Saturday, December 12, 2015

హంసల దీవి యాత్ర


ఈ మధ్య అస్సలు యాత్రలు కుదరటం లేదు ఎలాగా అనుకుంటుంటే, ఇంటికి వెళుతున్న నాకు మధ్యలో హంసల దీవి గురించి (కృష్ణా జిల్లాలోది మోపిదేవి మండలం - గుంటూరు జిల్లాలో ఇంకోక హంసలదీవి వుంది అన్నారు) ఒక మిత్రుడితో చర్చకు వచ్చి, సరే భగవంతుని ఆశీర్వాదం ఇలా వుంది కాబోలు అనుకుని దారిలో దర్శనం చేసుకుని వెళదామని, నేను నా మిత్రుడు బయలుదేరాము.

హంసలదీవి కృష్ణా నది, సముద్ర సంగమ ప్రదేశం కావటం వల్ల ఎంతో పవిత్రతను సంతరించుకుంది. స్థల పురాణం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుందా అన్నట్లుగా అలానే వుంది.

గంగా నది లక్షలాది ప్రజల పాప పంకిలాన్ని తొలగించీ, తొలగించీ వారిని పవిత్రలుగా మార్చే క్రమంలో కొంత కాలానికి తానే మలినమవ్వటం, శ్రీ మహా విష్ణువుని ఆశ్రయించి కరునించమని ప్రార్ధించటం జరిగింది. అంతట స్వామి, గంగను కాకి రూపాన సమస్త భూమండలంలోని తీర్ధాలలో స్నానమాచరిస్తూ, ఎక్కడ తన కాకి రూపం పోయి హంస రూపం వస్తుందో, అక్కడ తన పాపభారం అంతా సమసి తిరిగి మునుపటి శక్తిని, పవిత్రత్రను పొందుతావు అని, అలాంటి ప్రదేశం పరమ పవిత్రమైన క్షేత్రం అవుతుంది అని చెప్పాడు.

అలా గంగ భూమండలంలోని సర్వ తీర్దములలో స్నాన మాచరిస్తూ ఇక్కడకి వచ్చేసరికి హంసగా మారింది. అలా హంసగా మారి తన పవిత్రతను తిరిగి సంపాదించుకున్న చోటే ఇపుడు మనం చెప్పుకుంటున్న హంసల దీవి. పరమహంసలు తిరిగిన భూమి కాబట్టి హంసల దీవి అని మరొక కథాంతరం వుంది.

హంసలదీవికి మరొక ప్రత్యేకత వుంది. ఇక్కడ దగ్గరలో వున్న వేణుగోపాల స్వామి ఆలయం దేవతలు నిర్మించినట్ట్లుగా స్తానికులు చెబుతారు. ఒక రోజు లో నిర్మించతలపెట్టి, తెల్లవారేలోగా నిర్మిస్తుండగా తెల, తెలవారతుండటంతో అసంపూర్తిగా ధ్వజ స్తంబాన్ని వదిలేసారు అని కూడా చెబుతారు. సరే ఇంకొన్ని విశేషాలు చెప్పేముందు మా ట్రిప్ ఎలా జరింగిందో ఒక బ్రేక్ తో చెబుతాను :).

బెంగుళూరు నుండి మచిలీపట్టణం ఎక్ష్ప్రెస్సు లో మచిలీపట్టణంలో దిగాము. చిన్నపుడు ఎప్పుడో ఒకటి రెండు సార్లు వెళ్ళటమే. ఏదో బయటి జీవితం కాబట్టి ఇలా తిరుగున్నాము కాని ఇంటిదగ్గర వుంటే జిల్లా దాటి పోతామా చెప్పండి :). పేరు చెప్పను కానీ, సింహాచలం టెంపుల్ కి ఒక కిలోమీటరు దూరంలో వున్నఒక మిత్రుడు చెప్పాడు. ఇప్పటిదాకా జీవితం లో ఒక్కసారే సింహాచలం గుడికి వెళ్ళాను అని. అలా వుంటుంది. శివాజ్ఞ లేనిదే చీమ ఐనా కుట్టదు అన్నట్టు స్వామి ఆనుగ్రహం ఉండాలే ! దేనికైనా :).

