Sunday, November 26, 2017

శ్రీ భూ నీళా సమేత సత్యనారాయణ స్వామి - రంగాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.


రెండవ అన్నవరంగా ప్రసిద్ధికెక్కిన రంగాపురం గ్రామంలోనే మన సత్యనారాయణ స్వామి భూ నీళా సమేతంగా భక్తులని అనుగ్రహిస్తుంటాడు.

తెలుగునాట సత్యనారాయణ స్వామి అనగానే మనకి వివాహం, తదనంతర సత్యనారాయణ వ్రతం, వ్రత కథే గుర్తుకు వస్తుంది. ఇవన్నీ కాదు అంటే సరాసరి అన్నవరమే గుర్తుకువస్తుంది. అసలు 'వ్రతం' అని శుభలేఖలో చూస్తేనే టక్కున సత్యనారాయణ స్వామి వ్రతం అని గుర్తుకు వచ్చేస్తుంది ఇక చెప్పేదేముంది. వివాహ సంస్కారం, తదనంతర స్వామి వ్రతం అవిభాజ్యమైనవి. 'సత్యనారాయణ', 'సత్య' పేర్లతో మనకి నిత్యమూ కనిపించే మన చుట్టూ వున్న మనుషులు మనకి అనునిత్యం ఆ స్వామిని గుర్తు చెయ్యబోతారుగానీ మనకే ఆ స్పృహ ఉండదు. అది వేరే విషయం అనుకోండి. అసలు విష్ణుభగవానుని అవతార రూపమే మన సత్యనారాయస్వామి. ఈ అవతార ప్రయోజనమే భక్తులను కష్టాలనుంచి గట్టెకించటం. అవేమిటో ఇక్కడ  మరియు ఇక్కడ చదవండి.  

సన్నిహిత మిత్రులొకరు, ప్రఖ్యాతి వహించిన సత్యనారాయణ స్వామి ఆలయం మీకు దగ్గరే వుంది అనేవరకు కూడా మనకి పెద్దగా తెలియదు. అక్కడో, ఇక్కడో కొద్దిగా విన్నా గాని భౌగొళికంగా జ్ఞానం శూన్యం, దేవుడి 'కోసం' 'పని గట్టుకుని' వెళ్ళటం వూళ్ళో  తక్కువ కదా ! అందుకే అప్పటిదాకా పోలేదు. చిన్నప్పుడెప్పుడైనా వెళ్లానేమోగాని గుర్తులేదు.  

మొత్తానికి స్వామి అనుగ్రహంతో ఇంట్లోవాళ్ళు, తెలిసినవాళ్ళు, ఆఖరికి గూగులమ్మ సలహా, సూచన, సహాయంతో ఈమధ్యనే నేను, ఒక స్నేహితుడితో కలిసి, స్వామి దర్శనం చేసుకున్నాము.. ఆ విశేషాలు. 

రంగాపురం ఆలయంలోనే భూ నీళా సమేత సత్యనారాయణ స్వామితో పాటు వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లు దర్శనం ఇస్తారు. ఫోటోలలో కనిపించినట్లు మనం ఆలయంలోకి వెళ్ళగానే ఏదో నాలుగు పోర్షన్ల ఇల్లు లాగ కనిపిస్తుంది. ఇటు నుంచి, అటు చివరకు దేవతామూర్తుల ఆలయ దర్శనం జరుగుతుంది. 

మేము వెళ్లేసరికి అక్కడ ఒకటి రెండు కుటుంబాలు వ్రతంలో పాలుపంచుకుంటూ కనపడ్డారు. వ్రతం టిక్కెట్లు, దక్షణ అవీ అడిగి తెలుసుకోండి. డివైడ్ టాక్ వచ్చింది ఇంతకుముందు మా వాళ్లు వెళ్ళినప్పుడు.:)  

తల్లిగారు కాలం చేసాక ఒక మంచి శుభం కార్యంతో మొదలెట్టాలని మా కుటుంబ సభ్యులు స్వామి దయ వల్ల వ్రతంలో పాలుపంచుకున్నారు. నేను అప్పుడు వెళ్ల లేకపోవటం వల్ల ఈసారి దర్శనంకి వెళ్ళానన్నమాట.

రంగాపురం గ్రామం జిల్లా హెడ్ క్వార్టర్స్  - ఏలూరుకు 32 కిలోమీటర్ల దూరంలో లింగంపల్లి మండలంలో ఉంది. 

'ద్వారకా తిరుమల' కూడా ఏలూరు నుండి వచ్చే దారిలోనే ఉంటుంది. కాకపోతే ఏలూరు నుంచి వచ్చేటపుడు మీరు మెయిన్ రోడ్ కుడిపక్కగా లోపలకి ప్రయాణిస్తే ద్వారకా తిరుమల / ఈస్ట్ యడవల్లి వెళ్తారు. రంగాపురం మెయిన్ రోడ్డ నుంచి ఎడమపక్క లోపలకి వెళుతుంది. కామవరపుకోట దగ్గర రోడ్ మారాలి ఎటు కావాలంటే అటు. వెళ్ళవచ్చు. బైక్ / కార్ జర్నీ ఐతే బావుంటుంది. ఇంకా షార్ట్ కట్స్  ఉండి ఉండవచ్చు. నాకు పెద్దగా తెలియవు.  బస్ సౌకర్యం వుంది. దగ్గరి రైల్వే స్టేషన్ ఏలూరు రైల్వే  స్టేషన్ అనుకుంటున్నా.

ఇకపోతే దర్శనం విషయానికి వస్తే భక్తులు పెద్దగా లేకపోవటంతో తొందరగానే అయిపొయింది. మొత్తం ఆలయం, పరిసరాలు చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది. మెయిన్ రోడ్ పైనే వున్నాగాని పల్లెటూరు కాబట్టి పెద్దగా రణ, గొణ ధ్వనులు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఆలయ దర్శనం తనివితీరా చేసుకుని, ఆలయంలో కాసేపు గడిపి ఇంక వెనక్కి  బయలుదేరాము. 

వచ్చేదారిలో కామవరపుకోట వీరభద్ర స్వామి గుడికి వెళ్ళాము గాని ఆలయం మూసివేశారు. ఆలయం మెయిన్ గేట్ మాత్రం తెరిచారు. వాసవి క్లబ్ వారి మీటింగ్ జరుగుతున్నట్టు వుంది మేము వెళ్లేసరికి. మొత్తానికి స్వామి దర్శనం మాత్రం దొరకలేదు. 

మా ఊరునుంచి కామవరపు కోట వెళుతుంటే 'అడ్డరోడ్డు'లో వున్న సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో పాటు, కామవరపుకోట వీరభద్ర స్వామి దర్శనం కూడా, ద్వారకా తిరుమల దర్శన ముందే టోకున అనుగ్రహించేసాడు ఆ శివస్వామి. ఎందుకంటె రంగాపురం ఆలయం ద్వారకా తిరుమలవాసుని దత్తత ఆలయం కాబట్టి :). భీమవరం, ద్వారకాతిరుమల విశేషాలు (భీమవరం & ద్వారకాతిరుమల వెళ్లిన ట్రిప్స్) ఇంతకు ముందు పోస్టులలో వున్నాయి కదా :).































