Wednesday, March 28, 2018

పిఠాపురంలో పల్లకి సేవ ('శ్రీ పాదుల' అపార అనుగ్రహ వీక్షణం).


"Strike while the iron is hot" అని ఇంగ్లీష్ లో ఒక సామెత. ఇది దత్తాత్రేయుల ఒకానొక అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభులకి సరిగ్గా సరిపోతుందేమో అని అనిపిస్తుంది. అనంత బ్రహ్మాండాలు, గెలాక్సీలు ఆయనలోనే ఇమిడి ఉంటే ఈ సామెతలు ఒక లెక్కా ! ఇంతకీ  ఆ సామెత ఎందుకు చెప్పానంటే స్వామి, భక్తుల పాప కర్మల వల్ల వచ్చే అనంతమైన కష్టాలను కాస్త కష్టంతో గట్టెక్కిస్తాడు కాబట్టి. జన్మాంతరాలలో అనుభవించవలసిన చెడు కర్మల ఫలాలను కొద్దిపాటి శిక్ష(ణ)కు గురిచేసి తీసివేస్తాడు కాబట్టి. ఇది నేను చెప్పే మాట కాదు సుమండీ! స్వామి వారి పారాయణ గ్రంధం చెప్పే మాట. 

శ్రీపాద శ్రీ వల్లభు చరితామృతం పుస్తకం నా చేతికొచ్చికొన్ని సంవత్సరాలైనా  ఈ మధ్యనే అయన అనుగ్రహం మంత్రరూపేణ కలగటంతో పాటు పారాయణ గ్రంధం పూర్తిచెయ్యటం కూడా సంభవించాయి. 

పుస్తకం పారాయణ చేసేటప్పుడు ఒక్కోసారి నిజంగా భయం వేస్తుంది. ఏమిటి ఇంత పెద్ద శిక్ష స్వామి అతనికి అంత నిర్దయగా వేసాడు అనిపిస్తుంది. కాని ఆ శిక్షకు గురి అయినా వ్యక్తులు చేసిన పూర్వ కర్మ, గత & ప్రస్తుత జన్మ తీరుతెన్నులు గురించి తరువాత సందర్భాలలో వివరించినప్పుడు మాత్రం తల తిరిగిపోతుంది. కేవలం అది కొద్దిపాటి శిక్ష(ణ)గా మనం అంగీకరించి, ఆ రూపేణా వారి అనుగ్రహించిన తీరు చూసి  ఆశ్చర్యంతో, ఆనందంతో చేతులెత్తి మొక్కుతాం. అవన్నీ సరైన నిర్ణయంగా (మనమెవరం ఆ విశ్వేశ్వరుడు నిర్ణయాలు సమీక్షించడానికి) మనసులోనే అంగీకరిస్తాం. 

స్వామి వారు పీఠికాపురంలో జన్మించటం దగ్గరనుంచి వారి మహిమలు, లీలలు (వారిని గురించి ఇలా అన్నానో లేదో..... కుక్క అరుస్తుంది పక్కింట్లో :). దత్తాత్రేయుల పాదాల దగ్గర నాలుగు వేదాలు నాలుగు కుక్కల రూపంలో వుండడటం మీకు తెలిసిన విషయమే కదా !. అదే ప్రతీకాత్మకంగా ఇలా కొన్ని సంఘటనలు మనకి అనుభవం అవుతుంటాయి), కురువపురంలో స్వామి వారి తపస్సు దాకా అన్ని విషయాలు వున్నాయి. ఈ గ్రంధం సప్తాశ్వ పారాయణ గ్రంధంగా దొరుకుతుంది.  

ఉద్యోగపరమైన ఇబ్బందులు తట్టుకోలేక, చివరి ప్రయత్నంగా స్వామిని మనస్సులోనే దర్శనానికి వస్తానని ఇలా కోరానో లేదో, ఆలా ఇబ్బందులు మాయమయ్యాయి. జగన్నాటక సూత్రదారి కదా ఆయన. కష్టాలు తెచ్చేది, తీసేది అనీ ఆయనే కదా ! కష్టమూ ఆయనే. సుఖమూ ఆయనే. ఇంకా ఉద్యోగ కష్టాలు తీరాయి. మరి మొక్కు తీర్చాలి కదా ! తప్పదు అని సమయం కోసం వేచి చూస్తుంటే, వ్యక్తిగత విషయంగా ఇంటికి వెళ్ళవలసి వచ్చి రాజముండ్రికి ఫ్లైట్ దొరికింది. అక్కడనుంచి 2 గంటలు బస్సు  జర్నీ పిఠాపురానికి. పిఠాపురానికి నేరుగా రాజముండ్రి నుంచి బస్సులు లేవు అని చెప్పారు. అందుకని సరాసరి సామర్ల కోట వెళ్లి అక్కడనుంచి పిఠాపురానికి ఆటో పట్టుకుని పిఠాపురం చేరుకున్నాను. జిల్లాలో అన్ని చోట్ల దగ్గర దూరాలకు ఆటో సౌలభ్యం బావుంది.  

పిఠాపురం విశేషాల విషయానికి వస్తే.... ముందుగా పిఠాపురం వూరు సమీపిస్తోందనగా రోడ్ జంక్షన్ దగ్గర కనిపించే కుక్కుటేశ్వర స్వామి ఆలయం, అందులోనే అష్టాదశా శక్తిపీఠాలలో ఒకటైన పురుహూతికా అమ్మవారి ఆలయం, కోనేరు దర్శించుకోవచ్చు. పిఠాపురం పాదగయగా ప్రఖ్యాతి వహించింది (అందుకే శ్రాద్ధం, పిండప్రదానాలు ఎక్కువగా కనపడతాయి). శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానం కూడా పిఠాపురమే. బ్రహ్మహత్యా నివారణ కోసం ఇంద్రుడు స్థాపించిన అయిదు వైష్ణవాలయాలలో ఒకటైన కుంతీమాధవ స్వామి ఆలయం కూడా పిఠాపురంలో దర్శించుకోవచ్చు. అలాగే అమ్మవారి పీఠికా అమ్మవారు అని చాలా చిన్న ఆలయం నిజానికి ఇదే అమ్మవారి శరీర భాగం పడిన చోటు అని ఇక్కడ అభివృద్ధికి అవకాశం లేక కుక్కుటేశ్వర ఆలయంలోకి మార్చారు అన్నట్టు తెలియవచ్చింది. సరే ఇంతకు ముందు పిఠాపురం దర్శనం అయినపుడు విశేషాలు అన్నీ పాత వ్యాసంలో విశదంగా రాసాను కాబట్టి మళ్ళీ  అవన్నీ చెప్పటంలేదు  పాతది ఆర్టికల్ చూడగలరు.