సరే మేము మచిలీపట్టణం రైల్వే స్టేషన్ లో 2 గంటలు ఆలస్యంగా రైలు దిగాము. అక్కడ నుండి ఆటో పట్టుకుని బస్సు స్టాండ్ కి వచ్చాము. రైల్ లో ఒక ఆయన - మచిలీపట్టణం రిటైర్డ్, బెంగలూరు సెటుల్డ్  అనుకుంట! పాపం మొత్తం సమాచారం ఇచ్చాడు. ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలి, ఎన్ని సెంటర్స్ వున్నాయి -  ఏం చెయ్యాలి దగ్గర నుంచి, ఏ హోటల్ లో తినాలి వరకు :). గోదావరి జిల్లాల వాళ్ళకి కొత్త కాదు కాని పాపం పక్క జిల్లా వాళ్ళు మాత్రం మక తిక, అదే తిక మక పడిపోతారు అంత సమాచారం ఇచ్చేస్తే :).

బస్సు స్టాండ్ ఎదురుగుండా ఒక లాడ్జి కి వెళ్ళాము. కొంచెం పాతగా వుంది. స్నానాదులు ముగించికోవటానికి ఒక రూం కావాలి అన్నాము. 200 అన్నాడు. స్నాదులు చాలు బాబు అని చెప్పాము.  పైన ఓపెన్ బత్రూమ్స్ వున్నాయి. 30 రూపాయలు అన్నాడు. సరేలే అని అక్కడే ఏదోలా ముగించుకుని టాక్సీ స్టాండ్ దగ్గరకు వచ్చాము (రోజు నోటికి వచ్చే ఆదిత్య హృదయం రెండో పాదం దగ్గరే ఆగిపోయింది. ఆశ్చర్యం వేసి, బాత్రూములను  చూస్తే పడమటి దిశగా వున్నాయి, వాస్తు ప్రభావం అనిపించింది :).

హంసల దీవికి రెండు రూట్లు వున్నాయి. విజయవాడ నుంచి ఒక రూట్ వుంది లంక గ్రామాల మీదుగా. మరొకటి గూగుల్ వాడిని అడిగితే మచిలీపట్టణం మీదుగా 30 కిలోమీటర్లు అన్నాడు. అదే టాక్సీ స్టాండ్ వాళ్ళని అడిగితే 60 కిలోమీటర్లు చెప్పారు :).

 హంసల దీవి, అక్కడ సముద్ర సంగమం, వేణుగోపాల స్వామి గుడి, మోపిదేవి సుబ్రహ్మన్యేశ్వరుడు, మచిలీపట్టణంకి అతి చేరువుగానున్న పాండురంగని ఆలయం కలిపి మొత్తంగా ఒక రేటు చెప్పమన్నాము. అక్కడే ఏదో వేలం వేసినట్టు ఒక్కోడు ఒక్కో రేట్. మూడు వేలు నుంచి 1700 వందలకు వచ్చారు. ఆటో ఎక్కేస్తాము అని  చెప్పాము ఇంకా రేట్ దిగకపోతే :).

దీనికి తోడు ప్రతి వోడూ మీరు సాఫ్టువేరా సర్ అంటున్నాడు. అదేదో బకరా మీరేనా సర్ అన్నట్టు :D. మా వాడికి పాపం ఇలాంటి విషయాలలో బాగా అనుభవం వచ్చేసింది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అని చెప్పాడు. నాకు మైండ్ బ్లాక్ ఐంది. మా మొహలకి ఫైనల్ ఇయర్ ఏమిటి ! ఎపుడో జమానాలో పూర్తి అవుతుంటే అని నాకు మనసులో అనిపిస్తుంది :). మామా స్మాల్ కర్రెచ్షన్. ఈసారి PHD ఫైనల్ ఇయర్ అని చెప్పు అన్నాను. అపుడు మొహాలు సింక్ అవుతాయి అన్నా :).

మొత్తానికి బేరం కుదిరింది. చల్లపల్లి మీదగా రోడ్ బావుంటుంది అని తీసుకెళ్ళారు. మీటరు రీడింగ్ తీసుకున్నాము కానీ, దిగేటప్పుడు మళ్లీ చూడలేదు :). మొత్తానికి హంసల దీవికెళ్ళాము. అక్కడ ప్రత్యేకంగా బీచ్ లో నడపటానికి ఆటోలు వున్నాయి. కార్లు ఇక్కడ ఇసుకలో దిగిపోతాయి కాబట్టి కుదరవు అన్నారు. ఇంకేం చేస్తాము వాడికో 300 సమర్పించుకున్నాము. అక్కడ నుంచి ఇంకో 3 కిలోమీటర్లు. బీచ్ లో. మీరు మా కన్నా తెలివిగలవారు కాబట్టి, నేను ముందే చెప్తున్నా, మా అనుభవం చూసి జాగర్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి :).

