శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనం లో భాగంగా చెప్పారు. అవి పాపిట కొండలు గాని పాపి కొండలు కావు. స్త్రీల నుదురు భాగంలో తల మొదటగా పాపిడి (పాపిట) భాగంలో తన సౌభాగ్యం చల్లగా ఉండాలి అని కుంకుమ ధరిస్తారు కదా ఆలా పాపిట భాగం తలను రెండుభాగాలుగా వేరు చేస్తుంది. అలాగే పాపిట కొండల దగ్గర గోదావరి తూర్పు, పశ్చిమ భాగాలుగా రెండుగా వేరు అవుతుంది అందుకే ఇటు పక్కన వున్నది పశ్చిమ గోదావరి జిల్లా అటు పక్కది తూర్పు గోదావరి జిల్లా అని అంటుంటారు. నేను భౌగోళికంగా కొంచెం బలహీనుడిని కాబట్టి సరిహద్దులు విషయమై క్షమార్హుడిని :).
ఎప్పటినుంచో గోదావరి వాసులు అని పిలిపించుకోవటమే కానీ ఎప్పుడూ గోదావరిని సరిగా చూసింది లేదు (కాలేజీ రోజుల్లో పడవ మిస్ అయ్యి పది కిలోమీటర్ల సాహస యాత్ర చేసి కొరుటూరులో చక్కని ఆంధ్ర భోజనం చేయటం తప్ప ). అంతెందుకు పక్క జిల్లాలో శక్తిపీఠాలు వున్నా జిల్లా దాటే బయటకు పోయే వరకూ నాకే శక్తి పీఠాల దర్శన భాగ్యం కలగలేదు. ఇక వేరేవారి సంగతి ఎందుకు లెండి.
సరే మనం యాత్ర విషయానికి వచ్చేద్దాం. ఎక్కడెక్కడ నుంచి పాపిట కొండలు అంటూ, గోదావరి యాత్రలకు వస్తుంది ప్రజానీకం. పశ్చిమ గోదావరి లో పుట్టి పెరిగి గోదావరి అలల సొగసు చూడలేకపోయామే అని ఈ మధ్య కొంచెం ఫీలింగ్ మొదలయింది. పోలవరం ప్రాజెక్ట్ పుణ్యమా అని ఇంక పేరాంటాల పల్లి యాత్రలు వుండవు అనటం మరొక కారణం. మొత్తానికి ఒక నలుగురు స్నేహితులతో కలిసి రాజు వెడలె పరివారం వెడలె అన్నట్టు బయలుదేరితిమి.
ఏపీ టూరిజం వాళ్ళ సైట్ లో బుక్ చేసుకుందామని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యి కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడి సరాసరి రాజమండ్రి కేంద్రానికి పొమ్మంటే చేసేది లేక గుమస్తాని నమ్మి ఆయన అకౌంట్ లో మనీ వేసి మొత్తానికి టికెట్స్ సంపాదించుకున్నాము. రసీదులు గురించి అడగవద్దు (ఇస్తామన్నారు గాని మొత్తానికి ఇవ్వలేదు లేదా మళ్ళీ మేము అడగటం కుదరలేదు అనుకోండి ఎందుకొచ్చిన గొడవ).
అస్సలు పాపిట కొండల యాత్రకు బయలుదేరటానికి మరొక కారణం - విహార యాత్రని కాదు కాని మధ్యలో గండి పోచమ్మ తల్లి ఆలయం, పేరంటాల పల్లి ఆలయం & రామ కృష్ణ ఆశ్రమం ఇవి కూడా ఉండటంతో కాస్త ప్రేరణ కలిగింది.
ఒకరోజు / రెండు రోజుల యాత్రల లాగ ప్యాకేజీలు అందుబాటులో వున్నాయి. ఏ.పి. టూరిజం వాళ్ళతో పాటు ప్రయివేట్ టూరిజం వాళ్ళ ప్యాకేజీలు కూడా వున్నాయి. మేము కాస్త భద్రత ఎక్కువ ఉంటుంది వినోదం తక్కువైనా అని ఏ.పి. టూరిజం వాళ్ళది బుక్ చేసుకున్నాము.
మాములుగా రాజమండ్రి నుంచి బస్సు లో పోలవరం పట్టిసీమ రేవు దగ్గరికి తీసుకొస్తారు. కాకపోతే మాకు పోలవరం దగ్గరే కాబట్టి బైక్స్ మీద సరాసరి వచ్చేసాము. తొమ్మిది గంటల సుమారులో లాంచీ బయలుదేరింది. ఇద్దరు బి.టెక్ కుర్రాళ్ళు శని, ఆదివారాల్లో వినోదం పేరిట బానే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటున్నారు. పాపం ఆ బీ.టెక్ స్టూడెంట్సే ఈ విషయాలన్నీ చెప్పింది. యాత్ర, దర్శనం & వినోదం అన్నీ మొత్తానికి ఓ.కే.
పేరాంటాల పల్లి అమ్మవారి ఆలయం, వేడి వేడి భోజనం, ఆహ్లాద పరిచే ప్రకృతి, గోదావరి తీరా ప్రాంతాలు, అల్లూరి సీతారామ రాజు గారు దాడి చేసిన పోలీస్ స్టేషన్, ఆపద్భాంధవుడులో చిరంజీవి మట్టితో శివుడిని చేసే సన్నివేశ ప్రదేశం, తేనీటితో కూడిన గోదావరి అల్పాహారం, మెలికలు తిరుగుతూ పాపిట కొండల గోదావరి ప్రావాహాన్ని ఆపేసినవా అన్నట్టు కనిపించే లొకేషన్, ఇంకా భూమి మీద డబ్బు గాలి సోకని పచ్చని ఊర్లు అన్నట్టు వస్తు మారక వినిమయం జరిగే ఊరు, పేరాంటాల పల్లి ఆలయం, ఆశ్రమం - వాహ్ ! ఒక్కసారి అయినా వెళ్లి రండి చెప్పే అనుభూతి కాదు.
కొసమెరుపు ఏమిటి అంటే లాంచీలు ఆగే చోట అంటే గోదావరి తీరప్రాంతం చాలా లోతుగా ఊబి లాగ వుంది. నేను కాళ్ళు కడుగుకుందామని ఒక రెండు అడుగులు వేసానో లేదో మోకాలు వరకు దిగిపోయాను. చావు వరకు వెళ్లి బతికి బయటపడ్డ ఫీలింగ్. జలగండం అంటే ఇదే కాబోలు. ఇంకా చూడవలసిన టెంపుల్ ఉన్నట్టు వున్నాయి మన ఖాతాలో :P. నెక్స్ట్ మంత్ వెళ్లబోయే తిరుచెందూర్ అయినా కావచ్చు :).
అల్లూరి వారి మొదటి పంజా పడిన పోలీస్ స్టేషన్ ఇదే. కొత్తది కూడా పక్కనే కట్టారు చూడండి.
పేరంటాల పల్లి శివాలయం & రామకృష్ణ పరమహంస ఆశ్రమం
ఈ చెట్టు చాలా సినిమాల్లో వుంది ముఖ్యంగా పల్లెటూరి వాతావరణం అందునా గోదావరి ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలలో (వంశీ గారి సినిమాలు అనుకోండి) గమనించండి.
గండి పోచమ్మ తల్లి ఆలయం
'పాపిట' కొండలు :)
No comments:
Post a Comment