వికీపీడియా లో చూడండి ఒకేసారి పిఠాపురం గురించి... 

శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థాన్ ఆలయపు వెబ్ సైట్ కోసం ఇక్కడ చూడగలరు. 

ఈసారి పిఠాపురం దర్శనం ప్రధానంగా శ్రీ పాద శ్రీ వల్లభుల దర్శనం మొక్కు తీర్చుకోవటం గురించి అని చెప్పాను కదా! ఆలా పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ దత్తక్షేత్ర ఆలయంలోకి ప్రవేశించటంతోనే భజనలు వినబడుతున్నాయి. ఐతే ఒక విషయం చెప్పాలి. వూళ్ళో  ఆలయానికి దారి కనుక్కుని వెళ్ళేదారిలో ఆలయ ఆస్తులు అక్రమార్కుల తీరును నిరసిస్తూ ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిభిరం కనపడింది. 

గుడిని, గుడిలో దేవుడిని మింగే రాక్షసులు తయారయ్యారు అనిపించింది. దర్బారు సమయంలో అలాంటి వారిని ఆలయంలో లోపలికి రానిచ్చి తిరిగి బయటకు వెళ్ళేటప్పుడు దుడ్డు కర్రతో స్వామి కఠినంగా శిక్షిస్తాను అని స్వయంగా చెప్పిన పారాయణ గ్రంథ వ్యాక్యాలు ప్రకటన రూపంలో ఆలయంలో కనిపిస్తాయి. అది చూసాకైనా స్వామి సర్వాంతర్యామి, ఎవరికి ఎప్పుడు ఎలా శిక్ష'ణ' జరపాలి తెలిసినవాడు అన్న ఆలోచన ఆ అక్రమార్కులకు రాదు. వారి కర్మ ఆలా వుంది. నాకు మాత్రం స్వామి వాళ్ళ పని పడతాడు అన్న ఆలోచనతో మన: స్థిమితం వచ్చింది. 

కౌంటర్ లో వున్న వారి దగ్గరనుంచి షాపుల వాళ్ళదగ్గర వరకూ కూడా ఎవరూ కదిలిస్తే పెద్దగా ఈ విషయం గురించి ఏమీ మాట్లాడటం లేదు. మాట్లాడదలచుకోవటం లేదు అనటం నిజానికి సబబుగా ఉంటుంది. ప్రభుత్వం అజమాయిషీ లోకి వెళ్ళింది అని మాత్రం చెప్పారు. 

అనంత పద్మనాభ స్వామి ఆలయం దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు రాజ మార్తాండ వంశ కుటుంబీకులు ఆలయం బయట వున్న పంపుదగ్గర కాళ్ళు  జాగ్రత్తగా కడుగుకొని వెలుపలికి వస్తారంటా. ఎందుకంటే అక్కడ ఆలయపు ఇసుకరేణువులు కాళ్ళకి అంటుకుని వచ్చేస్తాయి అవి కూడా స్వామి సంపదే, స్వామి సొత్తు తిన్నట్టు అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఆలా చేసేవారు అని చెప్పేవారు. 

చూసారా ఎంతలో ఎంత తేడా. ఇంతకు ముందు చెప్పిన వారికి, ఈ రాజకుటుంబీకులకి.. అప్పటికీ, ఇప్పటికీ. ఎంత తేడానో కదా!. సౌకర్యాలు పెరిగిపోతున్నాయి కాని వ్యక్తిత్వాలు చచ్చిపోతున్నాయి. కాని వారి కర్మ కాలిన రోజున మాత్రం అన్నీ లైన్ లోకి వస్తాయి. ఆ రోజున మాత్రం జీవితం దానికదే అర్థం అయిపోతుంది!!!    

ఆ తరువాత కౌంటర్లో వున్న అయన విభూతి ప్రసాదం ఇచ్చారు. అది తీసుకుని స్వామి పాద ముద్రలు బయట కూడా వున్నాయి (ఆలయం లోపల వుండే అసలు పాదాలు - మనకి పుస్తకం మీద కనిపించేవి. అవి ప్రొద్దున అభిషేకం సమయంలో అనుకుంట దర్శనంకి అవకాశం ఇస్తారు అని చెప్పారు). అవి దర్శించుకుని ఆలయంలోకి అడుగు పెట్టాను. 

స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నాను. హమ్మయ్య !!! మొక్కు చెల్లించుకున్నాను అన్న సంతోషంలో వున్నాను. సరే అని కౌంటర్లో ఏమైనా సేవలు ఆ రోజుకి మిగిలి ఉన్నాయా అంటే పల్లకి సేవ వుంది 7 గంటలకి. కాని సేవ చెయ్యాలంటే పంచె కట్టుకోవాలిసిందే అని చెప్పారు. సరే అని పక్కన షాప్ లో కొత్త పంచె ఒకటి తీసుకుని హడావుడిగా నా బట్టలు వాళ్ళని అభ్యర్ధించి అక్కడ పెట్టి, పరుగు పరుగున టికెట్ తో పల్లకి సేవ కోసం మిగతా వారితో కలిసి కూర్చున్నాను.

పల్లకి సేవ మొదలు పెట్టేముందు అందరి పేరున పూజ చేసి పల్లకి ఎత్తించారు. అసలే అలాంటి మనకి అలవాటు లేదు. మరో పక్క కంగారు, భయం. ఏమి చేస్తే ఏమంటారో అని. అందరు పల్లకి ఎత్తి పట్టుకున్నారు. కాని పట్టుకునేలోపే అందరు పట్టుకోవటం వాళ్ళ నాకు పట్టుకోవటమే గగనం అయిపొయింది. దేవుడా మొత్తానికి చివరన దొరికింది అని సంతోష పడేలోగా, అటు కాదు ఇటు తిరగాలి అన్న పిలుపుతో నాతోపాటు అందరూ అటు నుంచి ఇటు తిరిగారు.. నాకు సంతోషం, కంగారు, భయం అన్నీ ఒకేసారి రెట్టింపు అయ్యాయి. ఎందుకంటె ఇటు తిరగగానే, ఇటు నుంచి నేనే ఫస్ట్ అన్నమాట. ఆఖరున వున్న నేను, స్వామి అపార అనుగ్రహం వల్లన, వరసలో మొదటి స్థానానికి వచ్చేసాను అన్నమాట:). ఇలాంటప్పుడే అయన మీద నమ్మకం & ప్రేమ రెండూ ఎక్కువ అయిపోయేవి :)..

మనకేమో ఇలాంటి సేవలు అవీ అలవాటు లేదు. పద్ధతులు అసలే తెలియవు. అక్కడ ఆలయ కమిటీ పెద్దాయన కూడా బాగా కంగారు పెడుతున్నారు. ఆ కంగారుకి నేను కంగారు పడుతుంటే లోపల పంతులు గారు ఒక స్మైల్ ఇచ్చారు మాకు అలవాటే అనో లేక నా భయాన్ని, ఆందోళనని అర్థం చేసుకొని దైర్యంగా వుండటానికో.  ప్రతిగా చిరునవ్వు  నవ్వా.. 