అక్కడ సరిగ్గా ఎక్కడ స్నానం చెయ్యాలో అనుకుంటూ ఒక చోట దిగాము. అదే పాలకాయి తిప్ప ప్రదేశం, బంగాళాఖాతంలో తుంగ, బద్ర నదులతో వచ్చే కృష్ణానది సముద్రంలో సంగమించే పవిత్ర ప్రదేశం. అక్కడే స్నానాదులు కావించుకుని, పూజ చేసుకుని బయలుదేరాము (ఆదిత్య హృదయం ఇంక ఇక్కడ ఆగలేదు, ఇంతకన్నా ప్రవిత్ర ప్రదేశం లేదు అన్నట్టు) :).

అక్కడ నుండి వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాము. ఇందాక కొంచెం చెప్పి ఆపాను కదా. స్థల పురాణం ప్రకారం హంసలదీవిలో ఒకచోట కృష్ణుని విగ్రహం దొరికింది అని, అది ఏదో కారణం చేత దెబ్బతగిలితే, ఎలా ప్రతిష్టించాలా అని బాధపడుతున్న భక్తులకు, స్వామి కలలోనికి వచ్చి, కాకరపర్తి గ్రామంలో ఒక గృహస్థు  ఇంటిలో కాకర పాదు కింద భూమిలో తాను విగ్రహ రూపంలో వున్నట్టు తెలిపాడు. ఈ సంఘటన తరువాతనే ఆ గ్రామానికి ఇప్పుడు పిలుస్తున్న 'కాకరపర్తి' అన్న పేరు వచ్చింది. అలా తీసుకుని రాబడిన స్వామి విగ్రహాన్ని హంసల దీవిలో ప్రతిష్టించారు. మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ స్వామి పిలిస్తే పలుకుతాడు అని భక్తుల నమ్మకం. సో మరి మీరూ ప్రయతించాలి :).

ఇంకొక విశేషం కూడా చెప్పేస్తున్నా. ఈ ఆలయం ఆళ్వార్లు కీర్తించిన 108 ప్రసిద్ధ వైష్ణవ క్షేతాలలో ఒకటి. అదిగో ఎవరు తుమ్మారు. సత్యం సత్యం పునః సత్యం :).

మేము గుడి లోనికి వెళ్ళేసరికి కరెంటు లేదు. లోపలకి వెలుతురు రావటానికి మమ్మలిని అందరిని కొంచెం వెనక్కి వెళ్ళమన్నారు. ఎంతో చరిత్ర, విశిష్టత, పవిత్రత కలిగివుండి కూడా పోషణ లేని గుళ్ళు విషయమై  కొంచెం మనసులో బాధ వేసింది. వెంటనే వివేకానంద స్వామి జీవితం లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. స్వామి ఒకసారి తురుష్కుల దండయాత్రలలో ద్వంసం అయిన ఒక ఆలయాన్ని చూసి బాధతో, ఆ సమయంలో నేను ఇక్కడ వుండగా ఇది జరిగితే నా ప్రాణాలను ఇచ్చి అయినా ఆలయాన్ని కాపాడుకునేవాడిని అని అనుకున్నారు. అలా అనుకున్న వెంటనే, నా ప్రమేయం లేకుండా ఇవన్ని జరుగుతున్నాయి అనుకుంటున్నావా ? ఇప్పటికిప్పుడు కావాలంటే ఇక్కడ ఏడు అంతస్తుల బంగారు ఆలయం నిర్మించుకోగలను అన్న జగన్మాత  వాక్కులు వినిపించాయి. ఈ విషయం గుర్తుకు వచ్చి, అంతా భగవత్ చిద్విలాసం అనుకుంటూ దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఇదే విషయం మరుగునపడుతున్న కళలు, ప్రాచీన విద్యలు కూడా వర్తిస్తాయి అనుకుంటున్నా, మహాభారత యుద్ధం పూర్తి అయిన వెంటనే దివ్యాస్త్రాలు, చక్ర రధాలు, ఎలా వచ్చినవి అలా వెళ్ళిపోవటం మీకు తెలుసు కదా.  ఆలయానికి సంబందించి ఇంకో విషయం చెప్పటం మరిచాను. ఏ ఇతర ఆలయాలలో లేనట్టు, స్వామి ఇక్కడ నీలమేఘశ్యామవర్ణంతో ముచ్చట గొలుపుతాడు. అందుకని మీరు వెళ్ళినప్పుడు సరిగ్గా చూడండి . నో ఎక్శూజేస్ :).