Saturday, November 11, 2017

నింగి, నేల, గాలి, నీరు, నిప్పు  -  పంచభూతాలు. పంచభూతాలకు ప్రతీకాత్మకంగా నిలిచే ఆ పరమ శివ క్షేత్రాలు పంచభూతలింగ క్షేత్రాలు. అవి వరసగా చిదంబరం, కంచి, శ్రీకాళహస్తి, జంబుకేశ్వరం, అరుణాచలం. చిదంబరంలో నటరాజుగా, కంచిలో ఏకాంబరేశ్వరుడుగా, శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడుగా, జంబుకేశ్వరంలో జంబుకేశ్వరుడుగా, అరుణాచలంలో అరుణాచలేశ్వరుడిగా స్వామి తన దేవేరితో మనల్ని అనుగ్రహిస్తాడు. ఆయా క్షేత్రాల వైభవం దర్శించి, అనుభూతి చెందటమే కాని  మాటలకి అందేది కాదు.

పంచభూత లింగ క్షేత్రాల గురించి వికీపీడియాలో మరింత సమాచారం ఇక్కడ చదవగలరు. 

శ్రీ - సాలెపురుగు, కాళ - పాము, హస్తి - ఏనుగు కలిపి శ్రీకాళహస్తి అయినవి. ఆ కథ మీకు తెలిసినదే కదా ! అసలు ఈ క్షేత్ర వైభవం గురించి చదివితేనే ఇంత అద్భుతమైన క్షేత్రమా అని అనిపించక మానదు. ఒకసారి వికీపీడియా లో ఇక్కడ చదవండి.

ఇంకో లింక్ (శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు తమ ప్రవచనాలలో కూడా ఈ క్షేత్ర వైభవాన్ని గురించి ఇప్పటికే అద్భుతంగా చెప్పి వున్నారు. యూట్యూబ్ / http://telugu.srichaganti.net/ లో వున్నాయి అవి తప్పక వినండి).

చదివారు కదా ! ఇపుడు ఈ మధ్య మేము స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆశీస్సులు పొందాము. అదే ఈ ఆర్టికల్.

ఇంకోమాట మన జీవితాలలో ముఖ్యంగా, మన ఇళ్లలో ఆడవారు పాడే పాట 'శివ శివ శంకర ! భక్తవ శంకర! శంభో హర హర నమో నమో !' భక్త కన్నప్ప సినిమాలో లోనిది. సినిమాలో ఇతివృత్తం కూడా ఈ స్వామిదే  ఈ క్షేత్రానిదే. శివుడి పరీక్షతో కంట నుంచి వస్తున్న రక్తధారని ఆపటానికి తన కన్నులు పీకిన తిన్నడే మన భక్తకన్నప్ప. ఎందరో భక్తులు అనుగ్రహింపబడ్డారు ఈ క్షేత్రంలో. మనం చిన్నపుడు చదువుకున్న శ్రీకాళహస్తీశ్వర శతకం రచించిన ధూర్జటి ఇక్కడివాడే. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఒకానొక మహా భక్తుడు. ధూర్జటి ఆర్తి, భక్తి ఆ శతకంలో కనిపిస్తుంది మహాభక్తులు పేర్లు వచ్చాయి కాబట్టి ఒక రెండు మాటలు... బాధ, ఆశ, కోరిక, అర్థంతో మొదలయ్యి  ఆనందం, నమ్మకమో లేదా ఓటమి, నిరాశ, అవమానభారం, దైన్యమో కలిగి కోపం, క్రోధంకి చేరుకొని, దిక్కులేనితనం, నిస్సహాయత ఆవరిస్తుండగా ప్రాణం ఐతే ఇంకా వుంది కదా ! ఇంతే కదా నువ్వు చేసేది అయినా నేను నిన్నే నమ్ముతాను. దిక్కులే అంబరాలిగా కలిగిన  'దిగంబరుడివి'నాకు ఇంక దిక్కు లేదు. నీవే దిక్కు. అంతటితో ఆగదు - పిచ్చి ప్రేమ, ఊగిపోయే మనస్సు, అవధూత లక్షణాలు అయినా బాలోన్మత్త పిశాచ అవస్ఠలకి చేరుకున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఈ సోది అనుకుంటున్నారా ! ఒక భక్తుడి మనసు 'లైఫ్ సైకిల్' చెప్తున్నా! ఎవరు ఏ స్టేజిలో వున్నారో మీరే సరి చూసుకోండి. 

ఏ భావోద్వేగం లేకపోవటం అన్నట్టు అనిపించి, అన్ని భావోద్వేగాలు ఉండటం. మాస్ సాంగ్ చూస్తున్నా స్వామి గుర్తొచ్చి అప్రయత్నంగా కళ్ల నీళ్లు తిరిగితే ఆ పిచ్చి, ఉన్మాదం డిప్రెషన్ కిందకి వస్తాయో రావో మరి ఆ 'ఉన్మత్తశేఖరు'డే చెప్పాలి.   

శ్రీకాళహస్తి ఆషామాషీ క్షేత్రం కాదు. 'దక్షిణ కాశీ'గా పేరుగాంచింది. స్వర్ణముఖీ నదీ తీరాన నెలకొని వుంది. వాయుతత్వానికి ప్రతీకాత్మకంగానే ఇక్కడ వున్న రెండు దీపాలలో ఒక దీపం రెప,రెప లాడుతుంటుంది. అక్కడ ప్రత్యేకంగా గాలి వచ్చే ఏర్పాటు లేకపోయినా, ఆలా రెప,రెప లాడుతుండటం ఇక్కడ ప్రత్యేకత. ఎందరో భక్తులు తరించిన క్షేత్రం. భారతదేశం నలుమూలలా ఇక్కడ రాహు, కేతు పూజలకు వస్తున్నారు అంటే ఈ క్షేత్ర మహాత్మ్యం అర్థం చేసుకోవచ్చు (వ్యక్తిగతంగా తీవ్ర ఉద్యోగ వడిదోడుకులతో కొన్ని సంవత్సరాల పాటు పడిన బాధ ఇక్కడ పూజతో పోయింది. కాంట్రాక్టు జాబ్ అయినా కూడా పూజ తరువాత 4.6 సంవత్సరాలు పాటు ఢోకా లేకుండా వుంది అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి క్షేత్ర మహిమ, రాహు,కేతు పూజల శక్తి ఎంత ప్రభావవంతమైనదో).

ఇకపోతే నేను బెంగళూరు నుండి రాత్రి బస్సు లు బాగానే ఉండటంతో, రాత్రి 10:45 కి రిజర్వేషన్ బస్సు  పట్టుకుని తిరుపతిలో దిగేసరికి తెల్లవారగట్ల 3 అయింది. ఆ పక్కనే వున్న బస్సు స్టాండ్ నుంచి శ్రీకాళహస్తికి సరాసరి బస్సు  పట్టుకుని వచ్చేసరికి ఇంకో 45 నిముషాలు పట్టింది.

