Thursday, January 11, 2018

అరుణాచలం (ముచ్చటగా మూడోసారి) - కార్తీక దీప మహోత్సవం


మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు బేసి సంఖ్యలో ఉండేలాగా చేస్తాము. అంటే ఒకటి మూడు ఆలా. మరి జ్ఞానాగ్ని స్వరూపంతో ప్రకాశించే అరుణాచలేశ్వరుడు అరుణాచలంలో ఘనీభవించి కొండ రూపంగా మనం ఇపుడు చూసే మామూలు రూపంలో నాబోటి సాధారణ మనుషులు కూడా తమ కళ్ళతో (దివ్య  చక్షువులతో నిమిత్తం లేకుండా) దర్శనాన్ని పొందుతున్నారు కదా ! మరి మన ప్రదక్షిణ నియమం ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా ! అని ఒక ఆలోచన ఉండేది.

అరుణాచలేస్వరుని అనుగ్రహం ప్రసాదంగా రెండు సార్లు స్వామి వారి గిరి ప్రదక్షిణ చేసే భాగ్యం కలిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మూడో ప్రదక్షిణ కూడా స్వామి అనుగ్రహంగా కలిగింది. అది కూడా తమిళులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూసే కార్తీక దీప మహాత్సవంలో కలిగింది. జన్మ ధన్యత పొందింది. 

మోక్షానికి దూరం ఎంత అని అడిగితే, ఒక అడుగు అని చెప్పగల భక్తులు కొందరు నాకు తెలుసు. ఆలా అనే కంటే ఆలా గొప్పగా చెప్పుకోవటానికి నాకు వారిని పరిచయం చేసి నా ప్రయత్న, కృషి లోపాలని ఎత్తిచూపి అహంకారం దరిచేరనివ్వకుండా కాపాడే ఆ భగంతునికి మొదట కృతజ్ఞతలు. 

అరుణాచలం ప్రతి నెలా వెళ్లి గిరిప్రదక్షిణ చేసేవారు కొందరైతే, తిరుపతి వెంకటరమణున్ని ప్రతీనెలా మొక్కే భక్తులు మరికొందరు. వారి, వారి అచంచల  భక్తికి, శ్రమకి, విశ్వాసానికి నిజంగా ఆశ్చర్యం, ఆనందం వేస్తుంది ఒక్కోసారి.      

సరే విషయానికి వస్తే, మనం చేసుకునే కార్తీక పౌర్ణమి, తమిళ వారు చేసుకునేది వేరు వేరు. వారు సంవత్సరానికి ఒకసారి దీపం ఫెస్టివల్ అని చేస్తారు.  దీపానికి టన్నుల నెయ్యి  వాడతారు. అది కొన్ని రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. ఆరోజు కొండ కింద నుంచి కొండ పైవరకు కూడా భక్తులు నిలబడి వుంటారు. ఇసుకవేస్తే రాలనంత భక్తులు వస్తారు. అది చూసి తీరవలసిందే. చెప్తే అర్థం కాదు (ఫోటోలు చూడండి). 

ఆరోజు ప్రత్యేకమైన పండగ కాబోలు ఆలయంలో ప్రవేశం లేనట్టుగా వుంది. మేము గిరి ప్రదక్షిణలో భాగంగా వెళ్ళినప్పుడు ఆలయం బయట ప్రధాన గోపురం నుండే దర్శనం చేయించి పంపించారు. అక్కడ కొండమీద పెట్టె దీపానికి నెయ్యి  విరాళంగా ఇవ్వవచ్చు అన్నట్టు తెలిసింది. 250 రూపాయలు అనుకుంట అక్కడ చిన్న బోర్డు మీద రాశారు. భక్తుల చాలా ఎక్కువ స్థాయిలో రావటంవల్ల ఇవ్వటం కుదరలేదు. ఆ తరువాత టెంపుల్ వారి సైట్ లో చెల్లించినట్టు గుర్తు.

దారి పొడవునా, భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రసాద వితరణ బహు బాగా చేసారు. ఎక్కడికక్కడ ఆయా సంఘాలు, సంస్థలు వాళ్లు చేసినట్టు కనపడింది. ఒక జాతర వాతావరణం కనపడింది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకి దీపం వెలిగించారు. అరుణాచలేస్వరుని నామస్మరణలతో మారుమోగిపోయింది. ఎలుగెత్తి అరుస్తున్న స్వామి భక్తుల నామంతో ఒళ్ళు  పులకరించిపోయింది. ఎటు చూసినా నామస్మరణనే. భక్తుడు, భక్తుడికి బంధువు అన్నట్టు అందరు 'మనవాళ్లే' అనిపించింది.  చాలా టీ.వి. చానెల్స్  లైవ్ చూపించారు అని బంధువులు చెప్పారు. 

ట్రాఫిక్ సమస్యలు వల్ల వూరికి ఒక కిలోమీటరు దూరంలోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. అంటే మనం సరిగ్గా ప్రదక్షిణ దారికి ఒక కిలోమీటరు దూరాన దిగాము అన్నమాట. ప్రదక్షిణ మార్గానికి రాగానే మొట్టమొదటి వినాయక ఆలయం వుంది. చాలామంది అక్కడ నుంచే గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నట్టు  కనపడింది. మేము కూడా అక్కడ నుండే మొదలు పెట్టాము. (గిరి ప్రదక్షిణ సాధారణంగా అరుణాచలేశ్వర స్వామి ఆలయంనుంచి గాని, రమణాశ్రమం నుంచి గాని ఎక్కువమంది మొదలుపెడతారు). మనం ఎక్కడనుంచి మొదలుపెడితే అక్కడిదాకా వస్తే పూర్తయ్యినట్టే అన్నమాట. మన సౌకర్యం అనుకోండి. 

ఎపుడు ఎందుకు నేనే ఇలా అని, ఒక చేతకాని జీవితాన్ని జీవిస్తున్నాము అని, ఈ సమాజంలో బతకలేము అని. అవసరము అయినా దానికన్నా ఎక్కువ తెలుసుకున్నాము అని గానీ, లేకపోతె మనలాంటి వాడు ఎవడైనా వున్నాడా అని అనిపించినా, ఇక్కడికి వస్తే మన సందేహాలకు సరి అయినా సమాధానం దొరుకుతుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ అందరూ భక్తులే, ఎటు చూసిన భక్తమయం, శివమయం. స్మరణ మయం.ఒక్కమాటలో చెప్పాలంటే జన్మానికో శివరాత్రి !!!


























No comments:

Post a Comment