చూస్తున్నారు. ఆటో ఆపి అడ్రస్ చెబితే మనకి వచ్చిరాని హిందీలో వాళ్ళకి రూట్ చెప్పాను.
ఇంకా మనుషుల్లో మంచితనం దాగివున్నది అని ఆ ఆటో అతన్ని చూస్తే అనిపించింది. కొన్ని వందల చందమామ నీతి కథల పుస్తకాల నీతిని, సమాజంలో చాలా సాధారణంగా బతికే కొందరు వ్యక్తులలో చూడవచ్చు. ఉన్నత విలువలు, వ్యక్తిత్వాలు కలిగిన అతి సాధారణ వ్యక్తులు కనపడితే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఇదే కాదు, నేను ఏదో ఒకటి చేసి బతకగలను అన్న ఒక పట్టభద్రుడికి లేని ఆత్మవిశ్వాసం కూడా సమాజంలో ఏదో ఒక పని చేసుకుని బతికేసేవాడికి ఉంటుంది నిజంగా అదే ఆశ్చర్యం.
సరే వెనక్కి వస్తే..., రాజమండ్రి చేరుకున్నాక తనకి కొంచెందూరం ఎక్కువైనా బస్సు స్టాండ్ దగ్గర దింపాడు. నేను వంద నోటు తీసుకోమని ఇస్తే మొత్తం వద్దని మిగతా చిల్లర డబ్బులివ్వబోయాడు. నేను కాదని కొంత ఎక్కువగానే ఇచ్చాను. ఖచ్చితంగా ఇలాంటి వారిని ప్రోత్సహించాలి తీరాలి. ఎందుకంటె మంచితనం, విలువలు మనలో కూడా ఇంకా చచ్చిపోలేదు అని నా నమ్మకం. అలాగే స్వార్థ పూరిత ప్రపంచానికి ఇంకా బలిపశువు అవ్వలేదు అని కూడా ఒక నమ్మకం.
ఒక మనిషకి - ఐతే దేవుడే మన బాగోగులని చూసుకుంటాడు అన్న నమ్మకం అయినా.
ఉండాలి లేకపోతే తన విలువలమీద తనకి నమ్మకం అయినా ఉండాలి. ఆటో మీటర్ మీద ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేవారు ఈ రెండు కాక మూడో రకం "అవసరాలు" ఒత్తిడి చేసేవాళ్ళు అనుకోవాలేమో. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది. టీవీ. పత్రికల పొడ సోకని పల్లెటూళ్ళకి పారిపోతే కొంతైనా 'మన' అన్నది దొరుకుతుందేమో అని !!!
రాజముండ్రి వచ్చాక, రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే బస్సు లు ఉంటాయి అంటే వెళ్లిన ఒక పది నిమిషాలలో అన్నట్టుగానే ఒక బస్సు వచ్చింది. కాస్త మెల్లగా వెళ్లినా గాని చాలా సౌకర్యంగా జాగ్రర్తగా మొత్తానికి ఇల్లు చేరుకున్నాను. చేరేసరికి తెల్లవారగట్ల 02:50 అయింది. అప్పటికి పడుకున్నాను.
ఆలా అన్ని ఇబ్బందులు వచ్చినా కూడా స్వామి అనుగ్రహంతో వాటన్నిటిని అధిగమించి మొత్తానికి స్వామి దర్శనంతో పాటు నా ఎంగేజ్మెంట్ కూడా బాగా జరిగిపోయింది.
ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి.
"and, when you want something, all the universe conspires in helping you to achieve it" పాల్ కొయిలో "అల్కెమిస్ట్" అన్న పుస్తకంలో చెబుతాడు.
సింపుల్ గా చెప్పవయ్యా అంటే నువ్వు భగవంతుడిని నమ్మడమే తరువాయి. తరువాత అయన చూపించే మిరాకిల్స్ కి కొదవా !!! వస్తువో, వ్యక్తో, ప్రకృతో అంతటా ఆయనే. అన్నీ ఆయనే.... అద్భుతాలు చూపిస్తాడు. తట్టుకోలేరు. గంజాయి తాగే సాధువులో, ప్రేమ ఫెయిల్ అయినా ప్రేమికులను సినిమాలలో ఎలా చూపిస్తారో తెలుసుకదా ! అంతకన్నా ఆ ఇంటెన్సిటీ దారుణంగా ఉంటుంది మరి. ఆ తరువాత మీ ఇష్టం. ఆలోచించుకొని భక్తిలోకి దూకండి :).
కొసమెరుపు
-------------
పల్లకి సేవ చేద్దామా ! వద్దా ! అదేమో పద్ధతులు, నియమాలు మనకి తెలియవు. తెలిసి తెలియక సేవలో పాల్గొనాలో వద్దో, మళ్ళీ ఏమి ఇబ్బందులు వచ్చి పడతాయో, పెద్ద పని పెట్టుకుంటానేమో అని డైలమాలో ఉండగానే, భక్తులందరూ పల్లకి సేవ చేయరా అన్న చరణంతో ఆలయాన్ని అప్పుడు మారు మోగిస్తున్నారు ఇంక స్వామి ఆదేశం వచ్చాక చెప్పేదేముంది తప్పదు కదా !!! మీకైనా, నాకైనా మరి :).
శ్రీ పాదుల ఆలయంలో వున్న ప్రసాదం హాలు. ప్రసాదం చాలా బావుంది.
ఇంతకు ముందు అమ్మవారి పీఠికాలయం అసలుది వూళ్ళో వున్నది అని చెప్పాను కదా ! ఆలయానికి ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు. నేను శ్రీ పాదుల ఆలయం నుంచి వస్తూ ఇలా బయటకు వచ్చాను.