శివన సముద్రం స్థల పురాణం విషయానికి వస్తే కావేరి నదీతీరాన వున్న మధ్యరంగక్షేత్రం కృతయుగానికి పూర్వం అంటే రామావతరానికి పూర్వంగా, దేవేంద్రులు, సప్తర్షులు పూజించినట్లుగా తెలియవస్తుంది. స్వామి జగన్మోహన రూపానికి, యవ్వనావస్థకు ప్రతీకగా మోహనరంగడుగా జగన్మోహన రంగనాథ స్వామిగా పేరుగాంచారు. రంగనాథ స్వామి కిరుపక్కల ఒక హారం వలె కావేరి ప్రవహించేదట. ఒక రాక్షసుడు ఒక పెద్ద రాయి రూపంలో శివన సముద్రం సమీపంలో ప్రవాహానికి అడ్డం పడడంతో కావేరి మాత శివ ప్రార్ధన ఫలితంగా శివుడు రాక్షసుడిని సంహారించిన ప్రదేశమే ఈ "శివన సముద్రం". సప్తర్షుల సలహాతో దేవేంద్రుడు శాప పరిహారార్ధం వైకుంఠ విష్ణు శేషశయన రూపంలో రంగనాథ స్వామి సాలగ్రామ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించినట్లుగా స్థలపురాణం ద్వారా తెలియవస్తుంది. సప్తరుషులు భారచుక్కి దగ్గర స్నానసంధ్యాదులు ఆచరించినందున వారి పేరున సప్తరుషి క్షేత్రంగా పిలవబడుతుంది. తక్షకుడు ఇక్కడ క్షేత్రపాలకుడు.
ప్రళయం తరువాత పునః సృష్టికోసం సప్తరుషులు గెలాక్షి నుంచి అమృత భాండాన్నిగర్భగుడిలో రంగనాథ స్వామికి క్రిందగా అరవై అడుగుల లోతున దాచినట్టుగా, దానికి ఆంజనేయ స్వామి, దుర్గ అమ్మవారు, అగస్త్య లోపాముద్రలతో కలిసి రక్షిస్తున్నట్టుగా తెలియవస్తుంది. ఈ ఆలయం పూర్తి చరిత్ర అల్సూర్ సోమనాథ స్వామి ఆలయ స్తంభంలో పేర్కొనట్టుగా కూడా తెలియవస్తుంది.
తలకాడ్ పంచలింగ క్షేత్రాల దర్శనం ఇతర చరిత్ర గురించి కొన్ని విషయాలు ఈ క్రింది లంకెలలో వున్నాయి.
http://telugu.nativeplanet.com/travel-guide/talakadu-panchalingeshwara-darshan-000075.html
http://telugu.nativeplanet.com/talakadu/
http://en.wikipedia.org/wiki/Talakad
ఇక మా యాత్ర విషయానికి వస్తే ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో నలుగురం స్నేహితులు కాబ్ మాట్లాడుకుని శివ సముద్రం ప్రయాణం కట్టాము. దారిలో రవి శంకర్ ఆర్ట్ అఫ్ లివింగ్ ఆశ్రమం, కనకపుర రోడ్ లో కనపడింది. వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జి మూసివేసారు అని డ్రైవర్ చెప్పాడు. దాని వల్ల కొంచెం ఒక 30-40 కిలోమీటర్లు అదనంగా వేరే గతుకుల రోడ్ లో వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళేదారిలో పోలి హోటల్ అని ఒక హోటల్ వుంది అల్పాహారం చాలా ఫేమస్ అని తెలిసి ఆగుదాము, తిని వెళదాము అని అన్నారు. ఎపుడు, ఎక్కడా స్వామి దర్శనం అవ్వకుండా తినలేదు. దర్శనం అయినాక కూడా ప్రసాదం చాలా సందర్భాలలో అల్పాహారం అవుతుంది. ఈసారి మాత్రం ఎందుకో కొంచెం మార్పు జరిగేలా వుంది అనిపించింది. కర్తృతమ్ దేవుడికి అర్చ్పించి ఆయన చెప్పినట్టు చేసే సాధకుడిని మరియు సేవకుడిని. నాదేముంది అనిపించి సరే అన్నాను. పోలి హోటల్ స్పెషల్ అని మసాలా దోసాలు చిన్నవి ఇచ్చారు తిన్నాము. బావున్నాయి. చెట్నీ కూడా బావుంది. పనిలో పనిగా కొబ్బరి బొండాలు కూడా వెళ్ళే దారిలో తాగాము. ప్రకృతికి చాలా దూరం అయి పోయాము అనిపించింది. కొబ్బరి నీటి రుచికి :).
