"ఏకమేవ అద్వితీయం బ్రహ్మ " - ఉన్నది ఒక్కటే బ్రహ్మం. ప్రాజ్ఞులు దాన్ని వివిధ రూపాలలో దర్శించారు అని వేదవేత్తలు పరబ్రహ్మాన్ని గురించి వివరిస్తారు.
ఒకవారంలో అరుణాచలేశ్వరుడు 'ఇన్నర్ పాత్' ప్రదక్షిణతో సహా అనుగ్రహిస్తే, శివకేశ అభేదం మరోసారి గుర్తుచేస్తూ ఆ తిరుమలేశుడు మరొకవారంలో దర్శనమిచ్చాడు. అక్కడా ఇక్కడా కూడా పాదయాత్రే. అక్కడ పాద యాత్ర గిరి ప్రదక్షిణ రూపంలో ఉంటే, ఇక్కడ శ్రీవారి మెట్టు దారి రూపంలో అంతే బేధం.
అరుణాచల 'ఇన్నర్ పాత్' ప్రదక్షిణ మరొక పోస్టులో వివరంగా చెబుతాను. ప్రస్తుతానికి శ్రీ వారి మెట్టు మార్గం మరియు గుడిమల్లం యాత్ర, శ్రీకాళహస్తి రాహుకేతు పూజ గురించి తెలియజేసుకుంటాను.
నాకు తిరుమల క్షేత్రంతో మీకు ఉన్నంత ఎక్కువ పరిచయం లేదు. మహా ఐతే జీవితంలో ఒక అయిదు సార్లు స్వామి దర్శనం చేసుకుని వుంటా. నాబోటి వారు ఇంకొందరు ఉండవచ్చునని వారి కోసం కొంచెం వివరంగా ఈ పోస్ట్.
ముందుగా చెప్పాలంటే ఇపుడు తిరుమల అంతా ఎక్కడ ఏమి కావాలన్నా ఆధార్ తో అనుసంధానం చేసారు కాబట్టి ఆధార్ తప్పనిసరి. వేలిముద్ర సరిపోతుంది కానీ కార్డు దగ్గర ఉంచుకుంటే మంచింది. కొన్ని చోట్ల కార్డు అవసరం పడుతుంది. ఆలయం వారు నిర్వహించే "గోవిందా" ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాని, లేదా https://ttdsevaonline.com/ వెబ్సైటు లో కానీ మనం నమోదు చేసుకుని సేవలు, అద్దె గదులు వంటి సౌకర్యాలు పొందవచ్చు. .
నేను ఉదయం సుమారు 4.30 ప్రాంతంలో తిరుపతి బస్సు స్టాండ్ లో దిగి పక్కనే 'శ్రీనివాసం' కాంప్లెక్స్ టి.టి.డి. వాళ్ళ ది ఉంటే అక్కడకి వెళ్లి కాలకృత్య,,స్నానాదులు ముగించుకుని, మరో ముగ్గురుతో తెలిసినవాళ్లతో పాటు శ్రీవారి మెట్టు మార్గానికి బయలుదేరాను. ఆలయం వారి ఉచిత బస్సు ఉంది కాని కుదరలేదు. ఆటో వాళ్ళు రేట్ ఎక్కువ చెబుతున్నారు. సరే అని వేరే బస్సు పట్టుకుని చంద్రగిరి శ్రీవారి మెట్టుమార్గం వద్ద దిగాము. 'శ్రీనివాసం' నుంచి ప్రయాణం ౩౦-40 నిముషాలు పట్టింది. అక్కడ లగేజి కౌంటర్లో లగేజి ఇచ్చి మెట్లమార్గంలో బయలుదేరాము.
మొదటగా మెట్లమార్గంలో యాక్సిస్ కార్డు ఒకచోట ఇచ్చారు. ఆలా మెట్లు ఎక్కి వెళుతుంటే 1200 మెట్ల వద్ద అనుకుంటా, ఆధార్ తో లింక్ చేసారు. మీరు ఆధార్ కార్డు ఇవ్వనవసరం లేదు. మీ వేలిముద్ర చాలు. అన్ని వచ్చేస్తాయి. అంతకు మధ్య దారిలో ఒక స్టాంప్ ముద్ర కూడా వేసినట్టు గుర్తు. తరువాత శ్రీ వారి మెట్టు నుంచి నడక పూర్తి చేసి పైకి చేరిన తరువాత ఒక స్టికర్ వేశారు. సాయంత్రం దర్శనం 5 గంటలకి ఇచ్చారు. ఇన్ని దశలలో తనిఖీ వ్యవస్థ పకడ్భందిగా ఏర్పాటు చెయ్యటం వల్ల అక్రమాలకు చోటుండదు అనిపించింది.