అక్కడ మరాఠి భక్తులు ఎక్కువగా వున్నారు. సిద్దమంగళ స్తోత్రం, దిగంబరా దిగంబరా శ్రీ పాద శ్రీ వల్లభ దిగంబరా భజన, నామఘోషతో ఆలయం పరిసరాలు అదిరిపోతున్నాయి. మనసు అనేకసార్లు తన్మయత్వానికి లోనవుతుంది. పంచె వేడికి తడిసిపోతుంది. ఒక పక్క చెమటలు, మరోపక్క కాస్త ఆందోళన. పల్లకి ఒక్కో దిక్కు దగ్గర కొంతసేపు ఆపటం భక్తులతో వింజామరలు స్వామికి వీయించటం. స్తోత్రాలు, పాటలు వాహ్ ! జన్మానికో శివరాత్రి లాగా జన్మనికో పల్లకి సేవ అనిపించింది. మొత్తంగా గంట దాకా పట్టింది. మా పల్లకి ఒక ప్రదక్షిణ పూర్తి అయిన తరువాత వేరే వారి కోసం ఇమ్మంటే, పల్లకి పట్టుకున్న నా స్థానాన్ని ఇచ్చాను. కాని అప్పటికే నిజంగా చాలా వత్తిడికి లోనవడం, నా ఇతర ఆరోగ్య సమస్యలు వల్ల శ్రీ పాదులు మధ్యలో కొంచెం రెస్ట్ ఇచ్చాడు అనిపించింది. నా స్థానంలో పట్టుకున్న వారేమో అవకాశం, అనుగ్రహం అని అనుకున్నారు. తరువాత ప్రదక్షిణకి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చ్చారు. మొత్తానికి పల్లకి సేవ ఎలా జరిగిందని ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతః !!!     

పొద్దునే నిశ్చయ తాంబూలాలు పెట్టుకుని తెల్లవారగట్ల 02:50 కి ఇంటికి చేరుకున్న  మొట్టమొదటి వ్యక్తిని బహుశా ఈ ప్రపంచంలో  నేనే అనుకుంట :). అసలైతే సమయానికి ఇంటికి వెళ్తానో లేదో అనుకున్నవాడిని చెప్పాలంటే చాలా త్వరగానే పంపించాడు మా స్వామి. అసలేమైందంటే... 

పిఠాపురంలో దర్శనం అయ్యేసరికి సుమారు 10 అయిపొయింది.  పీఠికా అమ్మవారి ఆలయం తప్ప ఇంకేమి దర్శనం అవ్వలేదు. నేను ఐతే సంకల్పంలో అవన్నీ చేసుకుంటానని గాని అవన్నీ దొరుకుతాయి అని కాని ముందు అనుకోలేదు. ఇక అక్కడ ముగించుకుని డబ్బుల కోసం పిఠాపురంలో ఏ.టి.యం లు చాలా ట్రై చేశాను. ఒక్క  ఏ.టి.యం కూడా పనిచేయలేదు. సమాల్ కోట అదేనండి మన సామర్ల కోట చేరుకున్నాక ఒక ఏ.టి.ఎం. కష్టం మీద దొరికిందనుకుంటే రెండువేల నోటు వచ్చింది. ఇంకేముంది చిల్లర కోసం చెప్పులు అరిగేలా తిరిగాను. దొరకలేదు. చివరకు బస్సు స్టాండ్ లో వున్న షాపులో దొరికింది గాని వున్న ఒక్క బస్సు  వెళ్ళిపోయింది. 

రాజముండ్రి రావటానికి రెండు రూట్స్ వున్నాయి. బయట రోడ్ మీద చాలాసేపు వేచిచూశాక ఒక ఆటో అతను వచ్చాడు. అతను రాజముండ్రి వెళ్తున్నా అంటే ఇంకా కొద్దిమంది ప్రయాణికులు వున్నారు నాలాగే అని అన్నాను. కాకపోతే బైపాస్ రూట్ అదేనండి రెండో రూట్ కాకపోవటంతో తనకి పెద్దగా ఆసక్తి లేకపోయినా మొత్తానికి వచ్చాడు. వెళుతూ చెప్పాడు. సర్ వచ్చే దారిలో ఒక కార్ టైర్ పంక్చర్ ఐతే జాకీ ఇచ్చి సహాయం చేశాను అని, ఆలా రోడ్ మీద ఒక్కో సరి ఇబ్బంది వచ్చి ఆగిపోతే సహాయం చెయ్యాలి అని, ఆ సమయంలో సహాయం చెయ్యాలి సర్ అని చెప్పుకొచ్చాడు. దారి మధ్యలో అతను చెప్పినట్టు పాపం హిందీ లారీ డ్రైవర్స్  ఇద్దరు అడ్రస్ పట్టుకుని, వచ్చేవాహనాల వాళ్ళ సహాయం కోసం చూస్తున్నారు. ఆటో ఆపి అడ్రస్ చెబితే మనకి వచ్చిరాని హిందీలో వాళ్ళకి రూట్ చెప్పాను. 

ఇంకా మనుషుల్లో మంచితనం దాగివున్నది అని ఆ ఆటో అతన్ని చూస్తే అనిపించింది. కొన్ని వందల చందమామ నీతి కథల పుస్తకాల నీతిని, సమాజంలో చాలా సాధారణంగా బతికే కొందరు వ్యక్తులలో చూడవచ్చు. ఉన్నత విలువలు, వ్యక్తిత్వాలు కలిగిన అతి సాధారణ వ్యక్తులు కనపడితే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఇదే కాదు, నేను ఏదో ఒకటి చేసి బతకగలను అన్న ఒక పట్టభద్రుడికి లేని ఆత్మవిశ్వాసం కూడా సమాజంలో ఏదో ఒక పని చేసుకుని బతికేసేవాడికి ఉంటుంది నిజంగా అదే ఆశ్చర్యం.   

సరే వెనక్కి వస్తే..., రాజమండ్రి చేరుకున్నాక  తనకి కొంచెందూరం ఎక్కువైనా బస్సు స్టాండ్ దగ్గర దింపాడు. నేను వంద నోటు తీసుకోమని ఇస్తే మొత్తం వద్దని మిగతా చిల్లర డబ్బులివ్వబోయాడు. నేను కాదని కొంత ఎక్కువగానే ఇచ్చాను. ఖచ్చితంగా ఇలాంటి వారిని ప్రోత్సహించాలి తీరాలి. ఎందుకంటె మంచితనం, విలువలు మనలో కూడా ఇంకా చచ్చిపోలేదు అని నా నమ్మకం. అలాగే స్వార్థ పూరిత ప్రపంచానికి ఇంకా బలిపశువు అవ్వలేదు అని కూడా ఒక నమ్మకం.   