గుడి ఎదురుగా బస్సు ఆపుతారు. లాడ్జిలు చూపిస్తామంటూ వెంటపడతారు :). మా తరువాత ట్రిప్ వెళ్లిన మా స్నేహితుడు ఆలా చూపిస్తాను అన్న వాడి వెనక వెళ్ళితే ఎక్కడో లోపల ఒక సందులో చూపించాడు అంట. యావరేజ్ గా వుంది అన్నాడు. అయినా ఎక్కడికో వెళ్లనవసరం లేదు ఎదురు గుండా చాలా లాడ్జిలు ఉంటాయి. నచ్చిన దాంట్లో దిగచ్చు. ఒక వందో, యాభయ్యో  తగ్గించమంటే తగ్గిస్తారు కూడా.

దేవస్థానం వాళ్ళు  లగేజి కౌంటర్ అక్కడే ఓపెన్ చేసారు. వాళ్ళు  బస్సు  దిగగానే మైక్ లో చెబుతుంటారు. ఇంక ఒక్క  స్నానాదులు చేసుకుని పోతామంటే లాడ్జి వాళ్ళు  ఒక ముప్పయ్యో , యాబయ్యో తీసుకుంటారు. మీ సౌలభ్యం, ప్రణాళిక అన్నమాట.

నేను అక్కడే కోమల్ లాడ్జిలో దిగాను. పరవాలేదు బానే వుంది. ఈలోపు మా స్నేహితుడు ఊరి నుంచి బయలుదేరి, ఏలూరు లో తిరుమల ఎక్ష్ప్రెస్స్  పట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. శ్రీకాళహస్తి లో రైల్వే స్టేషన్ కూడా వుంది.

ఇద్దరం స్నానాదులు కానిచ్చుకుని రెండో దర్శనానికి వెళదామనుకుని బయలుదేరాము. ఇక్కడ ప్రొద్దున మూడు అభిషేకాలు ఉంటాయి. 6, 7, 9 గంటలకు. మేము ఉదయం 6.45 కల్లా టికెట్ తీసుకుని ఏడుగంటల దర్శనానికి వెళ్ళితే, అప్పటికి అయిపొయింది. తరువాత దర్శనం తొమ్మిది గంటలకి అని చెప్పారు. మాకేమి అర్థం కాలేదు. అదేమిటి అని అక్కడ వున్న ఒక అబ్బాయిని అడిగితే, అమావాస్య పూజలు వున్నాయి ఈరోజు అని చెప్పాడు. అదికూడా మొదటిసారి ఆలయంలో జరుపుతున్నారు. అందుకే వూళ్ళో వుండే మహిళలు భారీగా వస్తారు. అందుకే ఈరోజు ఒక గంట ముందుకు జరిపారు సర్ అని చెప్పాడు. ఉదయం 5, 6 గంటలకి రెండు అభిషేకాలు అప్పటికే అయిపోయాయి అన్నమాట. తరువాత అభిషేకం 9:15 అని చెప్పారు.

చెప్పాను కదా ! ఆ రోజు అమావాస్య . అసలు మేము వెళ్ళింది రాహు, కేతు పూజల కోసం. నాకు జాబ్ పోయింది. పెళ్లి గురించి అడగవద్దు :)). టైం అస్సలు బాలేదు. ఎందుకో స్వామి అభిషేక దర్శనంతో రాహు, కేతు పూజలు కూడా చేయిద్దామని బయలుదేరాము. ఆ మధ్యే  మా చిన్ననాటి స్నేహితులు ఇద్దరు రాహ, కేతు పూజలు చేయించటం కూడా జరిగాయి. ఇక మా ఇద్దరమే మిగిలాము అని మేము కూడా బయలుదేరాము.

బెంగళూరు నుంచి వచ్చేటప్పడు బస్సు లో అస్సలు నిద్రపట్టలేదు. పక్క ప్రయాణికుడు కదులుతూ వుండటం వల్ల అంతా కలత నిద్ర. రెండు గంటలు అయినా పడుకున్నానో లేదో తెలియదు. ఇది ఒక పరీక్ష, రెండో పరీక్ష మా వాడికి జరిగింది. అప్పటిదాకా అలెర్ట్ గా వున్నాడు. ట్రాకింగ్ చూసుకుంటే అప్పుటికే శ్రీకాళహస్తి దాటిపోయింది. అప్పటిదాకా నాకు కాల్ చెయ్యాలి అన్న ఆలోచన రాలేదు. రేణిగుంట వెళ్లి మళ్ళీ శ్రీకాళహస్తి బస్సు లో వెనక్కి వచ్చాడు. ఆలా ఉంటాయి పరీక్షలు. భగవంతుని అనుగ్రహం కావాలన్న పుణ్యం ఉండాలి లేకపోతే ప్రారబ్ద కర్మ ఎంతలా అడ్డుపడుతుందో కదా !

నిలబడి నిద్ర పోవటం అంటే ఏమిటో అప్పుడే అర్థం అయింది. ఏమీ తినలేదు, నిద్ర లేదు, ఓపిక లేదు. టైం చూస్తే 9 దాటింది, 10 దాటింది. అభిషేకం ఊసే లేదు.  అప్పటికే మూడుగంటలు అయింది మేము నిరీక్షిస్తూ. దానికి తోడు పంచె అవీ కట్టుకుని వెళ్ళాము. మా వాడికి మొదటిసారి పంచె కట్టుకోవటం. ఇంక మా కష్టాలు ఆ శ్రీకాళహస్తీశ్వరుని కెరుక. 

ఇక్కడొక విషయం మీతో పంచుకోవాలి. అభిషేకానికి వచ్చే మగవారు పంచె ఖచ్చితంగా ధరించి తీరాలి. పైన చొక్కా వున్నా పర్లేదు కాని కింద మాత్రం పంచె ఉండాల్సిందే. ఆడవారు చీర లేదా సాంప్రదాయ వస్త్రాలు కట్టుకోవాలి. అభిషేకం కౌంటర్ బలి మంటపం దగ్గరే ఉంటుంది. అదే మనం కూర్చుని ప్రసాదాలు తింటుంటాము కదా దర్శనం అయి బయటకు వచ్చాక !. అక్కడన్నమాట. ఏ సమాచారం ఎవరిని అడిగినా చెబుతారు. ఇప్పుడున్న ఈ.ఓ. గారు ('భ్రమరాంబ' గారు) చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు. అస్సలు ఊరుకోరు ఏదైనా తప్పు జరిగితే అని సిబ్బంది  భక్తులని చాలా గౌరవంగా, శ్రద్దగా చూసుకుంటున్నారు. ఏ సమాచారం అడిగినా విసుక్కోకుండా సహాయకారిగా వున్నారు. ఈ విషయమై సంతోషమేసింది. అధికారిణిని అందుకే స్వామి పిలిపించుకున్నారేమో ! :).