లగేజి కౌంటర్ లో లగేజి ఇంకా రాలేదు. కొంచెం టైం పడుతుంది అన్నారు. సరేలెమ్మని మా కజిన్ మ్యారేజ్ ఉంటే చూసుకుని వచ్చా (అసలు వచ్చిందే వాడి పెళ్లి నెపముమీద :) ).
శ్రీవారి మెట్టు మార్గం నుంచి ఒకరోజుకి 6 వేల టోకెన్స్ ఇస్తున్నారు. అలిపిరి నుంచి 14000 టోకెన్స్ ఇస్తున్నారు. టోకెన్స్ అయిపోతే దివ్య దర్శనం ఉండదు. సర్వదర్శనం లో వెళ్ళటమే (ఉచిత దర్శనం). 70 రూపాయలు పెడితే నాలుగు లడ్లు ఇస్తారు. ఇరవై ఐతే రెండు.
మా వాళ్ళందరూ వివిధ సేవలు, గట్రా బుక్ చేసుకోవటం వల్ల వాళ్ళకోసం తిరిగి, తిరిగి తిరుమల కొండలు కొద్దిగా తెలిసాయి అనిపించింది. వాళ్ళ దెబ్బకి తిరుమల ఏరియా కొద్దోగొప్పో పరిచయం అయింది అనుకోండి :). స్వామి లీల.
సాయంత్రం పుష్కరిణి లో స్నానం చేసుకుని వరాహ స్వామి దర్శనం చేసుకుని, అక్కడినుంచి దివ్య దర్శం లైనులోకి ప్రవేశించాను. గంధోత్సవం జరుగుతుంది అని ౩౦ నిముషాలు బ్రేక్ ఇచ్చారు. ప్రధాన ఆలయం దగ్గరే ఉండటం వల్ల అస్సలు తోసుకోవడాలు, లాగిపడెయ్యటాలు లేకుండా ప్రశాంతంగా దర్శనం జరిగింది. అప్పటిదాకా పడ్డ కష్టం, శ్రమ, నిరీక్షణ - సంతోషంగా మారిపోయింది. అదే తిరుమలేశుని, ఆ కలియుగ దైవం మహిమ అనుకుంట. ఎన్నిరోజులు పట్టినా, వేచినా ఒక్క క్షణం ఆయన చూడటంతోనే అన్ని బాధలు మర్చిపోయి ఆనందంలో ఓలలాడుతాము.
రాత్రి 11 గంటల వరకు వెంగమాంబ సత్రంలో అన్నప్రసాద వితరణ చేస్తారు అని తెలిసి అక్కడికి వెళ్ళాము. ఇది ప్రధాన ఆలయం నుంచి పుష్కరిణి కెళ్ళే మాడ వీధి దారి చివర ఎడమపక్కకి తిరిగితే వరాహస్వామి ఆలయం, పుష్కరిణి, అదే కుడి పక్కకి తిరిగితే ఎదురుగా వెంగమాంబ అన్నదాన సత్రం అని కనిపిస్తుంది. లోపల అత్యద్భుతమైన ఫోటో పెయింటింగ్ కనపడింది. మా వాళ్ళు ఫోటో వచ్చేటప్పుడు తీద్దామంటే వచ్చేయటం వల్ల మిస్ అయ్యాను. చాలా బావుంది.