ఒక మనిషకి - ఐతే దేవుడే మన బాగోగులని చూసుకుంటాడు అన్న నమ్మకం అయినా. 
 ఉండాలి లేకపోతే తన విలువలమీద తనకి నమ్మకం అయినా ఉండాలి. ఆటో మీటర్ మీద ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేవారు ఈ రెండు కాక మూడో రకం "అవసరాలు" ఒత్తిడి చేసేవాళ్ళు అనుకోవాలేమో. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది. టీవీ. పత్రికల పొడ సోకని పల్లెటూళ్ళకి పారిపోతే కొంతైనా 'మన' అన్నది దొరుకుతుందేమో అని  !!!  

రాజముండ్రి వచ్చాక, రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే బస్సు లు ఉంటాయి అంటే వెళ్లిన ఒక పది నిమిషాలలో అన్నట్టుగానే ఒక బస్సు  వచ్చింది. కాస్త మెల్లగా వెళ్లినా గాని చాలా సౌకర్యంగా జాగ్రర్తగా మొత్తానికి ఇల్లు చేరుకున్నాను. చేరేసరికి తెల్లవారగట్ల 02:50 అయింది. అప్పటికి పడుకున్నాను. 


ఆలా అన్ని ఇబ్బందులు వచ్చినా కూడా స్వామి అనుగ్రహంతో వాటన్నిటిని అధిగమించి మొత్తానికి స్వామి దర్శనంతో పాటు నా ఎంగేజ్మెంట్ కూడా బాగా జరిగిపోయింది. 

ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి. 

"and, when you want something, all the universe conspires in helping you to achieve it" పాల్ కొయిలో "అల్కెమిస్ట్" అన్న పుస్తకంలో చెబుతాడు. 
    
సింపుల్ గా చెప్పవయ్యా అంటే నువ్వు  భగవంతుడిని నమ్మడమే తరువాయి. తరువాత అయన చూపించే మిరాకిల్స్ కి కొదవా !!! వస్తువో, వ్యక్తో, ప్రకృతో అంతటా ఆయనే. అన్నీ ఆయనే....  అద్భుతాలు చూపిస్తాడు. తట్టుకోలేరు. గంజాయి తాగే సాధువులో, ప్రేమ ఫెయిల్ అయినా ప్రేమికులను సినిమాలలో ఎలా చూపిస్తారో తెలుసుకదా ! అంతకన్నా ఆ ఇంటెన్సిటీ దారుణంగా ఉంటుంది మరి. ఆ తరువాత మీ ఇష్టం. ఆలోచించుకొని భక్తిలోకి దూకండి :).

కొసమెరుపు
-------------

పల్లకి సేవ చేద్దామా ! వద్దా ! అదేమో పద్ధతులు, నియమాలు మనకి తెలియవు. తెలిసి తెలియక సేవలో పాల్గొనాలో వద్దో, మళ్ళీ  ఏమి ఇబ్బందులు వచ్చి పడతాయో, పెద్ద పని పెట్టుకుంటానేమో అని డైలమాలో ఉండగానే,  భక్తులందరూ పల్లకి సేవ చేయరా అన్న చరణంతో ఆలయాన్ని అప్పుడు మారు మోగిస్తున్నారు ఇంక స్వామి ఆదేశం వచ్చాక చెప్పేదేముంది తప్పదు కదా !!! మీకైనా, నాకైనా మరి :).








శ్రీ పాదుల ఆలయంలో వున్న ప్రసాదం హాలు. ప్రసాదం చాలా బావుంది.


ఇంతకు ముందు అమ్మవారి పీఠికాలయం అసలుది వూళ్ళో  వున్నది అని చెప్పాను కదా ! ఆలయానికి ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు. నేను శ్రీ పాదుల ఆలయం నుంచి వస్తూ ఇలా బయటకు వచ్చాను.







Sunday, March 4, 2018

తిరుమలేశుని దర్శనం శ్రీవారి మెట్టు మార్గం నుంచి - గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దర్శనం.


"ఏకమేవ అద్వితీయం బ్రహ్మ " - ఉన్నది ఒక్కటే బ్రహ్మం. ప్రాజ్ఞులు దాన్ని వివిధ రూపాలలో  దర్శించారు అని వేదవేత్తలు పరబ్రహ్మాన్ని గురించి వివరిస్తారు.

ఒకవారంలో అరుణాచలేశ్వరుడు 'ఇన్నర్ పాత్' ప్రదక్షిణతో సహా అనుగ్రహిస్తే, శివకేశ అభేదం మరోసారి గుర్తుచేస్తూ ఆ తిరుమలేశుడు మరొకవారంలో దర్శనమిచ్చాడు. అక్కడా ఇక్కడా కూడా పాదయాత్రే. అక్కడ పాద యాత్ర గిరి ప్రదక్షిణ రూపంలో ఉంటే, ఇక్కడ శ్రీవారి మెట్టు దారి రూపంలో అంతే బేధం.   

అరుణాచల 'ఇన్నర్ పాత్' ప్రదక్షిణ మరొక పోస్టులో వివరంగా చెబుతాను. ప్రస్తుతానికి శ్రీ వారి మెట్టు మార్గం మరియు గుడిమల్లం యాత్ర, శ్రీకాళహస్తి రాహుకేతు పూజ గురించి తెలియజేసుకుంటాను. 

నాకు తిరుమల క్షేత్రంతో మీకు ఉన్నంత ఎక్కువ పరిచయం లేదు. మహా ఐతే జీవితంలో ఒక అయిదు సార్లు స్వామి దర్శనం చేసుకుని వుంటా. నాబోటి వారు ఇంకొందరు ఉండవచ్చునని వారి కోసం కొంచెం వివరంగా ఈ పోస్ట్.

ముందుగా చెప్పాలంటే ఇపుడు తిరుమల అంతా ఎక్కడ ఏమి కావాలన్నా ఆధార్ తో అనుసంధానం చేసారు కాబట్టి ఆధార్ తప్పనిసరి. వేలిముద్ర సరిపోతుంది కానీ కార్డు దగ్గర ఉంచుకుంటే మంచింది. కొన్ని చోట్ల కార్డు అవసరం పడుతుంది.  ఆలయం వారు నిర్వహించే "గోవిందా" ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాని, లేదా https://ttdsevaonline.com/  వెబ్సైటు లో కానీ మనం నమోదు చేసుకుని సేవలు, అద్దె గదులు వంటి సౌకర్యాలు పొందవచ్చు. . 