మొత్తానికి ఉదయం 10:30 సుమరులో చేరుకున్నాము. కాళ్ళు కడుగుకోవటానికి నీళ్ళు లేవు. చుట్టుపక్కల కూడా చూసాము. గుడి ఆవరణలోనే ఏదో భవనం కడుతున్నారు. అక్కడ కూడా నీళ్ళు దొరకలేదు. పూలు కొంటుంటే పక్కనే ఆవు కనపడింది. దగ్గరకు వచ్చింది. బాగా ఆకలిగా వున్నట్టు వుంది. సరే ఐతే గోపూజ ముందు చెయ్యమంటావా స్వామి అనుకుంటు అరటి పండ్లు పెట్టి ఆ ఆ పూలామే దగ్గర కొద్దిగా నీరు తీసుకుని చేతులు కడుక్కుని దర్శనానికి వెళ్ళాము.
శివ సముద్రం రంగనాథ స్వామి మోహన రంగుడు. ఒక జీవి యొక్క 3 జీవావస్థలకు ప్రతీకగా రంగనాథ స్వామి ఆలయములు మూడు అని చెప్తారు. అవి మైసూరు దగ్గరలో వున్న శ్రీరంగపట్టణం (బాల్యావస్థ), శివన సముద్రం (యవ్వనావస్థ), శ్రీ రంగం (అంత్యవస్థ). దర్శనం బాగా జరిగింది. అక్కడ టెంపుల్ కమిటీకి చెందిని ఒక ఆయన వుంటే కాస్త నీళ్ళు ఏర్పాటు చేస్తే బావుంటుంది అని చెప్పాను. కన్నడ అనుకుంట నా తెలుగు అర్థం కాలేదు అనుకుంట ఆయనకు. కాళ్ళు చూపించి వాటర్ అని చెప్పి బయటకు వచ్చాను. పక్కనే వున్నరంగనాథస్వామి దేవేరి ఐన శ్రీ రంగనాయకి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అక్కడకి వెళ్ళినపుడు అమ్మవారి రూపము చాల సజీవంగా కళగా వున్నట్టు తోచింది. కాసేపు అలా నిలబడిపోయాను. ఈ మధ్య చాలాసార్లు అలానే అనిపిస్తుంది ఏ దర్శనానికి వెళ్ళినా. మరి ఏ దశ నడుస్తుందో :) వెళ్ళేదారిలో తలక్కాడ్ ఆలయాలలో కూడా అదే పరిస్తితి. టైం వచ్చేసింది ఏమో అని అనుకున్నా :).
దర్శనాంతరం ఆ పక్కనే వాటర్ ఫాల్స్ వున్నాయి అని అక్కడకు వెళ్ళాము. బారా చుక్కి, గగన చుక్కి అని ఇక్కడ రెండు పాయలుగా కావేరి నది ఎత్తు నుండి కిందకు పడుతుంది. ప్రపంచంలో 100 జలపాతాల లిస్టులో వుంది. 54వ స్థానం అనుకుంట. వర్షా కాలంలో చూసి తీరాలి దీని అందం. ఐతే మేము జూన్ అక్టోబర్ మధ్య కాకుండా, ఫిబ్రవరిలో వెళ్ళటం వల్ల నీరు ఏమి లేదు. అడుగున ఎక్కడో కొంచెం వున్నాయి.
అస్సలు శివ సముద్రం ట్రిప్ చిత్రంగా జరిగింది. మైసూరు శ్రీరంగపట్టణం దర్శనం ఐంది, ఈ నెల ఆఖరున శ్రీరంగం ట్రిప్ కూడా అవుతుంది. అందుకని ఒకరోజు ట్రిప్ ఈ మధ్య లో పెట్టుకుంటే ఒక పద్దతిలో దర్శనాలు అవుతాయి కదా అని ట్రైన్స్ కోసం చూసాము. డైరెక్ట్ ట్రైన్స్ శివ సముద్రంకి లేవు. శివ సముద్రంకి బెంగలూరు నుంచి మైసూరు కి ట్రైన్స్ ఎక్కువగా వున్నాయి. కాబట్టి మైసూరు లో దిగి మళ్లీ ఒక 70 కిలోమీటర్లు బస్సులో వెళ్ళాలి. సరే ఈ వ్యయప్రయాసలు ఎందుకని కాబ్ లో వెళ్ళాము. డ్రైవర్ చాలా సైలెంట్ గా వున్నాడు. కన్నడ అబ్బాయి తెలుగు కూడా బానే మాట్లాడుతాడు. మా స్నేహితుడి ఇంటి ఓనర్ కూడా డ్రైవర్ కాబట్టి ఆయనే ఈ ట్రిప్ కి తనని పురమాయించాడు. శివ సముద్రం నుంచి వచ్చేటప్పుడు తన వూరు మీదగానే రావాలి. ఆగి వెళ్ళదాము పరవాలేదు అని మేము చెప్పినా కూడా వూరిలో ఒక నిమిషం కూడా ఆగలేదు. కస్టమర్స్ వుంటే ఆగను సర్ అన్నాడు. అతని అంకితభావానికి ముచ్చట వేసింది. రవాణా రంగంలో ఎక్కువగా ఇలా తగలరు ఏమో మనకు. ఇంకా ఏ ట్రిప్స్ వేస్తుంటావు అంటే మంగళూరు కూడా ట్రిప్స్ పడుతున్టై సార్ అన్నాడు. మేము కాబ్ మాట్లాడుకున్నది కిలోమీటరు 7 రూపాయలు. డ్రైవర్ బేటా అదనం 250 రూపాయలు. కొద్దిగా ఎక్కువే ఇచ్చాము మా ట్రిప్ అయ్యాక :).