అన్నప్రసాద భోజనం చాలా రుచిగా వుంది. ప్రసాదానికి రుచి ఏమిటి అనుకోకండి గాని అంత అత్యధ్బుతంగా ఈ మధ్య ఎక్కడా తినలేదు అంటే నమ్మండి. భగవంతుని కార్యంలో సహాయపడటానికే కొన్ని జీవితాలు ఆవిర్భవిస్తాయి అనిపిస్తుంది. ఆరోజు వెంగమాంబ గారి త్యాగమే కదా, ఈరోజు ఇన్ని లక్షల అన్నార్తులకి ప్రసాద రూపంగా స్వామి అనుగ్రహం దొరుకుతుంది. కానీ ఆ రోజు ఆవిడ జీవితం మిగతావారి వలే ఉంటే ఇంత మంది ఉద్ధరింపక పోయేవారా !. ఆరోజు ఆవిడ గడిపిన జీవితం మిగతావారి లాగా వివాహం, పిల్లలు, మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్లు లాంటివి కాదు కాబట్టి సమకాలీన జనాల విమర్శలకి గురికాక తప్పకపోవచ్చు. కాని ఆ జీవి జీవిత అర్థం, పరమార్థం, తత్వం వారి తరంలోనో, తదనంతరమో అందరికీ అర్థం అవుతుంది. నిజానికి ఏ భగవత్ భక్తుడికైనా, మహనీయుడికైనా, మరొకరి జీవితాలకైనా ఇదే సూత్రం అమలవుతుందేమో !
ఇక, ఆ తరువాత రోజు గుడిమల్లం దర్శనానికి వెళ్ళాము. గుడి చూడగానే అభివృద్ధికి ఆమడ దూరంలో, ప్రకృతికి దగ్గరగా వున్నట్లుగా అనిపించింది. చాలా పురాతనమైన ఆలయం. అరవై సంవత్సరాల కొకసారి సువర్ణముఖి నదీ జలాలు స్వామిని ఒక సొరంగం నుంచి వచ్చి అభిషేకిస్తాయి అని చెప్పారు. మునుపు 2005 లో ఒకసారి ఇలా జరిగితే ఆక్కడ క్యాషియర్ గా ఉన్నావిడ ఆ జలాలతో స్నానమాచరించినట్టు చెప్పారు. ఆవిడ ఈ సంగతి చెప్పారు మాకు.
ఆలయం వెనుకాల ఉన్న ఒక సరస్సుకి ఒక కథ చెప్పారు. ఆ సరస్సులో ఒకే ఒక కమలం రోజు పూసుండేది అనీ, దానికి బ్రహ్మ గారు కాపలా అనీ, అంతేకాక పరశురాముడు ఆ కమలాన్ని రోజూ శివ పూజకి ఆలయంలో వినియోగించే వాడంట. ఒక రోజు పూజ ఆలస్యం ఐతే బ్రహ్మ ఆ పువ్వు తో శివ పూజ చేసాడు అని తెలిసి పరశురాముడు ఆగ్రహించి బ్రహ్మ పై యుద్ధం చేస్తాడు. అది కొన్ని రోజులపాటు జరిగింది. చివరగా పరమశివుడు ప్రత్యక్షమయి వారి రిరువురిని అనుగ్రహించాడంట. ఆ విషయమే ప్రతీకాత్మకంగా మనం ఇపుడు ఇక్కడ గుడిమల్లంలో చూసే శివుడి లింగ స్వరూపం అని తెలిసింది. అంతేకాదు స్వామి వారు ఇక్కడ స్వయంభు. మరిన్ని విషయాలు శాసనాలు, పామ్ప్లేట్ ఫోటోలు పెట్టాను చూడండి ఒకసారి.
ఇక్కడ పనిచేసే పూజారి గారు వచ్చిన ప్రతిఒక్కరికి, స్థలపురాణం చెబుతూ ఓపికగా చేసే పూజ చాలా సంతోషాన్ని కలిగించింది.
ఒకసారి ఒక ఉత్తరాది అయన ప్యాకేజీ బస్సు యాత్రలో భాగంగా, అరుణాచలంలో అప్పుడే అందరితోపాటు వచ్చారు. నా దగ్గరకొచ్చి - బాబు, ఇది మధురై టెంపుల్ యేనా అని అడిగాడు. నేను షాక్ తిన్నా. అది ఆయన గమనించాడో లేదో తెలియదు గాని నేను మాత్రం ఇది అరుణాచలం / తిరువణ్ణామలై ఆలయం అండి అని కొద్దిగా వివరించి చెప్పా. దానికాయన "ఏమి అనుకోకు బాబు ! మేము వరసగా ఆలయాలు చూసుకుంటూ వస్తున్నాము. వరసలో ఈ ఆలయం ఇది మధురై ఆలయమెమో అని అడిగా ఏమీ అనుకోకు బాబు" అని హిందీలో చెప్పాడు :(.