నేను ఉదయం సుమారు 4.30 ప్రాంతంలో తిరుపతి బస్సు స్టాండ్ లో దిగి పక్కనే 'శ్రీనివాసం' కాంప్లెక్స్  టి.టి.డి. వాళ్ళ ది ఉంటే అక్కడకి వెళ్లి కాలకృత్య,,స్నానాదులు ముగించుకుని, మరో ముగ్గురుతో తెలిసినవాళ్లతో పాటు శ్రీవారి మెట్టు మార్గానికి బయలుదేరాను. ఆలయం వారి ఉచిత బస్సు  ఉంది కాని కుదరలేదు. ఆటో వాళ్ళు  రేట్ ఎక్కువ చెబుతున్నారు. సరే అని వేరే బస్సు పట్టుకుని చంద్రగిరి శ్రీవారి మెట్టుమార్గం వద్ద దిగాము. 'శ్రీనివాసం' నుంచి ప్రయాణం ౩౦-40 నిముషాలు పట్టింది. అక్కడ లగేజి కౌంటర్లో లగేజి ఇచ్చి మెట్లమార్గంలో బయలుదేరాము. 

మొదటగా మెట్లమార్గంలో యాక్సిస్ కార్డు ఒకచోట ఇచ్చారు. ఆలా మెట్లు ఎక్కి వెళుతుంటే 1200 మెట్ల వద్ద అనుకుంటా, ఆధార్ తో లింక్ చేసారు. మీరు ఆధార్ కార్డు ఇవ్వనవసరం లేదు. మీ వేలిముద్ర చాలు. అన్ని వచ్చేస్తాయి. అంతకు మధ్య దారిలో ఒక స్టాంప్ ముద్ర కూడా వేసినట్టు గుర్తు. తరువాత శ్రీ వారి మెట్టు నుంచి నడక పూర్తి చేసి పైకి చేరిన తరువాత ఒక స్టికర్ వేశారు. సాయంత్రం దర్శనం 5  గంటలకి ఇచ్చారు. ఇన్ని దశలలో తనిఖీ వ్యవస్థ పకడ్భందిగా ఏర్పాటు చెయ్యటం వల్ల అక్రమాలకు చోటుండదు అనిపించింది. 

లగేజి కౌంటర్ లో లగేజి ఇంకా రాలేదు. కొంచెం టైం పడుతుంది అన్నారు. సరేలెమ్మని మా కజిన్ మ్యారేజ్ ఉంటే చూసుకుని వచ్చా (అసలు వచ్చిందే వాడి పెళ్లి నెపముమీద :) ).        

శ్రీవారి మెట్టు మార్గం నుంచి  ఒకరోజుకి 6 వేల టోకెన్స్ ఇస్తున్నారు. అలిపిరి నుంచి 14000 టోకెన్స్ ఇస్తున్నారు. టోకెన్స్ అయిపోతే దివ్య దర్శనం ఉండదు. సర్వదర్శనం లో వెళ్ళటమే (ఉచిత దర్శనం). 70 రూపాయలు పెడితే నాలుగు లడ్లు ఇస్తారు. ఇరవై ఐతే రెండు. 

మా వాళ్ళందరూ వివిధ సేవలు, గట్రా బుక్ చేసుకోవటం వల్ల వాళ్ళకోసం తిరిగి, తిరిగి తిరుమల కొండలు కొద్దిగా తెలిసాయి అనిపించింది. వాళ్ళ దెబ్బకి తిరుమల ఏరియా కొద్దోగొప్పో పరిచయం అయింది అనుకోండి :). స్వామి లీల.

సాయంత్రం పుష్కరిణి లో స్నానం చేసుకుని వరాహ స్వామి దర్శనం చేసుకుని, అక్కడినుంచి దివ్య దర్శం లైనులోకి ప్రవేశించాను. గంధోత్సవం జరుగుతుంది అని ౩౦ నిముషాలు బ్రేక్ ఇచ్చారు. ప్రధాన ఆలయం దగ్గరే ఉండటం వల్ల అస్సలు తోసుకోవడాలు, లాగిపడెయ్యటాలు లేకుండా ప్రశాంతంగా దర్శనం జరిగింది. అప్పటిదాకా పడ్డ కష్టం, శ్రమ, నిరీక్షణ - సంతోషంగా మారిపోయింది. అదే తిరుమలేశుని, ఆ కలియుగ దైవం మహిమ అనుకుంట. ఎన్నిరోజులు పట్టినా, వేచినా ఒక్క క్షణం ఆయన చూడటంతోనే అన్ని బాధలు మర్చిపోయి ఆనందంలో ఓలలాడుతాము.

రాత్రి 11 గంటల వరకు వెంగమాంబ సత్రంలో అన్నప్రసాద వితరణ చేస్తారు అని తెలిసి అక్కడికి వెళ్ళాము. ఇది ప్రధాన ఆలయం నుంచి పుష్కరిణి కెళ్ళే మాడ వీధి దారి చివర ఎడమపక్కకి తిరిగితే వరాహస్వామి ఆలయం, పుష్కరిణి, అదే కుడి పక్కకి తిరిగితే ఎదురుగా వెంగమాంబ అన్నదాన సత్రం అని కనిపిస్తుంది. లోపల అత్యద్భుతమైన ఫోటో పెయింటింగ్ కనపడింది. మా వాళ్ళు  ఫోటో వచ్చేటప్పుడు తీద్దామంటే వచ్చేయటం వల్ల మిస్ అయ్యాను. చాలా బావుంది. 

అన్నప్రసాద భోజనం చాలా రుచిగా వుంది. ప్రసాదానికి రుచి ఏమిటి అనుకోకండి గాని అంత అత్యధ్బుతంగా ఈ మధ్య ఎక్కడా తినలేదు అంటే నమ్మండి. భగవంతుని కార్యంలో సహాయపడటానికే కొన్ని జీవితాలు ఆవిర్భవిస్తాయి అనిపిస్తుంది. ఆరోజు వెంగమాంబ గారి త్యాగమే కదా, ఈరోజు ఇన్ని లక్షల అన్నార్తులకి ప్రసాద రూపంగా స్వామి అనుగ్రహం దొరుకుతుంది. కానీ ఆ రోజు ఆవిడ జీవితం మిగతావారి వలే ఉంటే ఇంత మంది ఉద్ధరింపక పోయేవారా !. ఆరోజు ఆవిడ గడిపిన జీవితం మిగతావారి లాగా వివాహం, పిల్లలు, మళ్ళీ  వాళ్ళ పెళ్లిళ్లు లాంటివి కాదు కాబట్టి సమకాలీన జనాల విమర్శలకి గురికాక తప్పకపోవచ్చు. కాని ఆ జీవి జీవిత అర్థం, పరమార్థం, తత్వం వారి తరంలోనో, తదనంతరమో అందరికీ అర్థం అవుతుంది. నిజానికి ఏ భగవత్ భక్తుడికైనా, మహనీయుడికైనా, మరొకరి జీవితాలకైనా ఇదే సూత్రం అమలవుతుందేమో !  

