"శివ" అన్న పదానికి మంగళకరుడు, శుభకరుడు అని అర్థం. సర్వ మంగళను కట్టుకున్నవాడు మంగళకరుడు కాక మరేమీ అవుతాడు మరి ! చాగంటి వారు తరుచుగా ఒక మాట చెప్తుంటారు. నమ్మి ఆ శివయ్య పాదాలు పట్టుకున్నావా ! ఇక దొరకంది లేదు. ఇది కావాలి అని అడగనవసరం లేదు అని. ఐతే కష్టాలన్నీ కలిసి వస్తాయి అంటారు కదా. అలా ముప్పేటలా కష్టాలు ఒకేసారి దాడి చేసి ఇంక ఊబిలో కూరుకు పోయాము. వేరే దారి లేదు అని దాదాపుగా అనుకునే సమయానికి మనం ఊహించని విధంగా, పరమాద్బుతంగా మార్పులు జరిగిపోతాయి. ఆయన చేసే మాయకి వుబ్బితబ్బితులం అయి, ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకోవలిసిందే. సరిగ్గా ఈ సంఘటనలు కంచికి రేపు వెళ్తాము అనగా ఈరోజు జరిగిపోయాయి నా జీవితంలో. కొన్ని వారముల సంక్షోభం ముగిసిపోయింది. జ్యోతిష్య పరిభాష లో ఐతే ఆకస్మిక ధన లాభం, ఉద్యోగ జయం, మిత్రులతో ఆనందంగా పంచబక్ష్య భొజ్యాదులతొ దీపావళి జరుపుకోవటం ఇలా ఒకటేమిటి ఆనందం అంతా ఒకే రోజులో వస్తే ఎలావుంటుందో అవన్నీ చవిచూసాను. నమ్మి పాదాలు గట్టిగా పట్టుకుంటే ఎలా వుంటుందో శూన్యం కాస్తా, ఉజ్వలంగా ఎలా మారుతుందో అప్పుడు అనుభవం లోకి వచ్చింది. భగవంతుడా ! నీ పరీక్షకు హద్దు నా ప్రాణమే అనుకుంటే ఈ ప్రాణం కూడా విడవటానికి సిద్దం అన్న విశ్వాసం వుంటే చాలు ! ఇక జీవితంలో మీకు తిరుగులేదు. కనీ వినీ అద్భుతాలు చూస్తారు అని అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది.
ఇంకా కంచి యాత్ర విషయానికి వస్తే, యాత్ర అన్న పెద్ద పదం వాడినందుకు భాగవతులు మన్నించ ప్రార్ధన. నిజానికి దర్శనం అనాలేమో ! అయన ఎలా నడిపిస్తే అలా ముందుకు పోవటమే కాని శాస్త్రం ఎలా చెప్పింది. దర్శనం ఎలా చేసుకోవాలి. యాత్ర నియమాలు ఏమిటి. ఇలా ఏమి ఆలోచించ లేదు ఎప్పుడూ. తపస్సు చేయగా, చేయగా మనస్సుకు చిత్తశుద్ది వచ్చినట్టు భగవంతుని కొలవగా, కొలవగా చెయ్యవలసినవన్నీ, తెలియవలసినవన్నీ అవే తెలుస్తాయి అన్న నమ్మికే ముందుకు నడిపిస్తుంది.
"పుష్పేషు జాతి, పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి"
సప్త మోక్షపురులలో ఒకటిగా పేరుగాంచిన కంచి, సప్త మోక్షపురులలో ఒక్కటే కాదు, అష్టాదశా శక్తి పీఠాలలొ కూడా ఒక్కటి. అస్టాదశా శక్తి పీఠాల గురించిన వివరాలు ఇక్కడ చూడండి.
సప్త మోక్ష పురులను శరీరం లో వున్న ఏడు చక్రాలకు ప్రతీకలుగా, వాటిని చైతన్యం చేసే క్షేత్రాలుగా చెప్తారు. ఇక్కడ చూడండి.