ఆ వయస్సులో ఆ పెద్దాల యాత్రకి నిజంగా అభినందించవచ్చు గాని, నిజానికి మనందరం ఎపుడో ఒకసారి ఇలా ప్యాకేజీ టూర్స్ కి పోయినవాళ్ళమే.
ఏముంటుంది అంతా ఉరుకులు, పరుగులు తప్ప. వెళ్లే క్షేత్రం గురించి గాని, కనీసం స్థలపురాణం గురించి గాని, అస్సలు దర్శించే విధానం గాని ఏదీ మనక్కరలేదు. అసలు మూలమూర్తి దర్శనానికి ముందు పరివార దేవతా దర్శనంగాని, వారి అనుమతి అనుగ్రహం తీసుకోవాలి అన్న స్పృహ గాని, ఖాళీ గాని మనకి లేకపోయాయే ఇంక ఏమి ఉందని మాట్లాడుకోవడానికి.
టికెట్ రేట్ చూసుకోవటం, ఎంత తొందరగా వీలు ఐతే అంతా తొందరగా స్పెషల్ దర్శనంతో మూలమూర్తిని దర్శించుకోవడం. అక్కడనుండి హమ్మయ్య అయిపొయింది అనుకుని బయటపడి మళ్ళీ మన మన గందరగోళ జీవితాలలో వేగంగా దూకేయ్యటం. ఆలోచించండి అస్సలు.... మన ఆత్మని మిస్ అవుతున్నాం. 'ఎసెన్స్ 'ని మిస్ అవుతున్నాము. అనుభూతికి, అనుభవానికి, ఆత్మకి సంబంధం లేకుండా 'గుడికి దగ్గరై, దేవుడికి దూరం' అయిపోతున్నాము :(.
సరే ఆ విషయాలు ఆలా ఉంచితే, గుడిమల్లంలో అభిషేకం టికెట్ ధర 500 రూపాయలు. ఒకవేళ మనం వేరే వూరు / రాష్ట్రంలో వున్నాము, అభిషేకంకి రాలేకపోతామంటే వారు మన గోత్రనామాదులతో అభిషేకం చేసి ప్రసాదాన్ని కొరియర్ చేస్తాము అని చెప్పారు. నాది అదే పరిస్థితి కాబట్టి నేను సంతోషంగా అలానే చెయ్యండి అని వివరాలిచ్చా. డబ్బులు చెల్లించి రసీదు తీసుకున్నాక, మెడలో పైపంచె వేసి (మనకి ఇలాంటివి కొత్త, కొంచెం సిగ్గు కూడా :) ) పంతులుగారి చేత ఆశీస్సులు ఇప్పించి రెండు లడ్లు ప్రసాదంగా ఇచ్చారు.
ఇక ఇక్కడ రవాణా సౌకర్యాలు మాట్లాడాలి అంటే అవి కొంచెం తక్కువే అనే చెప్పాలి.
బస్సు గంటకి ఒకటి మాత్రమే అనుకుంట. అందుకని ఆటో వస్తుంటే రేణిగుంట వెళ్ళాలి అంటే కండ్రిక అనుకుంట పేరు సరిగా గుర్తు లేదు కాని అక్కడ దింపి, అక్కడ నుంచి రేణిగుంటకు ఆటోలు బస్సులు ఉంటాయి అని చెప్పాడు. సరి అని ఆటోలో ఆ ఊరు చేరిన వెంటనే ధర్మరాజు, ద్రౌపది దేవాలయం అంటూ కనపడింది. ఇదే చాగంటి వారు చెప్పింది అన్న విషయం గుర్తుకువచ్చింది కానీ అది దాటిపోయి వూరు సెంటర్ చేరాక ఇంక వెనక్కి రాలేదు.