ఇక, ఆ తరువాత రోజు గుడిమల్లం దర్శనానికి వెళ్ళాము. గుడి చూడగానే అభివృద్ధికి ఆమడ దూరంలో, ప్రకృతికి దగ్గరగా వున్నట్లుగా అనిపించింది. చాలా పురాతనమైన ఆలయం. అరవై సంవత్సరాల కొకసారి సువర్ణముఖి నదీ జలాలు స్వామిని ఒక సొరంగం నుంచి వచ్చి అభిషేకిస్తాయి అని చెప్పారు. మునుపు 2005 లో ఒకసారి ఇలా జరిగితే ఆక్కడ క్యాషియర్ గా ఉన్నావిడ ఆ జలాలతో స్నానమాచరించినట్టు చెప్పారు. ఆవిడ ఈ సంగతి చెప్పారు మాకు. 

ఆలయం వెనుకాల ఉన్న ఒక సరస్సుకి ఒక కథ చెప్పారు. ఆ సరస్సులో ఒకే ఒక కమలం రోజు పూసుండేది అనీ, దానికి బ్రహ్మ గారు కాపలా అనీ, అంతేకాక పరశురాముడు ఆ కమలాన్ని రోజూ శివ పూజకి ఆలయంలో వినియోగించే వాడంట. ఒక రోజు పూజ ఆలస్యం ఐతే బ్రహ్మ ఆ పువ్వు తో శివ పూజ చేసాడు అని తెలిసి పరశురాముడు ఆగ్రహించి బ్రహ్మ పై యుద్ధం చేస్తాడు. అది కొన్ని రోజులపాటు జరిగింది. చివరగా పరమశివుడు ప్రత్యక్షమయి వారి రిరువురిని అనుగ్రహించాడంట. ఆ విషయమే ప్రతీకాత్మకంగా మనం ఇపుడు ఇక్కడ గుడిమల్లంలో చూసే శివుడి లింగ స్వరూపం అని తెలిసింది. అంతేకాదు స్వామి వారు ఇక్కడ స్వయంభు. మరిన్ని విషయాలు శాసనాలు, పామ్ప్లేట్ ఫోటోలు పెట్టాను చూడండి ఒకసారి. 

ఇక్కడ పనిచేసే పూజారి గారు వచ్చిన ప్రతిఒక్కరికి, స్థలపురాణం చెబుతూ ఓపికగా చేసే పూజ  చాలా సంతోషాన్ని కలిగించింది.  

ఒకసారి ఒక ఉత్తరాది అయన ప్యాకేజీ బస్సు  యాత్రలో భాగంగా, అరుణాచలంలో అప్పుడే అందరితోపాటు వచ్చారు. నా దగ్గరకొచ్చి - బాబు, ఇది మధురై టెంపుల్ యేనా అని అడిగాడు. నేను షాక్ తిన్నా. అది ఆయన గమనించాడో లేదో తెలియదు గాని నేను మాత్రం ఇది అరుణాచలం / తిరువణ్ణామలై ఆలయం అండి అని కొద్దిగా వివరించి చెప్పా.  దానికాయన "ఏమి అనుకోకు బాబు ! మేము వరసగా ఆలయాలు చూసుకుంటూ వస్తున్నాము. వరసలో ఈ  ఆలయం ఇది మధురై ఆలయమెమో అని అడిగా ఏమీ అనుకోకు బాబు" అని హిందీలో చెప్పాడు :(. 

ఆ వయస్సులో ఆ పెద్దాల యాత్రకి నిజంగా అభినందించవచ్చు గాని, నిజానికి మనందరం ఎపుడో ఒకసారి ఇలా ప్యాకేజీ టూర్స్ కి పోయినవాళ్ళమే. 

ఏముంటుంది అంతా ఉరుకులు, పరుగులు తప్ప. వెళ్లే క్షేత్రం గురించి గాని, కనీసం స్థలపురాణం గురించి గాని, అస్సలు దర్శించే విధానం గాని ఏదీ మనక్కరలేదు. అసలు మూలమూర్తి దర్శనానికి ముందు పరివార దేవతా దర్శనంగాని, వారి అనుమతి అనుగ్రహం తీసుకోవాలి అన్న స్పృహ గాని, ఖాళీ గాని మనకి లేకపోయాయే ఇంక ఏమి ఉందని మాట్లాడుకోవడానికి. 

టికెట్ రేట్ చూసుకోవటం, ఎంత తొందరగా వీలు ఐతే అంతా తొందరగా స్పెషల్ దర్శనంతో మూలమూర్తిని దర్శించుకోవడం. అక్కడనుండి హమ్మయ్య అయిపొయింది అనుకుని బయటపడి మళ్ళీ  మన మన గందరగోళ జీవితాలలో వేగంగా దూకేయ్యటం. ఆలోచించండి అస్సలు.... మన ఆత్మని మిస్ అవుతున్నాం. 'ఎసెన్స్ 'ని మిస్ అవుతున్నాము. అనుభూతికి, అనుభవానికి, ఆత్మకి సంబంధం లేకుండా 'గుడికి దగ్గరై, దేవుడికి దూరం' అయిపోతున్నాము :(. 

సరే ఆ విషయాలు ఆలా ఉంచితే, గుడిమల్లంలో అభిషేకం టికెట్ ధర 500 రూపాయలు.  ఒకవేళ మనం వేరే వూరు / రాష్ట్రంలో వున్నాము, అభిషేకంకి రాలేకపోతామంటే వారు మన గోత్రనామాదులతో అభిషేకం చేసి ప్రసాదాన్ని కొరియర్ చేస్తాము అని చెప్పారు. నాది అదే పరిస్థితి కాబట్టి నేను సంతోషంగా అలానే చెయ్యండి అని వివరాలిచ్చా. డబ్బులు చెల్లించి రసీదు తీసుకున్నాక,  మెడలో పైపంచె వేసి (మనకి ఇలాంటివి కొత్త, కొంచెం సిగ్గు కూడా :) ) పంతులుగారి చేత ఆశీస్సులు ఇప్పించి రెండు లడ్లు ప్రసాదంగా ఇచ్చారు.

ఇక ఇక్కడ రవాణా సౌకర్యాలు మాట్లాడాలి అంటే అవి కొంచెం తక్కువే అనే చెప్పాలి. 