శ్రీకాళహస్తి కి వెళుతున్నామంటే, మా స్నేహితుడు 'మారుతి' చెప్పిన ప్రణాళిక ఏమిటంటే, ఉదయం అభిషేక దర్శనం అమ్మవారు, అయ్యవారు ఇద్దరి అభిషేకం చూపిస్తారు 1,116/- టికెట్. తరువాత 10 గంటలకి రుద్ర, చండీ హోమం. అది 1,116/-  రూపాయలు. ఇవి రెండూ పూర్తి అయ్యాక రాహు,కేతు పూజలు చేయించుకోండి. మూడు దొరకటం మీ ప్రాప్తం, ఆ స్వామి అనుగ్రహం అని చెప్పాడు. మేము ఎంత వీలయితే అంత అనుగ్రహం. ప్రయత్నిద్దాం ఆ పై శ్రీకాళహస్తీశ్వరుని దయ అని బయలుదేరి వచ్చాము అన్నమాట.

ఇంక వెనక్కి అభిషేకం దగ్గరకొస్తే, మేము అభిషేకం సమయం ఇంకా ఉండటంతో ఆ పక్కనే వున్న శ్రీకాళహస్తి శిఖర దర్శనం, యమ, చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగ దర్శనాలు చేసుకున్నాము.

సాధారణంగా మాట్లాడితే, స్వామి మనకి పెట్టె పరీక్షలు పీక్స్ లో ఉంటాయి. ఇందాక చెప్పినట్లు నిల్చుని వున్నా విపరీతమైన నిద్ర ఒక పక్క, కొంత ధ్యానంలాగ, కొంత నిద్రలోకి పోతామేమో భయంతో కూడుకుని, పోకూడదు అన్న పట్టుదల, నిష్ఠ మరోవైపు మొత్తానికి రకరకాల స్థితుల మధ్య  అభిషేకం మొదలు అయ్యే  సమయం రావటంతో నిద్ర ఎగిరిపోయింది :)   

మెల్ల,మెల్లగా అభిషేకానికి భక్తులు రాసాగారు. మా ఊరునుంచి ఒక జంట (క్లాస్మేట్స్) ఇద్దరు పిల్లలతో వచ్చారు.

అందరిని ఒకచోట కూర్చోబెట్టి, పేర్లు రాసుకుని, మెడలో ఒక టికెట్ కి ఒకరికి చొప్పున కండువా (తువ్వాలు) వేశారు. ఆడవారికి జాకెట్ ముక్క ఇచ్చారు.

ఆ తరువాత అక్కడ పూజ చేసి ముందుగా అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. అక్కడ జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి అభిషేకం అద్భుతంగా జరిగింది. ఆ తరువాత అభిషేకం - క్షేత్ర దైవం అయిన మన శ్రీకాళహస్తీశ్వర స్వామికి.

సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా ఎంత పెద్ద స్పెషల్ టికెట్ తీసుకున్నా, మనకన్నా ముందు కొందరు భక్తులు అంతరాలయం దర్శనం చేసుకోవటం గమనించి అసలు ఎలా చేసుకోగలుగున్నారు. మనం ఎలా చేసుకోలేకపోతున్నాము అన్న ప్రశ్న ఉండేది నాకు, దానికి సమాధానం ఈ యాత్రలో దొరికింది. నిజంగా సహాయపడిన మా స్నేహితుడి 'మారుతి'కి బ్లాగ్ ముఖాన నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

అక్కడ మా అభిషేకం జరుగుతున్న సమయంలో నాలాగే విప్లవ భావాలున్న ఒకావిడ అక్కడ సిబ్బందితో, వాళ్లందరికీ టికెట్స్  ఉన్నాయా! ఇక్కడ చాలా సమయం నుంచి మేము నిరీక్షిస్తున్నాము అన్నట్టు అడిగింది. వాళ్ళు  అందరికి టికెట్స్ వున్నాయి అని చెప్పి శాంతపరిచారు.

అభిషేకం పూర్తి అయ్యాక స్పటికలింగం దగ్గర ప్రసాదం పులిహోర, లడ్డు, వడ వున్న ప్యాకెట్స్  ఇచ్చారు.

లాడ్జికి వచ్చి మా ఇద్దరికీ భోజన ప్రసాదంలా తీసుకున్నా ఇంకా మిగిలింది. ఆ తరువాత కాసేపు ఉండి మళ్ళీ రాహు కేతు పూజకి కోసం బయలుదేరాము.

పాతాళ వినాయకుడి దర్శనం అప్పటికి అవ్వలేదు. రుద్రా,చండీహోమాలు చేయించుకోండి అని మైకులో చెబుతున్నారు కాని అప్పటికే రాహు, కేతు పూజ సమయం అవటంతో అక్కడికి బయలుదేరాము.

రాహు కాలం ఆరోజు  మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల దాకా ఉంది. (రాహుకాలం చార్ట్  గూగుల్లో వెతకండి. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఉపయోగ పడుతుంటుంది).
మేము 1:10 కి లైన్లోకి వచ్చాము. అప్పటికే అందరూ కూర్చుంటున్నారు. అప్పటికి రాహుకాలం అవలేదు అని వెనక్కి పోతుంటే, లేదండి 1:30 రాహుకాలంలోనే పూజ ప్రారంభం అవుతుంది అంటే వెళ్లి కూర్చున్నాము.

రాహు,కేతు పూజలు ఇప్పుడు కనీస టికెట్ వెల 500 రూపాయలు. మునుపు 300 ఉండేది గరిష్టం 5000 కూడా వుంది. గుడిలోపల సహస్రలింగం ఉంటుంది. అక్కడే అభిషేకం వాళ్ళని కూర్చోపెడతారు. ఆ పక్కనే 5000 రూపాయల టికెట్ వాళ్లకి కూడా రాహు, కేతు పూజలు చేస్తారు. దాదాపు ధరల టికెట్ తీసుకున్న వారికందరికీ పెద్ద, చిన్న హాళ్లు ఉంటాయి. అక్కడ చేయిస్తారు.రాహు, కేతు పూజలు ప్రొద్దున 6.30 నుంచి రాత్రి 8:౩౦ వరకు జరుగుతాయి. మీకు వీలున్న సమయం చూసి ఒకసారి కనుక్కోండి.

మేము 750 రూపాయల టికెట్ తీసుకున్నాము. పూజ 30 నిమిషాలు పడుతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో మైకులో చెబుతారు. తెలియకపోతే పక్క వాళ్ళు చేసినట్టు చెయ్యండి. ఏమీ పరవాలేదు. కష్టం ఏమీ ఉండదు. పూజా సామగ్రి దేవస్థానం వాళ్ళే ఇస్తారు. వస్త్ర ధారణ నియమాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. మీ విజ్ఞత, సంస్కారం అంతే.