అక్కడ ఆటోలు అవీ బానే వున్నాయి. అక్కడ ఒక ఆటో పట్టుకుని మనిషికి పది ఇచ్చి రేణిగుంట చేరుకున్నాము. ఆ ఆటో ప్రయాణం మంచి అనుభూతిని ఇచ్చింది. ఆటో వెనకాల నాతోపాటు ఇద్దరు కూర్చోవటంతో, కాస్త సినిమాలో చూపించే కాలేజీ రోజులు, చిన్నతనపు రోజులు గుర్తుకువచ్చి కాళ్ళు ఊపుకుంటూ, పాటలు వింటూ చిన్నపిల్లలం అయిపోయాము.
రేణిగుంట చేరగానే విజయవాడ బస్సు వచ్చింది. అది పట్టుకుని మధ్యాహ్నం 12 కల్లా శ్రీకాళహస్తి చేరిపోయాము.
నా జాతక రీత్యా రాహుకేతు పూజ ఒకటి పెండింగ్ ఉండటం వల్ల మా వాళ్లకి లేట్ అవుతుంది అని వాళ్ళని దర్శనం చేసుకుని బెంగళూరు వెళ్ళమని నేను రాహుకేతు పూజకి వెళ్ళిపోయాను. ప్రతిరోజూ కూడా రోజులో కొంత సమయం రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో రాహుకేతు పూజ చేయించుకుంటే అత్యధిక ఫలితం ఉంటుంది. అంతే కాదు కొన్ని నక్షత్రాలు, తిథులు, గ్రహణం అవీ కూడా చెబుతారు.
నేను వెళ్లిన రోజు ఆదివారం. కాబట్టి రాహుకాలం సాయంత్రం 4:౩౦ నుంచి మొదలు అవుతుంది. నాకు లేట్ అయిపోతుంది కాబట్టి మధ్యాహ్నం స్లాట్ లోనే చేయించుకున్నాను.
రాహుకేతు పూజ టికెట్ మునుపు ౩౦౦ రూపాయల టికెట్ ఉండేది. అది 500 రూపాయలు చేసారు ఇపుడు. పైగా ౩౦౦ టికెట్ కొద్దిగా ఆలస్యం కూడా అవుతుంది, నాగ పడగలు కొంచెం చిన్న సైజు లో ఉంటాయి. కానీ అసలు రాహుకేతు పూజలు ౩౦౦ రూపాయల టికెట్ (అదే ఇపుడు ౫౦౦ టికెట్) మండంపంమే ఉత్తమం. మొదటినుంచి కూడా రాహుకేతు పూజలు అక్కడే చేసేవారు కాబట్టి నువ్వు అక్కడే చేసుకో అని నాతో వచ్చిన స్నేహితుడు చెప్పాడు కాని సమయాభావం వల్ల తప్పక 750 రూపాయల రాహుకేతు పూజ టికెట్ కి వెళ్ళవలసి వచ్చింది. సంకల్పం, వికల్పం రెండూ అయన సృష్టే కదా !
పూజ సామగ్రి అంతా వారే ఇస్తారు. (ఇంతకు ముందు ఒక పోస్ట్ లో ఈ వివరాలు వివరంగా చెప్పాను). పూజ మొత్తం కలిపి ఒక నలభై నిముషాలు ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ బాషలలో చెబుతారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అర్థంకాకపోతే పక్కవాళ్ళు ఎలా చేస్తే ఆలా చెయ్యండి :). పూజ అయ్యాక స్నానాదులు. బట్టలు తడుపుకోవటం లాంటివి ఏ సంప్రదాయాలు లేవు అని కూడా చెబుతారు. కాబట్టి అవన్నీ ఎలా అని ఆందోళన చెందకండి.
పూజ అయ్యాక వెండి నాగ పడగలను శ్రీకాళహస్తీస్వర స్వామి దర్శనం తరువాత ముమ్మారు తల చుట్టూ తిప్పుకుని (దిష్టి తీస్తాం కదా అలా) హుండీలో వేసెయ్యటంతో రాహుకేతు పూజ సమాప్తం అవుతుంది. అలా అక్కడ స్వామి దర్శనం ముగించుకుని అటు తరువాత బయటకి ప్రదక్షిణ పూర్వకంగా వస్తుంటే కనిపించే దేవీ, దేవతలా దర్శనంతో పాటు జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవటమే. అమ్మవారి పేరుకు తగ్గట్టే ఇక్కడో గమ్మత్తు జరిగింది.