బస్సు గంటకి ఒకటి మాత్రమే అనుకుంట. అందుకని ఆటో వస్తుంటే రేణిగుంట వెళ్ళాలి అంటే కండ్రిక అనుకుంట పేరు సరిగా గుర్తు లేదు కాని అక్కడ దింపి, అక్కడ నుంచి రేణిగుంటకు ఆటోలు బస్సులు ఉంటాయి అని చెప్పాడు. సరి అని ఆటోలో ఆ ఊరు చేరిన వెంటనే ధర్మరాజు, ద్రౌపది దేవాలయం అంటూ కనపడింది. ఇదే చాగంటి వారు చెప్పింది అన్న విషయం గుర్తుకువచ్చింది కానీ అది దాటిపోయి వూరు సెంటర్ చేరాక ఇంక వెనక్కి రాలేదు. 

అక్కడ ఆటోలు అవీ బానే వున్నాయి. అక్కడ ఒక ఆటో పట్టుకుని మనిషికి పది ఇచ్చి రేణిగుంట చేరుకున్నాము. ఆ ఆటో ప్రయాణం మంచి అనుభూతిని ఇచ్చింది. ఆటో వెనకాల నాతోపాటు ఇద్దరు కూర్చోవటంతో, కాస్త సినిమాలో చూపించే కాలేజీ రోజులు, చిన్నతనపు రోజులు గుర్తుకువచ్చి కాళ్ళు ఊపుకుంటూ, పాటలు వింటూ చిన్నపిల్లలం అయిపోయాము. 

రేణిగుంట చేరగానే విజయవాడ బస్సు  వచ్చింది.  అది పట్టుకుని మధ్యాహ్నం 12 కల్లా శ్రీకాళహస్తి చేరిపోయాము.

నా జాతక రీత్యా  రాహుకేతు పూజ ఒకటి పెండింగ్ ఉండటం వల్ల మా వాళ్లకి లేట్ అవుతుంది అని వాళ్ళని దర్శనం చేసుకుని బెంగళూరు వెళ్ళమని నేను రాహుకేతు పూజకి వెళ్ళిపోయాను. ప్రతిరోజూ కూడా రోజులో కొంత సమయం రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో రాహుకేతు పూజ చేయించుకుంటే అత్యధిక ఫలితం ఉంటుంది. అంతే కాదు కొన్ని నక్షత్రాలు, తిథులు, గ్రహణం అవీ కూడా చెబుతారు. 

నేను వెళ్లిన రోజు ఆదివారం. కాబట్టి రాహుకాలం సాయంత్రం 4:౩౦ నుంచి మొదలు అవుతుంది. నాకు లేట్ అయిపోతుంది కాబట్టి మధ్యాహ్నం స్లాట్ లోనే చేయించుకున్నాను. 

రాహుకేతు పూజ టికెట్ మునుపు ౩౦౦ రూపాయల టికెట్ ఉండేది. అది 500 రూపాయలు చేసారు ఇపుడు. పైగా ౩౦౦ టికెట్ కొద్దిగా ఆలస్యం కూడా అవుతుంది, నాగ పడగలు కొంచెం చిన్న సైజు లో ఉంటాయి. కానీ అసలు రాహుకేతు పూజలు ౩౦౦ రూపాయల టికెట్ (అదే ఇపుడు ౫౦౦ టికెట్) మండంపంమే ఉత్తమం. మొదటినుంచి కూడా రాహుకేతు పూజలు అక్కడే చేసేవారు కాబట్టి నువ్వు  అక్కడే చేసుకో అని నాతో వచ్చిన స్నేహితుడు చెప్పాడు కాని సమయాభావం వల్ల తప్పక 750 రూపాయల రాహుకేతు పూజ టికెట్ కి వెళ్ళవలసి వచ్చింది. సంకల్పం, వికల్పం రెండూ అయన సృష్టే కదా ! 

పూజ సామగ్రి అంతా వారే ఇస్తారు. (ఇంతకు ముందు ఒక పోస్ట్ లో ఈ వివరాలు వివరంగా చెప్పాను). పూజ మొత్తం కలిపి ఒక నలభై నిముషాలు ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ బాషలలో చెబుతారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అర్థంకాకపోతే పక్కవాళ్ళు ఎలా చేస్తే ఆలా చెయ్యండి :). పూజ అయ్యాక స్నానాదులు. బట్టలు తడుపుకోవటం లాంటివి ఏ సంప్రదాయాలు లేవు అని కూడా చెబుతారు. కాబట్టి అవన్నీ ఎలా అని ఆందోళన చెందకండి. 

పూజ అయ్యాక వెండి నాగ పడగలను శ్రీకాళహస్తీస్వర స్వామి దర్శనం తరువాత ముమ్మారు తల చుట్టూ తిప్పుకుని (దిష్టి తీస్తాం కదా అలా) హుండీలో వేసెయ్యటంతో రాహుకేతు పూజ సమాప్తం అవుతుంది. అలా అక్కడ స్వామి దర్శనం ముగించుకుని అటు తరువాత బయటకి ప్రదక్షిణ పూర్వకంగా వస్తుంటే కనిపించే దేవీ, దేవతలా దర్శనంతో పాటు జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవటమే. అమ్మవారి పేరుకు తగ్గట్టే ఇక్కడో గమ్మత్తు జరిగింది. 

అమ్మవారి గుడిలోకి వెళ్ళబోయేటంతలోనే అమ్మవారి మూలమూర్తి జాగ్రర్త అని హెచ్చరిస్తున్నట్టు అనిపించటంతో అదేంటి ఇలా అనిపిస్తుంది అన్న ఆలోచనతో అడుగు మెల్లగా వేసాను. చూస్తే కింద కొబ్బరి పెంకు. కొంచెం ఉంటే రక్తం చిందేదే. బతికిపోయాను అమ్మవారి కరుణ అని అప్పుడు అర్థం అయింది అమ్మవారి రూపం చూస్తుంటే ఎందుకు ఆలా అనిపించిందో. పెంకు తీసి పక్కన పడవేసి అమ్మవారి కరుణకి  కృతజ్ఞత తెలుపుకున్నా. ఐతే అయిపొయింది అనుకోకండి అసలు విషయం కొసమెరుపులో. 

అన్నప్రసాదం దగ్గర జనాలు నిరీక్షణవల్ల ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఆలస్యం అవుతుంది అని పులిహోర, లడ్డు ప్రసాదాలు తీసుకుని ఆత్మారాముని శాంతింప చేసి ఒక బస్సు పట్టుకుని తిరుపతి బయలుదేరాను. 

తిరుపతిలో సాయంత్రం బెంగళూరుకి బస్సు విషయంలో ఇబ్బంది పడ్డాను. నార్మల్ బస్సులకు కూడా రిజర్వేషన్ అన్నారు. ఎన్ని బస్సులు చూసినా కూడా అంతే. స్వామి ఏమి ఈ పరీక్ష. ఈరోజు ఇన్ని పూజలు, దర్శనాలు అయ్యాయి కాబట్టి తిరుగుండదు అని తెలుసు గాని కాకపోతే మన సంగతి తెలుసుకదా ! 