కామాక్షి అమ్మ మహిమలు గొల్లపూడి మారుతి రావు గారి బ్లాగ్ లో సందర్భానుసారం పెట్టారు. ఇక్కడ చూడండి
అస్సలు కంచిలో వెయ్యికి పైగా దేవాలయాలు వున్నాయి కాబట్టే కాంచీపురాన్ని "ఏ థౌజండ్ టెంపుల్స్ అఫ్ సిటీ" అని అంటారు. ఐతే ముఖ్యమైన ఆలయాలు గురించి చెప్పమంటే మాత్రం, ముందు అన్ని ముఖ్యమైనవే అని చెప్పాలి :). అతి ముఖ్యమైనవి ఐతే కంచి కామాక్షి అమ్మన్ ఆలయం, ఏకామ్రేశ్వర స్వామి ఆలయం, వరద రాజ స్వామి ఆలయం (బంగారు, వెండి బల్లి వుండేదిక్కడే), వామన మూర్తి ఆలయం, కుమర కొట్టం, కచ్ఛపేశ్వరుని దేవాలయం, కైలాసనాథ ఆలయం, కంచి మఠం తప్పక దర్శించవలసినవి. ఇంకా ప్రసిద్ధి కెక్కిన 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో పదిపైన ఇక్కడే వున్నాయి. కంచిని ఆలయాలననుసరించి రెండు ప్రాతాలుగా చెప్తారు. శివ కంచి, విష్ణు కంచి అని.
రాజ చంద్ర గారు అత్య్యంత విపులంగా మంచి సమాచారం ఎప్పటిలాగానే ఇచ్చారు. మాకు బాగా ఉపయోగపడింది. మరి మీకో ? :)
Kanchipuram Temple Information- కంచి
మరిన్ని కంచి విశేషాలు గురించి కింద చూడండి.
లంకె 1
లంకె 2
లంకె 3
లంకె 4
లంకె 8
లంకె 9
పంచ భూత లింగ క్షేత్రాలు గురించి ఇక్కడ చూడండి,
ఇక మా యాత్ర విషయానికి వస్తే యశ్వంత్ పూర్ నుంచి బయలు దేరి, చెన్నయికి వెళ్ళే యశ్వంత్ పూర్ చెన్నయి సూపర్ ఫాస్ట్ ఎక్ష్ప్రెస్స్ (12291), కె ఆర్ పురం లో ఎక్కేవిధంగా ఏర్పాటు చేసుకున్నాము. "అరక్కోణం" కాంచిపురానికి దగ్గర రైల్వే స్టేషన్. కంచిలో ఒక రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ బెంగుళూరు నుంచి సరాసరి రైలు లేదు. అందుకే అరక్కోణం దిగేలా ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడనుంచి 29 కిలోమీటర్లు. సరిగ్గా 3:38 దిగుతాము, 2 నిమిషాలు మాత్రమే రైలు ఇక్కడ ఆగుతుంది. గమనించ ప్రార్ధన. స్టేషన్ దగ్గర ఆటో వుంది.ఆటోలో బస్టాండ్ కు చేరుకున్న వెంటనే బస్సు వచ్చింది. ఒక 45 నిమిషాలలో కంచి చేరుకున్నాము.
కంచిలో వసతి కోసం రాజచంద్ర గారు బ్లాగ్ లో ఇచ్చిన వంచినాథన్ ట్రస్ట్ వాళ్ళ ల్యాండ్ లైన్ నెంబర్ కి కాల్ చేస్తే పని చెయ్యలేదు. మొబైల్ కూడా అంత పొద్దునే కాబోలు ఎవరూ లిఫ్ట్ చెయ్యలేదు. అక్కడ మైఖేల్ అన్న ఆటో అతను కనపడ్డాడు. ఏదైనా మంచి హోటల్ కి తీసుకెళ్లమన్నాము. SSN IN అన్న లాడ్జి కి తీసుకెళ్ళాడు. రోజుకి వెయ్యి అన్నాడు. పర్లేదు బానే వుంది. రెండు రూమ్స్ లో మూడు బెడ్స్ మొత్తం కలిపి వున్నాయి. మా బడ్జెట్ లో అడిగాము. మొబైల్ తీసి వెతికితే అన్నీ "అవుట్ అఫ్ బడ్జెట్". సరే అనవసర కాలయాపన ఎందుకని రోజుకి 900 చొప్పున రెండు రోజులు మాట్లాడాము. ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకుని రెడీ అయ్యాము. ఈలోపు మైఖేల్, మాణిక్యం (మొబైల్ 09943128151) అన్న తెలుగు బాగా తెలిసిన ఆటో అతన్ని మాట్లాడి పంపాడు. మేము అతనికి ప్రసిద్ధ క్షేత్రాల లిస్టుతో పాటు, వైష్ణవ క్షేత్రాలు కూడా చూపించాలి అని ఒప్పందం కుదుర్చుకున్నాము. మొత్తం నలుగురికి 1600 రూపాయలు చెప్పాడు. దేవాలయం దగ్గర ఆటో నెంబర్ తీసుకోమన్నాడు. స్మార్ట్ గా ఫోటో తీసుకొన్నాము. ఫోటో జత చేశాను చూడండి:). కంచి కామాక్షి ఆలయంలో అమ్మ విగ్రహం సజీవ కళ ఉట్టిపడుతూ సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ వుంటుంది. ఏకాంబరేశ్వరుని ఆలయం లో 3500 సంవత్సరాల వృక్ష కాండం వుంది. ఆ వృక్షం ఎండిపోతే దాని స్థానం లో మరొక మొక్క నాటి ఆ కాండాన్ని అద్దాల పెట్టెలో పదిలపరిచారు. ఇంక వరసగా క్షేత్రాల దర్శనం చేసుకున్నాము. దర్శనాలు అత్యద్బుతంగా జరిగాయి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కాని, ఆలస్యం కాని లేకుండా చాలా బాగా జరిగాయి. కైలాసనాథ ఆలయం లో శిల్పకళ వుట్టిపడుతుంది. వైష్ణవ క్షేత్రాలలో ఐతే స్వామి వారి ఊరేగింపు వచ్చింది. బంగారు, వెండి బల్లి దగ్గర మాత్రం చాలా సమయం పట్టింది. కంచి అనగానే ముందు బంగారు, వెండిబల్లె కదా అందరికి గుర్తుకు వచ్చేది అందరికీ. అందుకేనేమో మిగతా ఆలయాలు దగ్గర అంత రద్దీ లేదు. ఇక్కడ బల్లి దోషం ఒక్కటే పొతే మిగతా చోట్ల అన్ని దోషాలు పోతాయి అని తెలియకనో ఏమో మరి !. ఐన అంత తేలికగా మనకి అర్హత వచ్చేస్తే నాకు కంచికెళ్ళాలి అన్న కోరిక తీరటానికి మూడు సంవత్సరాలు ఎందుకు పడుతుంది :). కుమార కొట్టం ఆలయం దగ్గర జనం బాగా వున్నారు. అందరూ ప్రదక్షిణాలు చేస్తూ కనిపించారు. కచ్ఛపేశ్వర ఆలయం మూసివేసారు. అందుకని తిరిగి సాయంత్రం వెళ్ళాము. దర్శనాలప్పుడు అక్కడక్కడా దీపాలు వెలిగించాము.
ఏకాంబరేశ్వరుని ఆలయం లో ఒక చిత్రం గురించి చెప్పాలి. మేము దర్శనం తరువాత నంది దగ్గరలో కూర్చుని ప్రసాదాలు తింటుంటే ఆకస్మాత్తుగా ఒక నంది (అదే ఆవు) దగ్గరకు వచేసింది. ఏమి చెయ్యాలో తెలియక వెంటనే మా వాడు ప్రసాదం అక్కడ పెట్టాడు. తింటుంటే నేను కొంచెం పెట్టాను. సరేలెమ్మని వేరే చోట తింటుంటే మళ్ళీ వచ్చింది. ఒక స్నేహితుడిని కార్నెర్ చేసింది. అంత పేనిక్ సిట్యువేషన్ లో కూడా వాడికి బుర్ర బాగా పని చేసి అటు ఇటు చూసి వెంటనే ప్రసాదం కింద పెట్టేసాడు. అంతటితో మమ్మలిని వదిలేసింది. దేవుడా అనుకున్నాము. కాకపోతే అది అలా తింటుంటే మంచి ఆనందం వేసింది. ఇలాంటి క్షేత్రం లో ఒక మూగ జీవికి తినిపించటం చాలా పుణ్యం కదా ! కాకపోతే ఆ ఆవు యజమాని వెనకనే వున్నాడనిపించింది :) గ్రహదోషాలకు కొంతమంది ఇలాంటివే పరిహారాలు చెప్తుంటారు కదా ! ఏమైనా మా ద్వారా ఒక మంచి పని జరిగింది, భగవంతుటే జరిపాడన్నట్టుగా ఆశ్చర్యానందోత్సవాలకు గురికాబడ్డాము.