అమ్మవారి గుడిలోకి వెళ్ళబోయేటంతలోనే అమ్మవారి మూలమూర్తి జాగ్రర్త అని హెచ్చరిస్తున్నట్టు అనిపించటంతో అదేంటి ఇలా అనిపిస్తుంది అన్న ఆలోచనతో అడుగు మెల్లగా వేసాను. చూస్తే కింద కొబ్బరి పెంకు. కొంచెం ఉంటే రక్తం చిందేదే. బతికిపోయాను అమ్మవారి కరుణ అని అప్పుడు అర్థం అయింది అమ్మవారి రూపం చూస్తుంటే ఎందుకు ఆలా అనిపించిందో. పెంకు తీసి పక్కన పడవేసి అమ్మవారి కరుణకి కృతజ్ఞత తెలుపుకున్నా. ఐతే అయిపొయింది అనుకోకండి అసలు విషయం కొసమెరుపులో.
అన్నప్రసాదం దగ్గర జనాలు నిరీక్షణవల్ల ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఆలస్యం అవుతుంది అని పులిహోర, లడ్డు ప్రసాదాలు తీసుకుని ఆత్మారాముని శాంతింప చేసి ఒక బస్సు పట్టుకుని తిరుపతి బయలుదేరాను.
తిరుపతిలో సాయంత్రం బెంగళూరుకి బస్సు విషయంలో ఇబ్బంది పడ్డాను. నార్మల్ బస్సులకు కూడా రిజర్వేషన్ అన్నారు. ఎన్ని బస్సులు చూసినా కూడా అంతే. స్వామి ఏమి ఈ పరీక్ష. ఈరోజు ఇన్ని పూజలు, దర్శనాలు అయ్యాయి కాబట్టి తిరుగుండదు అని తెలుసు గాని కాకపోతే మన సంగతి తెలుసుకదా !
పీకలు దాకా ఊబిలో మునిపోయా అనే సమయానికి జుట్టు పట్టుకుని పైకి లేపుతాడు మా స్వామి, అలాగే లాగి వొడ్డున పడేస్తాడు :). ఆ లోపు, విసుగు, విరామం లేని ప్రయత్నం, దాహం, అలసట, కోపం, చిరాకు ఇవ్వని భరించాలి మరి. మన పాప కర్మ తీయాలి కదా :). చెమట పట్టించేది వాడే. ఏ.సి. పెట్టేది వాడే. మొన్నేదో సినిమాలో చెప్పినట్టు తలమీద ఒక్కట్టిచ్చుకుని ఏడిచేలోపు చేతిలో ఐసుక్రీము పెట్టేస్తాడు :p.
అన్ని బస్సులు అడగటం, వాళ్ళు దొబ్బేయ్యమనటం కొంచెంసేపు జరిగాక ఏంది సామి ఈ పరీక్షలు ఇంక చాలు ఓపికలేదు అనేసరికి 'బ్లాబ్లా' కార్ వెబ్సైటు గుర్తుకువచ్చింది. మీకు తెలిసే ఉంటుంది కార్ రైడ్ షేరింగ్ వెబ్సైటు అది. అంటే ఊర్లు పోయేవారు వారితో పాటు ఎక్కించుకుని వెళ్లే దారిలో దింపుతారు. అది కొంత ప్రయత్నం తరువాత ఫలించి స్విఫ్ట్ కార్ దొరికింది. 500 రూపాయలు ఛార్జ్.
స్విఫ్ట్ కార్ అబ్బాయి పేరు 'ప్రసాద్' అని చెప్పాడు. పేరు నాకు దేవుడి ప్రసాదంలా స్ఫురించింది. పైగా వాళ్ళు మనకి చుట్టాలే. అదే అండి వాళ్ళ నాన్నగారు ఎండోమెంట్ శాఖలో పని చేస్తారు అంట. ఇంకేముంది ఎండోమెంట్ శాఖ అంటే మన భక్తులందరికి చూట్టాలె కదా!. పెద్దాయన మనకోసం కదిలాడా ! ఇంక మనం ప్రమాదాలు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఆటంకాలు అన్న మాటలు, ఆలోచనలు ఉండవు అంతే. రేపు ఆఫీస్ పోతుంది అనుకున్నవాడిని 11 కల్లా బెంగళూరులో వున్నా. అద్గదీ సంగతి :).