పూజ అయ్యాక రాహు,కేతు వెండి ప్రతిమలు శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకుని మూడుసార్లు తల చుట్టూ తిప్పుకుని హుండీలో వెయ్యమంటారు. ఆలా చెయ్యటంతో, అంతటితో పూజ పూర్తి అవుతుంది. పూజ తరువాత వెళ్లి స్నానాలు చెయ్యటం లాంటివి ఏమీ చెప్పలేదు. కాబట్టి అవసరం లేదనుకుంటున్నాను. సాధారణంగా చెప్పేది పూజ అయ్యాక సరాసరి మీ ఇంటికి వెళ్లిపోండి అని. మీకు సాధ్యమైతే ఆ పని తప్పక చెయ్యండి. వేరే ప్రణాళికలు ఉంటే ముందే చేసుకుని రాహు,కేతు పూజలకు రావటం ఉత్తమం.

ఆఖరుగా పాతాళ వినాయక స్వామి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కొంచెం కష్టం అయింది. 20  అడుగుల కింద లోపల వున్న స్వామి ని దర్శించుకోవాలి అంటే ఒకరు తరువాత ఒకరు నలుగురు, ఐదుగురు చొప్పున వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాక మిగిలినవారు మళ్ళీ ఒక బ్యాచ్ కింద వెళతారు. సన్నని ఇనుప నిచ్చెన లాగ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం సమయం పట్టింది. దానికి తోడు పంచె వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయినది :).

ఆ తరువాత మా పక్క రూమ్ లో వుండే స్నేహితుడి వూరు శ్రీకాళహస్తే కాబట్టి వూరు కొద్దిగా చూపించాడు. రామసేతు వంతెన మీదగా బైపాస్ రోడ్ మీదకి వెళ్ళాము. అక్కడే ఒక బాబా - జీన్స్ బాబా అంట మా స్నేహితుడు చెప్పాడు. కొందరు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అయన నచ్చితే సిగరెట్లు తీసుకుంటారు అనుకుంట లేకపోతె లేదు అని కూడా చెప్పాడు. అక్కడ ఆగలేదు మేము. ఒకచోట స్పెషల్ పేడా తీసుకున్నాము. చాలా వేడిగా బావుంది. నన్ను లాడ్జి దగ్గర దింపి తను వెళ్ళిపోయాడు. మేము సమయం అవ్వటంతో లాడ్జి ఖాళీ చేసి తిరుపతి వెళ్లి ట్రైన్ పట్టుకుని ఏలూరులో బైక్ ఉండటంతో అక్కడ దిగి బైకు మీద తెల్లవారగట్ల వూరికి వెళ్ళటం ఒకానొక మధురానుభూతి. ఫోటోలలో చూడండి అది. 

శ్రీకాళహస్తి ఆలయ ఆన్లైన్ సర్వీసెస్ ప్రారంభించారని న్యూస్ లో చూసాను. సేవలు, పూజ టికెట్స్  బుక్ చేసుకోవచ్చు అని కూడా చదివాను. మీకు వీలు ఐతే ఒకసారి  చూడండి.

శ్రీకాళహస్తి లో చుట్టుపక్కల చాలా ఆలయాలున్నాయి. మీరు బస్ దిగే చోట ఎడమపక్క కొండ మీద దుర్గమ్మ ఆలయం వుంది. దగ్గరలోనే సుబ్రహ్మణ్య  స్వామి ఆలయం కూడా వుంది అని విన్నాను. శ్రీకాళహస్తి ప్రధాన ఆలయ గుడి పక్క కొండ మీదనే తిన్నడి గుడి కూడా వుంది. దర్శించగలరు. 

కొసమెరుపు:
మొట్టమొదట శివకేశ బేధం గురించి చెప్పుకున్నాము కదా ! తిరుమల స్వామి ఆర్జిత సేవ లక్కీ డిప్ అంతకు ముందు కూడా, కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తున్న మాకు ఆ నారాయణుడే, శివుడయి శ్రీకాళహస్తిలో అభిషేక దర్శనం ఇచ్చాడు. శివ,కేశవుల అభేదమే కాదు 'నారాయణ', 'నారాయణి' గురించి కూడా మరోసారి మాకు అనుభవపూర్వకంగా చవి చూపించాడు. (ఒక్కమాటలో చెప్పాలంటే...ఆ పరబ్రహ్మ విభూతులు అనంతం). అర్థమైందా ? మరి ఇంకెందుకు లేటు చెప్పండందరూ ! శివాయ..విష్ణురూపాయ ...

అభిషేకం పూర్తి చేసుకుని బయటకు వస్తుంటే ఇక్కడ తీర్థం ఇవ్వబడును అని చూసాను. తీర్థం తీసుకుని అక్కడ వున్న స్వామి కి దండం పెడుతుంటే ఒక్కసారిగా గుండెలదిరేలా మంగళారతి సూచిస్తూ భేరీమృదంగాలు మోగుతున్నాయి. నా ఎదురుగా వున్న స్వామి ఎవరా అని చూస్తే దేవతల 'సుప్రీమ్ కమాండర్ అఫ్ ది ఫోర్సెస్' అయిన మన కార్తికేయుడే... సర్వ  సైన్యాధ్యక్షుడు యుద్ధరంగంలో కాలుపెడితే మాములుగా ఉండదు కదా ! శంఖనాదాలు, బేరి,మృదంగాలు, కొమ్ముబూరల శబ్దాలు శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తాయి. శత్రు జయం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణం. 

వాయుక్షేత్ర దర్శనానికి 'వాయుపుత్రుడి'  సహాయం లభించింది కదా ! ఆ పరమశివుని విభూతులు లెక్కించతరమా ! సముద్రంలో ఇసుక రేణువులంత !!!

























Wednesday, November 8, 2017

అదిగదిగో భద్రాద్రి !!! (భద్రాద్రి రామచంద్రుడి దర్శనభాగ్యం)

అదిగదిగో భద్రాద్రి ! అందుకోండి నా రామచంద్రుని ఆశీస్సులు (భద్రాద్రి రామచంద్రుడి దర్శనభాగ్యం).

మా చిన్నప్పుడు ఊరూరా రామాలయాలు, ఊరి చివర నేనున్నా అంటూ గ్రామాన్ని రక్షకుడిలాగా వుండే హనుమాన్ విగ్రహాలు ప్రతి వూరిలోను కనిపించేవి.

శనివారం వచ్చిందంటే గుళ్లో భోగం అంటూ ఊరంతా ఒకే చోట చేరటం, సందడి చెయ్యటం, తులసి తీర్థం తీసుకోవటం, పూజ ఎపుడు అవుతుందా, పులిహోర ప్రసాదం ఎపుడు పెడతారా అని పిల్లలంతా ఎదురు చూడటం. ఆ వారానికి వూరి వారు ఎవరో ఒకరు ప్రసాద వితరణ చెయ్యటం. ఆరోజుల్లో గుడినుంచి బయటకు వచ్చేటప్పుడు కాసేపు కూర్చోటం అనేదానికి ఒక అర్థం కనిపించేది.