పీకలు దాకా ఊబిలో మునిపోయా అనే సమయానికి జుట్టు పట్టుకుని పైకి లేపుతాడు మా స్వామి, అలాగే లాగి వొడ్డున పడేస్తాడు :). ఆ లోపు, విసుగు, విరామం లేని ప్రయత్నం, దాహం, అలసట, కోపం, చిరాకు ఇవ్వని భరించాలి మరి. మన పాప కర్మ తీయాలి కదా :). చెమట పట్టించేది వాడే. ఏ.సి. పెట్టేది వాడే. మొన్నేదో సినిమాలో చెప్పినట్టు తలమీద ఒక్కట్టిచ్చుకుని ఏడిచేలోపు చేతిలో ఐసుక్రీము పెట్టేస్తాడు :p.

అన్ని బస్సులు అడగటం, వాళ్ళు దొబ్బేయ్యమనటం కొంచెంసేపు జరిగాక ఏంది సామి ఈ పరీక్షలు ఇంక చాలు ఓపికలేదు అనేసరికి  'బ్లాబ్లా' కార్ వెబ్సైటు గుర్తుకువచ్చింది. మీకు తెలిసే ఉంటుంది కార్ రైడ్ షేరింగ్ వెబ్సైటు అది. అంటే ఊర్లు పోయేవారు వారితో పాటు ఎక్కించుకుని వెళ్లే దారిలో దింపుతారు. అది కొంత ప్రయత్నం తరువాత ఫలించి స్విఫ్ట్ కార్ దొరికింది. 500 రూపాయలు ఛార్జ్. 

స్విఫ్ట్ కార్ అబ్బాయి పేరు 'ప్రసాద్' అని చెప్పాడు. పేరు నాకు దేవుడి ప్రసాదంలా స్ఫురించింది. పైగా వాళ్ళు మనకి చుట్టాలే. అదే అండి వాళ్ళ  నాన్నగారు ఎండోమెంట్ శాఖలో పని చేస్తారు అంట. ఇంకేముంది ఎండోమెంట్ శాఖ అంటే మన భక్తులందరికి చూట్టాలె కదా!. పెద్దాయన మనకోసం కదిలాడా !  ఇంక మనం ప్రమాదాలు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఆటంకాలు అన్న మాటలు, ఆలోచనలు ఉండవు అంతే. రేపు ఆఫీస్ పోతుంది అనుకున్నవాడిని 11 కల్లా బెంగళూరులో వున్నా. అద్గదీ సంగతి :).

కొసమెరుపేమిటంటే ప్రతీక్షణం అయన చూపే లీలలు, నిదర్శనాలు రాయాలంటే ఒక బుక్ అవుతుంది అంత ఓపిక కూడా లేదు కాబట్టి ఒక్కటి మాత్రం చెబుతాను. మీకు కనెక్ట్ అయ్యేలా చెప్పాలంటే ప్రేమికుడు, ప్రేమికురాలు మధ్య  సంభాషణలో ఎన్ని సార్లు ప్రేమ కనబడుతుందో, భక్తుడికి, భగవంతునికి మధ్య  అన్ని లీలలు, అంత అనుబంధం కనిపిస్తుంది. చెప్తే అవీ ఇతరులకి అర్థం కావు గాని అవి వారికి మాత్రమే అర్థం అవుతాయి అనుక్షణం పరవశత్వానికి లోను చేస్తుంటాయి.    

సరే కొసమెరుపుకి వస్తే....

మొన్న అరుణాచలం ప్రదక్షిణ చేస్తూ సత్సంగంలో భాగంగా అరుణాచలంలో కాలు తెగినా కూడా ఎవరూ కట్టుకట్టకూడదు అని అది ఒక్క అమ్మవారి హక్కు మాత్రమే అని, ఆవిడే తన చీర చింపి కట్టుకడుతుంది అని అరుణాచల స్థలపురాణంలో వున్నట్టుగా మాట్లాడుకున్నాము. 

సైన్స్ , గణితం చదివిన మన బుర్రలకి, వాటికి నేర్పిన లాజిక్ లు వూరికే వుండవు కదా !  అలాగే భక్తి, ఆధ్యాత్మికత అనే విషయాలు నేర్చిన మన ఆత్మ  కూడా ఉండనే వుంది. అటు లాజిక్, ఇటు నమ్మకం ఈ రెండూ కూడా మనలిని విడిచివుండవు కాబట్టి వెంటనే ఆ విషయం గురించి మాట్లాడుకున్నంతలోనే రకరకాల ఆలోచనలు ముసురుకున్నాయి. 

అమ్మవారు నిజంగా అలా వచ్చి కట్టు కడతారా ! నిజంగా ఆలా జరుగుతుందా ! ఇలా ఎన్నిసార్లు జరిగి ఉంటుంది. ఒకవేళ ఆలా జరగకపోతే ప్రమాదానికి గురి అయినవాడు పోతాడు కదా ! ఎంత వరకు సమయం ఉంటుంది  వేచి చూడటానికి .....ఇది మనకి సైన్స్  నేర్పిన ఆలోచనలు. 

నీకు నిజంగా అంతా నమ్మకం ఉందా ! ఉంటే స్థలపురాణంలో చెప్పిన ఒక్కమాట పొల్లుపోదు గాక పోదు. ఆ నమ్మకంతో చూడు. పైనుంచి అమ్మ దిగి వచ్చి తీరుతుంది. నా ప్రాణం కూడా నాకు లెక్కలేదు, అన్నీ అమ్మే చూసుకుంటుంది / పెద్దాయన చూసుకుంటాడు అనే దృఢ నిశ్చయం, తెగువ, దైర్యం, నమ్మకం ఉందా నీకు .....ఉంటే మాట్లాడు... లేకపోతె లేదు. నమ్మావా ! జరిగి తీరుతుంది మరో మాట లేదు.....  ఇది ఆధ్యాత్మిక కోణం.

మనం ఇంత డెప్త్ కి వెళ్ళిపోతే ...ఇవ్వన్నీ కాదు కాని నాన్నా, నేను ఉండగా అస్సలు ప్రమాదం ఎందుకు వస్తుంది నాన్నా!!! అని శ్రీకాళహస్తిలో ప్రత్యక్షంగా అనుభవం చేయించింది. వందసార్లు ఒకే ప్రయోగం చేస్తే అదే ఫలితం సైన్స్ లో వస్తుందో లేదో నాకు తెలియదు గాని, ప్రతీసారి సైన్స్  మీద 'భగవంతునిపై నమ్మకం'దే పైచేయి అవ్వటం మరోసారి నాకు నిరూపణ జరిగిపోయింది !!!.