అక్కడ నుండి బయలుదేరి సుబ్రమన్యేశ్వర స్వామి అనుగ్రహంతో మోపిదేవి లో కొలువైవున్న స్వామి దర్శనం చేసుకున్నాము.

స్థల పురాణం ప్రకారం, శివ భక్తుడైన వీరారపు పర్వతాలు అనే కుమ్మరి కలలో, శివానుగ్రహ ఫలితంగా స్వయంభూ లింగంగా ఒక పుట్టకింద వున్నట్లు గోచరమవ్వటం, ఆ విషయం గ్రామస్తులతో చర్చించి పుట్ట తవ్వి చూస్తే, ఆ విషయం నిజమవ్వటం, అలా ఆ పుట్ట మీదే స్వామిని ప్రతిష్టించి, ఆలయ ప్రతిష్ట జరిగినట్లు తెలుస్తుంది. (మరింత సమాచారం కింద లింక్ లో ఇచ్చాను). సరే అప్పటికే సమయం మించిపోయినా ఇంకా భక్తులు వస్తున్నారు అని లైన్ లో వదులుతున్నారు. అంతే గబ గబా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఒక విషయం గమనించాలి. స్వామి దర్శనానికి ఒక దారి, పుట్టకి ఒక దారి అని రెండు లైనులు కనిపిస్తాయి మీకు. స్వామి దర్శనంకి దారి ద్వారా స్వామి దర్శనం చేసుకుంటారు, పుట్ట దారి గుండా పుట్ట దర్శనం, దేని కది విడిగా చేసుకుంటారు అన్నమాట. పుట్ట దర్శనంతో పాటు మీకు గుడి ప్రదక్షిణ కూడా అయిపోతుంది :).

అక్కడ పుట్ట పాము అని వెండి బొమ్మలు అమ్ముతున్నారు. శ్రీకాళహస్తి లో మనం రాహు, కేతు పూజలు తరువాత హుండిలో వేస్తాము కదా రాహు, కేతువుల వెండి ప్రతిమలు అలా అన్నమాట. మేము ప్రత్యేకంగా పూజలు చేయించలేదు కానీ, అవి కొని మాత్రం హుండిలో వేసాము. అక్కడే గుడిలోనే కుడిప్రక్కగా ప్రసాదాల కౌంటరు దగ్గర చెట్టు వుంది. అక్కడే కెమరా డెస్క్ దగ్గర కెమెరా టికెట్ అమ్ముతున్నారు. అలా బయటకు వస్తే, ఒక చెట్టు దగ్గర మహిళలు దీపాలు పెట్టి, ప్రదక్షిణలు చేస్తూ కనిపించారు. మేము కుడా దీపాలు పెట్టాము. ప్రసాదాలు అవీ తీసుకున్నాక, దగ్గరలో వున్న క్షేత్రాలు అన్న నోటీసు బోర్డులు చూసుకుంటూ, బయలుదేరి మచిలీపట్టణం వచ్చేసాము.

ఏమైనా వెజ్ హోటల్ కనిపిస్తుందేమో అని వెదికాము కానీ ఆదివారం సెలవు రోజు కాబట్టి అవి అన్నీ మూసివున్నాయి. సరేలే అని మంచి హోటల్ కి తీసుకు వెళ్ళమని చెప్పాము. భోజనం మంచి క్వాలిటీతో బాగానే వుంది.

క్షేత్ర ప్రాశస్త్యం, ఇతర మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

మోపిదేవి క్షేత్రం లో జరిగిన ఒక వింత ఇక్కడ చూడండి.