ఒక సంవత్సరం ముందు మళ్ళీ  ఆ వూరు వెళ్ళినప్పుడు ఆ వైభవం అంతా గుర్తుకొచ్చింది.

గూటీబిళ్ళ ఆడుతూ భగవత్ గీత వినటం
----------------------------------------------------

చెప్పటానికి నవ్వొస్తున్నా, కొంచెం సిగ్గుగా కూడా వుంది. మైకులో రోజూ వచ్చే భగవత్ గీత, శ్రీ రామ నామామృతం పాటలు మా పిల్లలకి ఆ గుడి దగ్గర్లోనే ఆడుకోవటం వల్ల దాదాపు నోటికి వచ్చేసేవి. కోరస్ పాడుతూ ఆడుకునేవాళ్ళం :). సైకులు తొక్కుతున్నా, గూటి బిళ్ళ ఆడుతున్నా ఒక పక్క పాడుతూనే, హమ్ చేస్తూనే ఉండేవాళ్ళం. లేకపోతె అల్లరిగా మేమూ పాడేవాళ్ళం (ఆ పుణ్యమేమో ఇంకా పైకి పోకుండా చాలాసార్లు కాపాడింది :p).

ఇప్పుడు ఆ వైభవం అంతా పోయింది. ప్రతి విషయానికి కొలబద్ద డబ్బు మాత్రమే. కంప్యూటర్ జనరేషన్ పిల్లలు అని మురిసిపోవటమే. ఇప్పుడు ఇదొక్కటి తెలిస్తే అప్పటి పిల్లలకి జీవితం తెలుసు అంతే తేడా. తేడా అడిగారు అంటే మీరు కంప్యూటర్ జనరేషన్ కిడ్ అని అర్థం :)).

మొట్టమొదటి డాబా ఇల్లు మా మావయ్య వాళ్లది కావటం చేత డాబావారి ఇల్లు అని పిలిచేవారు.

ఇప్పుడు ఇద్దరు మావయ్యలు పోయాక, ఎవరు ఉండక తాళాలు వేసి వున్నాయి. పెద్ద పాలస్ లాంటిది పాడుబడుతుంది ఇప్పుడు.

రామాలయాలు స్థానంలో ఏవేవో వచ్చి ఆ ఆలయాలకు ఆదరణ కరువైపోయింది. చెప్పటం కూడా చాలా కష్టంగా వుంది.

దేశంలోనే రెండో పాడురంగని ఆలయంగా పేరుగాంచిన చిలకలపూడి (మచిలీపట్టణం) పాండురంగని ఆలయ దర్శనానికి వెళ్ళినపుడు, పూజారి గారు ఎక్కడ నుంచి వచ్చారు అమ్మా ! అని అడిగితె, బెంగళూరు అని చెప్పాము. అప్పుడు ఆయన, వున్న వూళ్ళోనే ఎవరూ పట్టించుకోవటం లేదు. మీరు అక్కడినుంచి దర్శనానికి వచ్చారా ! అని నిర్లిప్తంతో కూడిన మనసులోని మాటలు బయటకి వినపడటం ఇప్పటికీ గుర్తు వుంది.

ఏం చేస్తాం దేవుడు ఆలయాలని, భక్తిని, ఐతే సిలబస్ లో పెట్టాలి. లేకపోతె బ్రాండ్ మేనేజర్ ని ఒకడిని పెట్టుకోవాలి. కాదు, కూడదు అంటే 'వివాదమో  లేక సంచలనమో' చెయ్యాలి.

మా వూళ్ళో నే కాదు. చాలా పల్లెటూళ్లలో అదే పరిస్థితి. రకరకాల దేవతలు, దేవుళ్ళు.. సాత్విక దేవతలతో పాటు, ఉగ్రరూప దేవతలు వచ్చేసారు.

శివాష్టోత్తర శతనామ స్తోత్రం అంటే రెండు నిముషాలు టైం కేటాయించటం అని చెబుతున్నారు. మనసొక చోట, తనువొక చోట. రెండు చేతులు జోడించడం అంటే ఏంటో తెలియదు. తెలిసినా మనసుకి అనుభూతిలో ఓలలాడదు. అంతా యాంత్రికం. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద (అయ్యో ! మావి బ్రాన్డెడ్ చెప్పులండి బాబు, పొతే ఎలాగ అంటారా ! ఐతే సరి ఇంక ఆ భగవంతుడే కాపాడాలి అని కోరుకోవటమే :(.

 "శివో" అంటూ శివాష్టోత్తరం మొదలుపెట్టే మనం ఆ నామానికి అర్థం కనీసం మంగళకరం, మంగళాలు ఇచ్చేవాడు అని జ్ఞప్తికి ముఖ్యంగా అనుభూతికి తెచ్చుకుంటున్నామా ? ఎవరికి వారు ఆలోచించుకోవాలి ఇది ...?

పిండికొద్దీ రొట్టె అని అంటారు. అలా చేసే పూజా ఫలితాలు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోకపోవటమే మంచింది.

ఒక్కసారి, ఒక్క నామముతో మొదలెట్టండి. అర్థాన్ని అనుభూతిలోకి, అనుభంలోకి తెచ్చుకోండి. అద్భుతాలు చూస్తారు. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు లాంటి పెద్ద ఎందుకు అన్ని సార్లు ఈ విషయాన్ని పదే, పదే చెబుతారో అప్పుడు అర్థం అవుతుంది.

సారీ డైవర్ట్ (?) అయ్యాను. మన యాత్ర లోకి వెళ్ళిపోదాం.

మా ఊరినుంచి భద్రాచలం సుమారు నూటపది కిలోమీటర్లు. బండి మీద వెళ్ళేటంత తక్కువ దూరం కాదు. అలా అని మరీ అసంభవం అనేటంత ఎక్కువా కాదు. ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల, మా వాళ్ల మిగతా కారణాల వల్లను, ఇద్దరం కలిసి బస్సు లో వెళితే, మరొకడు బండి మీద వచ్చాడు.

పొద్దుటే టీ, కాఫీలు తాగకపోతే పడిపోయే శరీరాలు కదా ! అందుకే బ్రేక్ జర్నీ చేసుకుంటూ వచ్చే దారిలో అల్పాహారం చేసుకుని భద్రాద్రి చేరుకున్నాము.

ముందుగా భద్రాద్రి చేరుకున్నాక సరాసరి గోదావరి ఘాట్ దగ్గరకి వెళ్ళాము. సరాసరి నదిలో స్నానం ఇష్టం లేక ఆ పక్కన వున్న టాయిలెట్స్ లో స్నానాదులు ముగించుకుని ఆలాగే సరాసరి తడిబట్టలతోనే నదీ స్నానం (నదీ స్నాన శ్లోకంతో సహా) కూడా ముగించుకుని ఆలయానికి బయలుదేరాము.