కొసమెరుపేమిటంటే ప్రతీక్షణం అయన చూపే లీలలు, నిదర్శనాలు రాయాలంటే ఒక బుక్ అవుతుంది అంత ఓపిక కూడా లేదు కాబట్టి ఒక్కటి మాత్రం చెబుతాను. మీకు కనెక్ట్ అయ్యేలా చెప్పాలంటే ప్రేమికుడు, ప్రేమికురాలు మధ్య సంభాషణలో ఎన్ని సార్లు ప్రేమ కనబడుతుందో, భక్తుడికి, భగవంతునికి మధ్య అన్ని లీలలు, అంత అనుబంధం కనిపిస్తుంది. చెప్తే అవీ ఇతరులకి అర్థం కావు గాని అవి వారికి మాత్రమే అర్థం అవుతాయి అనుక్షణం పరవశత్వానికి లోను చేస్తుంటాయి.
సరే కొసమెరుపుకి వస్తే....
మొన్న అరుణాచలం ప్రదక్షిణ చేస్తూ సత్సంగంలో భాగంగా అరుణాచలంలో కాలు తెగినా కూడా ఎవరూ కట్టుకట్టకూడదు అని అది ఒక్క అమ్మవారి హక్కు మాత్రమే అని, ఆవిడే తన చీర చింపి కట్టుకడుతుంది అని అరుణాచల స్థలపురాణంలో వున్నట్టుగా మాట్లాడుకున్నాము.
సైన్స్ , గణితం చదివిన మన బుర్రలకి, వాటికి నేర్పిన లాజిక్ లు వూరికే వుండవు కదా ! అలాగే భక్తి, ఆధ్యాత్మికత అనే విషయాలు నేర్చిన మన ఆత్మ కూడా ఉండనే వుంది. అటు లాజిక్, ఇటు నమ్మకం ఈ రెండూ కూడా మనలిని విడిచివుండవు కాబట్టి వెంటనే ఆ విషయం గురించి మాట్లాడుకున్నంతలోనే రకరకాల ఆలోచనలు ముసురుకున్నాయి.
అమ్మవారు నిజంగా అలా వచ్చి కట్టు కడతారా ! నిజంగా ఆలా జరుగుతుందా ! ఇలా ఎన్నిసార్లు జరిగి ఉంటుంది. ఒకవేళ ఆలా జరగకపోతే ప్రమాదానికి గురి అయినవాడు పోతాడు కదా ! ఎంత వరకు సమయం ఉంటుంది వేచి చూడటానికి .....ఇది మనకి సైన్స్ నేర్పిన ఆలోచనలు.
నీకు నిజంగా అంతా నమ్మకం ఉందా ! ఉంటే స్థలపురాణంలో చెప్పిన ఒక్కమాట పొల్లుపోదు గాక పోదు. ఆ నమ్మకంతో చూడు. పైనుంచి అమ్మ దిగి వచ్చి తీరుతుంది. నా ప్రాణం కూడా నాకు లెక్కలేదు, అన్నీ అమ్మే చూసుకుంటుంది / పెద్దాయన చూసుకుంటాడు అనే దృఢ నిశ్చయం, తెగువ, దైర్యం, నమ్మకం ఉందా నీకు .....ఉంటే మాట్లాడు... లేకపోతె లేదు. నమ్మావా ! జరిగి తీరుతుంది మరో మాట లేదు..... ఇది ఆధ్యాత్మిక కోణం.
మనం ఇంత డెప్త్ కి వెళ్ళిపోతే ...ఇవ్వన్నీ కాదు కాని నాన్నా, నేను ఉండగా అస్సలు ప్రమాదం ఎందుకు వస్తుంది నాన్నా!!! అని శ్రీకాళహస్తిలో ప్రత్యక్షంగా అనుభవం చేయించింది. వందసార్లు ఒకే ప్రయోగం చేస్తే అదే ఫలితం సైన్స్ లో వస్తుందో లేదో నాకు తెలియదు గాని, ప్రతీసారి సైన్స్ మీద 'భగవంతునిపై నమ్మకం'దే పైచేయి అవ్వటం మరోసారి నాకు నిరూపణ జరిగిపోయింది !!!.
No comments:
Post a Comment