ఏకాంబరేశ్వరుని ఆలయంలో అన్నదాన విరాళం వుంది. వెయ్యి రూపాయలు ఇస్తే ఒక యాభై మందికి స్వామి పేరున అన్నదానం చేస్తారు. కార్తీక మాసం రెండో రోజు, అందునా కంచి లాంటి క్షేత్రం లో అన్నదానం అంటే మాటలా ! కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పుణ్యం ఘనీభవించి ఒక రూపం తీసుకుని వరం అనుగ్రహించటం వంటింది, అందునా భాగవత సేవలో తలో చెయ్యి వెయ్యాలంటారు. మిత్రులతో చర్చిస్తే అందరు చేద్దామన్నారు. అందరి మీద కలిపి వెయ్యి రూపాయలు అక్కడే దేవస్తానం వారి ఆఫీసు లో జమ చేసాము. అన్నదానం అప్పుడు చూస్తే వృద్దులు, సన్యాసులు, బీదవారు కనపడ్డారు. మనకన్నా అర్హత కలిగినవాళ్ళు, అన్నదానానికి సార్ధకత అని సంతోషంగా వచ్చేసాము.
ఇక్కడ చాలా ఆలయాలు జీర్నోద్దరణకు నోచుకోకుండా వున్నాయి. ప్రసాదాల వితరణ, పూజ పునఃస్కారాలు, ఇతర ఆలయ నిర్వహణ చాలా పరిమితంగా జరుగుతున్నాయనిపించి బాధ కలిగింది. ఎంతో శ్రద్ధాభక్తులు, వనరులు వుంటే కానీ అవన్నీ సాధ్యం కాదు. మన ప్రాధాన్యతా క్రమంలో దేవుడి చోటు కుదించుకు పోయినందుకు సిగ్గుపడాలి అని మాత్రం అనిపించింది. అందుకేనెమో ఇన్ని వైపరిత్యాలు అన్నిటా. తెలిసినవాళ్ళు, చెప్పినా వినరు అనుకుంటుంటే, తెలియని వాళ్ళు ఎవరూ చెప్పటం లేదు అని అనుకుంటారు. ఇవి రెండూ కలిసేచోట శ్రద్ధాభక్తులు, పాటించే వోపిక, ఆసక్తి వుంటావో లేవో ! చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్దల శంఖానాదంతో ఇప్పుడిప్పుడే మెలకువ వస్తున్నట్టు వుంది.
కంచి యాత్ర చేయ్యగోరు వారు గమనించవలసిన విషయాలు:
కచ్చితంగా ముందస్తు ప్రణాళిక తో వెళ్ళండి. అక్కడకు వెళ్లి ఆలయాలు వెతుక్కోవటం చాలా కష్టం. మాకు అక్కడి ఆటో ఆటను గైడులాగ అన్ని చోట్ల కి తీసుకెళ్ళాడు కాబట్టి సరిపోయింది. లేకపోతె చాల ఇబ్బంది. తన ద్వారా ఆలయాలు వెతుక్కోకుండా దర్శనానికి వెళ్లితేనే రాత్రి 8 దాటి పోయింది. అందుకని తెలిసిన వ్యక్తీ ద్వారా గాని లేదా ముందస్తు పక్కా ప్రణాళికతో వెళ్ళటం ఉత్తమం.
దేవాలయాల సందర్శన వేళలు గమనించాలి. దాదాపు అన్ని ఆలయాలు ఉదయం 12 గంటల తరువాత దర్శనానికి అనుమతి వుండదు. మళ్లీ సాయత్రం 4 గంటల తరువాతనే. ఇది గమనించండి. (మా ఆటో ఆటను 3 గంటలకే రెడీ అవ్వమంటే ఏమిటో అనుకున్నాము. తీసుకెళ్ళి వద్దురా బాబు అంటే ఒక షాప్ దగ్గర ఆపి షాపింగ్ అన్నాడు. పాపం వాడి బాధ వాడిది. ఎంతో కొంత షాప్ వాళ్ళు ఇస్తారు ఏమో. ఎవరో ఆర్ధిక వేత్త చెప్పినట్టు మనవ సంబందాలు అన్నీ ఆర్ధిక సంబందాలు అనిపించింది :)
ఇంకా తగినంత చిల్లర తీసుకెల్లండి. ఒక్కొక్క ఆలయం లో బోలెడు వుపాలాయలు వుంటాయి. తగినంత దక్షిణ లేకుండా ఆశీర్వచనం ఎలా ఫలిస్తుంది మరి :).