ఎపుడో డిగ్రీ చదువుకునేటప్పుడు వెళ్లిన పిక్నిక్ లో భాగంగా వచ్చేటపుడు దర్శనం చేసుకున్నాము అని స్నేహితుడు గుర్తు చేసాడు. అప్పటికి, ఇప్పటికి మొత్తం మారిపోయింది.

ఇక్కడ ఒక చిన్న విషయం మనవి చేసుకోవాలి. జనాభాపెరగటంతో పాటు భక్తులు కూడా రోజురోజుకి పెరుగుతున్నారు. అభివృద్ధి ఆవశ్యనీయం. అభివృద్ధి జరుగుతున్న సమయంలో  మాత్రం ఆలయాన్ని దర్శించినప్పుడు మనసు చివుక్కుమంటుంది.
మొన్న మధ్య  మా వాడు విజయవాడ టెంపుల్ దగ్గర దిగిన ఫోటో పంపిస్తే, ఎక్కడ అని అడిగానంటే పరిస్థితి అర్థం చేసుకోండి.

విజయవాడ అదే మన బెజవాడ కనకదుర్గ 'పెద్దమ్మ'ని ని చూడటానికి నేను కూడా వెళ్ళాను ఆ మధ్య . అక్కడ అమ్మవారి దర్శనం అయ్యాక, మల్లేశ్వర స్వామి దర్శనంకి వెళదామనుకుంటే బారికేడ్లు దర్శనమిచ్చాయి. దర్శనం లేదు అన్నారు. అంతకు ముందు కొత్తగా నటరాజస్వామి ఆలయం దగ్గర ఒక శివలింగం కనపడింది. పూజారి గారు తీర్థం ఇస్తున్నారు. కొత్త ఆలయం ఏమైనా పెట్టారా అనుకుంటూ అన్యమనస్కంగా తీర్థం తీసుకున్నా. కానీ తాత్కాలిక మల్లేశ్వర స్వామి అని తరువాత తెలిసింది.

రైల్ ఎక్కాలన్న తొందరలో వున్నానేమో అస్సలు ఆరు ఫ్లోర్లు ఎక్కడానికే అతి కష్టం అయింది. స్పెషల్ దర్శన్ టిక్కెట్ల రేట్లు చాలా పెంచేశారు. ఇందాక చెప్పినట్టు అభివృద్ధి అవసరమే కానీ ఎంత మూల్యానికి అన్నట్టు, ప్రాణప్రతిష్ట చేసిన, అత్యంత పురాతన వైభవం, మహాత్మ్యం కలిగిన గుడులను రాత్రికి రాత్రి లేపేస్తే అర్థం ఏమిటి ? ఎంత దారుణమైన ఫలితాలు వుంటాయో తెలియదా ? ఊహించడానికే భయం వేస్తుంది. యాథా రాజా ! తథా ప్రజా !  ఇలాంటివి చేస్తే మంచోడు, చెడ్డోడు అందరూ పోతారు అంతే సింపుల్. చేసినందుకు వాడు, అడగనందుకు వీడు.

కామేశ్వర శర్మ గారు అనుకుంట. కొన్ని సంవత్సరాలకు ముందు అత్యంత పురాతన, ప్రభాన్వితమైన మరియు వివిధ పురాణాలలో పేర్కొనబడిన ఆలయ నీటి కుండాలను పూడ్చి వాటి పైన లెట్రిన్స్ కట్టారు అని ఆ అర్చక స్వామి అత్యంత ఆవేదనతో ఒక పుస్తకం కూడా రాశారు.

ఇలాంటి విషయాలలో శాస్త్రోత్తంగా - ఆగమశాస్త్రాలో లేక మరొకటో, వేద పండితులు,పెద్దలు, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్ళాలి. అంతే కానీ ప్రోక్లేన్లు, క్రేన్లు వంటి యంత్రాలో లేకపోతె బి.టెక్లు, ఎం.టెక్లు, 'బేక్ లాగులతో' పాస్ అయిన ఇంజినీర్ల సలహాలతో కాదు.

ఎటుపోయాము. సరే ఇప్పుడు వెనక్కి రండి, మన భద్రాద్రి యాత్ర లోకి.

మేము సుమారు 12 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించాము. భద్రాద్రి స్వామి పరివారసమేతంగా దర్శనమిచ్చాడు. ఆలయ దర్శన బ్రేక్ సమయం అనుకుంట. కంగారు పడుతున్నారు అందరూ.

మొత్తానికి మా దర్శనం అయింది. బ్రేక్ లోపు మేమే ఆఖరు దర్శనం అనుకున్నాము. ఆరోజు అమావాస్య . అమావాస్య  రోజు ఎందుకు ప్రయాణాలు పెట్టుకోరో అనుభవ పూర్వకంగా అర్థం అయింది. తరువాత చెప్తాను. కాని ఏం చేస్తాము సమయం అట్టే లేదు. పరిస్థితులేమో పగబట్టాయి  ఇంతకుముందు కూడా రకరకాల కారణాలతో వాయిదా పడింది. అందుకే దేవుడు పిలిస్తే ఇంక పరిగెత్తటమే. ఆలోచించకూడదు అనిపించి బయలుదేరాము.

గుడి మెట్లు ఎక్కేటప్పుడు కొన్ని వుపాలయాలు కనపడ్డాయి. సర్లే మళ్ళీ  చూసుకుందామని పైకొచ్చేసాము. అక్కడ శాశ్వత సేవలు కూడా ఉన్నట్టు కనపడ్డాయి. తోచినంతమేర మొత్తం స్వామి అనుగ్రహం మేరకు ఆయన సేవకు రాయించాము. ఈ శరీరం వున్నా, పడిపోయిన, ఉత్తరోత్తర జన్మలు వున్నా, లేకపోయిన, ఆ జన్మలలో భక్తి వున్నా, లేకపోయిన శాశ్వతంగా భగవంతుని కైంకర్యం జరుగుతుంది.

శాశ్వత సేవలు అంటే నా దృష్టిలో మన శరీర ప్రయాణం ఇక్కడ ఆగినా, సాధనా ప్రయాణం కొనసాగించటమే !!!.

మీకో విషయం చెప్పాలి ముందు. మీకు రామ గుండిగ, లక్ష్మణ గుండిగ చరిత్ర తెలుసా ! ఇక్కడి అంబా సత్రం గురించి కూడా విన్నారా ? ఐతే ఇక్కడ చదవండి ముందు.

సరే అసలు భద్రాద్రి క్షేత్ర వైభవం గురించి ఒకటి రెండు మాటలు (అంతర్జాలం నుంచి)

మేనకా, హిమవంతుల పుత్రుడు భద్రుడు. భద్రుడు చేసిన తపస్సుకు మెచ్చి వరప్రధానంగా స్వామి సరాసరి వైకుంఠం నుంచి వచ్చి భద్రుడు కొండ రూపం దాల్చితే స్వామి ఆసీనులయ్యారు. అందుకే ఇది భద్రాద్రి & భద్ర+అచలం = భద్రాచలం అయింది.