అక్కడ నుంచి బయలుదేరి చిలకలపూడిలో వున్న శ్రీ కీర పండరిపురం (మచిలీపట్టణం పక్కనే 3 - 4 కిలోమీటర్లు ఉండవచ్చు) వచ్చాము. ఇక్కడ గుడి కొంచెం పాతగా, నిర్మాణం కొంచెం వైవిధ్యంగా  అనిపించేలా వుంది. మహారాష్ట్ర నిర్మాణ శైలి కావచ్చు అనిపించింది. సాధారణంగా మూలానికి నమూనాగా వుంటుంది కదా ఏదైనా. కాకపోతే ఆదరణ లేని ఇతర ఆలయాల వలె, వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చాలా పెద్ద ఆలయం. ఆలయానికి రెండు వైపులా చిన్న, చిన్న రూములుగా రెండు వరసలలో వివిధ భక్తులు దర్శన్నమిస్తూ వున్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి. దేశంలో పాండురంగని ఆలయంలో అత్యంత అరుదు. ఈ ఆలయం అలాంటి వాటిలో ఒకటి. దేశంలో మొదటి పాండురంగడి ఆలయం మహారాష్ట్రలో వుంటే, రెండోది మంచిలిపట్నంలో ఇక్కడ వుంది. పాండురంగ మహత్యం మొదటి షాట్ ఇక్కడే తీసారు అంట :).

మహారాష్ట్రలో పాండురంగడు అనగానే స్వామి భక్తుడు తుకారం ఎలా గుర్తుకు వస్తాడో అలాగే ఇక్కడ స్వామి భక్తుడు నరసింహం గుర్తుకు రావాలి. ఎందుకో తెలుసుకోవాలి అంటే స్థల పురాణం ఇక్కడ ఇక్కడ  చూడండి.

పాండురంగ స్వామి ఐతే చెప్పనవసరం లేదు. ఇక్కడ స్వామిని చూడాలి గానీ మైమరిచిపోతారు. అక్కడ వున్న స్వామి విగ్రహ రూపమా ! లేక నిజరూప దర్శనమా ! అనిపిస్తుంది. ఇంకా కాసేపు ఆగితే స్వామి కళ్ళు తెరుస్తారు కొంతసేపు అక్కడే వేచి చూద్దాం అనేట్టు నిజంగా అద్భుతంగా వుంటాడు. అందుకే కాబోలు, కాసేపు వుంటే స్వామి కళ్ళు తెరుస్తాడు అని మా వాడు నాలుగు సార్లు కాళ్ళు మొక్కాడు వదలబుద్ది కాక . కానీ మా భక్తి ఇంకా పండలేదు అన్న విషయం ఆ పారవశ్యంలో తొందరగా జ్ఞప్తికి రాలేదు :).

ఇది శివ వైష్ణవుల క్షేత్రం అని చెప్పవచ్చు. ఇక్కడ విష్ణువు పాండురంగడిగా అనుగ్రహిస్తే, శివుడు సిద్దేశ్వరుడిగా సహస్ర లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయిన మన పిచ్చి గాని శివకేశవులు అభేదం అనుకోండి. భూగృహంలో లెక్కకుమిక్కిలిగా కోటి శివలింగాలు వున్నట్టు అక్కడ పూజారి గారి ద్వారా తెలిసింది. ఆ విషయం అలా ఉంచితే అక్కడ అడుగుపెట్టగానే ఏదో ఉద్విగ్నతకు గురి అయి భక్తి పారవశ్యం లోకి వెళ్లి పోతాము.

అలా వివిధ అనుభూతులతో మా యాత్ర మచిలీపట్టణం బస్సు స్టాండ్ తో ముగిసింది :).

అదనపు సమాచారం గురించి క్రింద లింకులు చూడగలరు.
లింక్ 1

లింక్ 2

లింక్ 3 

కొసమెరుపు ఏమిటంటే, వేణుగోపాల స్వామి ఆలయంలో రుక్మిణి, సత్యభామ సమేతుడై దర్శనమిచ్చిన  స్వామి గురించి రాయటం, రోజూ ఒక పది పేజీలు చొప్పున భాగవతం చదువుతున్ననాకు సరిగ్గా రుక్మిణి, సత్యభామ కళ్యాణం చదువుతున్న సందర్భం, నాగ మంగళ వెళ్ళితే అక్కడ మళ్లీ స్వామి రుక్మిణి, సత్యభామలతో ప్రత్యక్షమవ్వటం కాకతాళీయం కాదు - భగవత్ చిద్విలాసం, అనుగ్రహం :).

నాగ మంగళ ఆలయ దర్శన విశేషాలు మరొక పోస్ట్లులో.






































No comments:

Post a Comment