వసతి వివరాలు అవీ తెలుసుకుని ముందే బుక్ చేసుకొని వెళ్ళండి.
చిన్నపుడు కథలు చెప్పేటప్పుడు కథ కంచికి మనం ఇంటికి అంటారు చూడండి. అంటే కంచి మోక్షపురి కదా ! కథ కంచికి అంటే ఇంక తిరిగిరాదు అని అర్థం :).
భాషా ఇబ్బంది ఎక్కడా కలగలేదు. కాబట్టి పెద్దగా దీని గురించి బెంగ పెట్టుకోవనవసరం లేదు.
కంచి మఠం దర్శించుకునేటప్పుడు కంచి పరమాచార్యుల విగ్రహం చూసి ఆశ్చర్యపడతారు. అస్సలు ఎవరు చేసారో గాని "సేజ్ అఫ్ కంచి" అని, "నడిచే దైవం" గా పిలవబడే కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని సశరీరంతో చూడలేకపోయమే అన్న బాధ ఎవరికైనా వుంటే ఈ విగ్రహం చూసాక ఇక వుండదు. కొద్దిగా పరిశీలించి చూస్తే శరీరం మీద ముడతలు, కూర్చున్న విధానం, కళ్ళకి గాజు కళ్ళజోడుతో సహా సూక్ష్మ పరిశీలనతో ప్రాణం పెట్టి, అద్భుతంగా చేసినట్టు అనిపిస్తుంది. ఆ విగ్రహం గాజుగ్లాసులో కాకుండా బయట ఎక్కడ చూసినా, స్వామి వారు పరమపదించారు అని విన్నానే నిజం కాదు అన్నమాట అని కాళ్ళమొక్కబోతారు :). అంత సజీవంగా వుంటుంది రూపం. తప్పనిసరిగా చూసి రావాలి.
స్వామి చరిత్ర, అమ్మవారి మహిమలు ఇంకా చాల సమాచారం దేవస్తానం వారి సైట్ లో ఇచ్చారు. ఇక్కడ చూడండి. (కంచి వారి సైట్ లో ఫాంట్ కనపడకపోతే సైట్లో డౌన్లోడ్ లోకి వెళ్లి ఫాంట్లు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఐన ఫైల్ మీద నొక్కితే ఇన్స్టాల్ అవుతాయి. తరువాత పేజీని తరిగి లోడ్ చెయ్యటానికి F5 నొక్కండి).
బెంగలూరుకి వెళ్ళేవారు, కంచి నుండి వెల్లూరుకి వెళ్ళితే అక్కడ నుంచి బస్సులు సులభంగా లభ్యమవుతాయి. వీలయితే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కి కూడా వెళ్ళవచ్చు. అక్కడికి దగ్గరే.
అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే కంచి లేదా కాంచీపురం నుంచి సరాసరి బస్సులు కష్టం. నేను ట్రావెల్ ఏజెంట్ ని బెంగుళూరుకి బస్సు గురించి అడిగితె చెన్నై కొట్టాడు. అదేమిటి అంటే ఇక్కడ నుంచి వుండవు అన్నాడు. మేము కంచి దర్శనం తరువాత తిరిగి వెనక్కు రావటానికి మీనాక్షి ట్రావెల్స్ స్లీపర్ వారం ముందు బుక్ చేసుకున్నాము. సరిగ్గా తిరిగి రావలిసిన రోజు ప్రొద్దునే మాకు ట్రావెల్స్ నుంచి బస్సు బ్రేక్ డౌన్ అయినది అని కాల్ వచ్చింది. పోనేలే ముందే తెలిసింది ప్రమాదం తప్పించారు అనుకోవాలో లేదంటే ఈ పండగ సీజన్లో రద్ధీ దృష్ట్యా ఇలా కావాలని చేస్తున్నారో అర్థం కాలేదు. అయినా కర్తృత్వం మనం వహించినపుడు కదా మనకు బాధ. నడిపించేది వాడు, నఢిచెది మనం అనుకున్నపుడు ఇంక బాధ ప్రశక్తి ఏముంది. ముళ్ళ బాట కూడా పూల బాట అవుతుంది. పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట వినలేదా :)