ఇక్కడ స్వామి తొడ మీద అమ్మవారు ఆసీనులై దర్శనమిస్తారు. మనం చదువుకున్న కంచర్ల గోపన్న - అదే స్వామి మహా భక్తుడుగా పేరుగాంచిన శ్రీ రామదాసు. గుడి కట్టించినందుకు చెరసాలలో వెయ్యబడ్డాడు కదా తానీషా ప్రభువు చేత. ఆ రామచంద్ర ప్రభువే అప్పు చెల్లించి మరీ రామదాసుని అనుగ్రహించిన కథ మనకందరికీ తెలిసిందే కదా ! దాశరథి శతకం రాసింది కూడా ఈ రామదాసే మరి.

స్వామి వారి మరొక మహాభక్తుడు కబీర్.  కబీర్ నకు ఆలయ ప్రవేశం నిరాకరిస్తే, అక్కడ దివ్య చిత్రాలు మాయమయ్యాయట. మళ్ళీ  కబీర్ నాకు దర్శనానికి అనుమతించిన మీదటనే అవి ప్రత్యక్షమయ్యాయట.

సాధారణ రామాలయాలలోలాగ కాకుండా స్వామి ఇక్కడ నాలుగు చేతులతో శంఖ,చక్ర, ధనుర్భాణాలతో దర్శన మివ్వటానికి కారణం స్వామి వైకుంఠం నుండి సరాసరి దిగిరావటమే స్థలపురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ స్వామిని వైకుంఠ రాముడుగా పిలుస్తారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశికి, ఉత్తర ద్వార దర్శనానికి కూడా అంత ప్రాధాన్యం అందుచేతనే.

ఇక్కడ మన స్వామి సీతా, లక్ష్మణ సమేతుడై రామాయణ వనవాసకాలంలో నివసించిన ప్రదేశం పేరు పర్ణశాల. ఇక్కడే సీతమ్మ  తల్లిని, రావణుడు మాయా వేషంలో అపహరించినది. అక్కడ గుర్తులు కూడా చూపిస్తారు. భద్రాద్రి వచ్చిన ప్రతివారూ పర్ణశాల కూడా చూసుకుని వెళతారు. ఈ మధ్య 'అభివృద్ధి' దెబ్బ ఇక్కడ కూడా పడింది. అక్కడ అంత పెద్దగా ఏమి లేదు ఇప్పుడు అని మరొక స్నేహితుడు చెప్పాడు. ఐతే అంతకు ముందు వెళ్ళటం వల్లను, సమయాభావం వల్లను మా స్నేహితుడు కొత్తగా ఏమీ లేదు అని చెప్పి ఉండవచ్చు. ఈ ట్రిప్ లో ఐతే పర్ణశాల వెళ్ళలేదు. భద్రాచలం నుంచి పర్ణశాల 35 కిలోమీటర్లు దూరం.

చెప్పటం మరిచిపోయాను. మీరు ప్రత్యేకంగా ఉండాలి మీ జర్నీ అనుకుంటే పోలవరం నుంచో, రాజముండ్రి నుంచో లాంచీ లో వెళ్ళండి గోదావరి అందాలు చూసుకుంటా. పాపికొండలు (పాపిడి కొండలు) ప్యాకేజీలు ఉంటాయి. ఏ.పీ.టీ.డి.సి. వాళ్ళను కూడా సంప్రదించవచ్చు.


మేము భద్రాచలం ఆలయ దర్శనం తరువాత, మా స్నేహితుడు పాల్వంచలో న్టీపీసీ అనుకుంట అందులో పనిచేస్తున్నాడు. ప్లాంట్ అవీ చూపించాడు. అక్కడ నుండి కిన్నెరసాని వెళ్ళాము.

కిన్నెర సాని వచ్చిందమ్మ  యెన్నెల పైటేసి...

ఆ తరం వాళ్లకి ఈ పాట బాగా తెలుసు కదా ! అది ఇక్కడి కిన్నెర సాని గురించే. ఆ అనుభూతులు, కవిత్వం, భావోద్వేగాలు, ఊహలు ఆడండి జీవితం అస్సలు :).  హాచ్   సత్యం :P.

కిన్నెరసాని దగ్గర జింకల పార్క్ & 'డామ్' వుంది.

కిన్నెరసాని దగ్గరకొచ్చేసాము అనగా రోడ్ పక్క ఒకామె అమెరికన్ పాప్ కార్న్ అప్పటికప్పుడే ఫ్రెష్ గా ఉడకబెట్టి అమ్ముతుంది. మా స్నేహితుడు అక్కడ ఆపి మరీ తినిపిస్తే అప్పుడు అనిపించింది నా జీవితంలో అంత రుచి ఎపుడూ చూడలేదు అని. జన్యు వర్తిత  ఉత్పత్తి ఏమో అని భయంవేసింది కూడా. ఎందుకంటె ఈ మధ్య  పళ్ళు, కూరగాయలలో 'కొత్త రంగులు & రుచులు' చూస్తే కాస్త గాభరాగానే ఉంటుంది.

జింకల పార్క్ లో గ్రాసం ఒకామె అమ్ముతున్నారు. మేము కొని జింకలకు తినిపించాము. వాటర్ రైడ్స్ పెట్టారు అవీ వున్నాయి. బావున్నాయి కాని చాలా టైం వేచివున్నాము. వారాంతం అంటే ఎక్కడైనా ఇలాగే వున్నట్టు వుంది.

అక్కడ నుంచి మా స్నేహితుడి ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని బయలుదేరాము. వచ్చేటప్పుడు జీలుగుమిల్లి గురించి వచ్చే రోడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. అమావాస్య  ఎఫెక్ట్ వల్ల కూడా అనవసర ఆందోళనలు, మాటలు, వాదులాటలు జరిగినవి. అవి ఊహించినవే కదా ! అందుకే పెద్దలు పంచాంగం చూసేది. విత్తనం వేసినపుడు వాన పడాలి. వాన పడేసమయానికి విత్తనం వేసి ఉండాలి. ఇవన్నీ కాదు. భగవంతుని శరణాగతి చేయినవాడికి మాత్రం ఈ సూత్రం వర్తించదు :).

ఎంత గొప్ప ముహార్తానికి అయినా కొద్దిపాటి ఇబ్బందులు మాములే కదా !. అమావాస్య అయినా, పౌర్ణమి అయినా మన ప్రయత్నం మన చెయ్యటమే. ఆపై ఆ భద్రాద్రి రాముడి అనుగ్రహం.

కొన్ని ప్రయోజనకరమైన లింక్స్:
-----------------------------------

ఈనాడులో కాస్త సమగ్రంగా సమాచారం ఇచ్చారు. అది ఇక్కడ చూడండి


లింక్ 2 


లింక్ 3


మరిన్ని క్షేత్ర విశేషాలు (జటాయుపాక, దుమ్ముగూడెం గ్రామ కథ, ఇతరాలు) ఇక్కడ చదవండి.