శివ సముద్రంలో ఆలయ దర్శనం, వాటర్ ఫాల్స్ చూసిన తరువాత అక్కడ భారతదేశపు మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ వుంది అన్నారు కానీ చూడలేదు. ప్రాధాన్యం ఎపుడూ భక్తే కాబట్టి తలక్కాడ్ దగ్గర ఆలయ దర్శనాల కోసం వెళ్ళాము. వెళ్ళేదారిలో ఒకచోట బావుటుంది అంటే భోజనం చేసాము బానే నాణ్యంగానేవుంది. తల్లక్కాడ్ కావేరి నది దగ్గర చాలామంది స్కూల్స్ పిల్లలతో సందడిగా వుంది. తీరం ఈ వైపు నుంచి ఆ వైపుకు నడుచుకుని వెళ్ళవచ్చు. నడుము లోతు వరకు మాత్రమె నీళ్ళు వున్నాయి. బవుశా ప్రాజెక్ట్ గేట్లు మూసివేసి వుండటం వల్ల కావచ్చు. అవి వర్షాకాలం తీస్తే చాలాకష్టం అని చెప్పారు. మొత్తానికి ఒక గంట పైన రకరకాల వచ్చీరాని ఈతలు వేసి, నదీ స్నానం చేసి వచ్చి దేవాలయాల దర్శనానికి వెళ్ళాము. వైధ్యనాథ దేవాలయంతో పాటు, పాతలేశ్వర ఇతర దేవాలయాల దర్శనం చేసుకున్నాము.
పాతలేశ్వర దేవేలయలకు వెళ్ళేటప్పుడు దారంతా ఇసుకతో నిండి వుంది. మొత్తానికి ఒక కిలోమీటరు నడచి ఉంటాము. ఆ ఇసుక దెబ్బకి అప్పటికే మా ఈతల దెబ్బకి, ప్రయాణ బడలికకు నడవలేక అవస్థ పడ్డాము. నాకు మునుపు రెండు అనుభవాలు గుర్తుకు వచ్చాయి. ద్వారపూడి, బిక్కవోలు (తూర్పు గోదావరి) దర్శనాలు చేసుకుని డస్సిపోయి వున్న సమయంలో సామర్ల కోట పంచారామ క్షేత్రానికి వెళుతుంటే ఇలానే రోడ్ అంతా పేడతో నిండి పోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ స్వామి నీకోసం ఇంత దూరం వస్తే పేడ రోడ్ మీద నడిపించావు సంతోషం అనుకున్నాను. అరుణాచలంలో మా వాళ్ళు వెనక వస్తుంటే, 14 కిలోమీటర్లు దూరం వచ్చాక ఈశాన్య లింగం అనిచెప్పి, దయ్యాలంటే ఇంత భయం ఉన్నవాడిని స్మశానం రోడ్ లో వంటరిగా రోడ్ మీద విసిరివేసిన శవాల దండలు చూసుకుంటూ జాగర్తగా, ఇంకా చెప్పాలంటే కొద్దో గొప్పో తొక్కుకుంటూ నడిపించావు. నీ మీద నా కోపానికి దూర్జటి లాగ శ్రీ కాళహస్తీశ్వర శతకం రాసి దెప్పి పొడవటం రాదు నాకు, లేకపోతె తిట్టుకవి ఐన వేములవాడ భీమ కవి గారిలా లాగానో లేదంటే అంతకన్నా ఘనుడైన ఆదిశంకరాచార్య స్వామి వారల మీమీద చమత్కరించలేను కదా అందుకే ???????????????? "స్వామీ" అని భక్తిగా కైమోడ్పులు (నమస్కారాలు) అర్పిస్తున్నాను. ఆశీర్వదించు మరి :)
No comments:
Post a Comment