Wednesday, November 1, 2017

అరుణాచల యాత్ర - రెండోసారి (పార్ట్ 1)

ముందుగా ఒక చిన్న మాట.

(యాత్ర గురించి మాత్రం చదివేవారు ఇది వదిలేసి తరువాత పార్ట్ కి వెళ్ళగలరు)

దేవుడిని నేను పట్టుకున్నానా లేక దేవుడు నన్ను పట్టుకున్నాడా ?

చాలా మౌలికమైన ప్రశ్న. జవాబు మాత్రం కష్టతరమైంది. ఎవరు కూడా ఇదమిత్థంగా చెప్పలేనిది.

ఒక వ్యక్తి పుట్టుకతో కర్ణ (చెవి) రోగి అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు అతను ఇన్ని పూజలు, పునస్కారాలు చేస్తున్నాను. ఎందుకు ఇంకా నాకీ క్షోభ అంటే ?

ఒకనికి ఎప్పుడూ ఉద్యోగ సమస్యలు ....

మరొకనికి వివాహ సమస్య...జీవితంలో ఎప్పుడూ ఏ అమ్మాయికి ద్రోహం చెయ్యని వాడికి వివాహ సమస్య. చాలా చిత్రం కదండీ.

మనం ఇన్ని స్తోత్రాలు చదువుతాం. స్తోత్రం చివరన ఫలస్తుతిలో కోటి జన్మలలో చేసిన పాపం కూడా నశించింది అని చదువుతాం. కానీ ఆ స్తోత్రం చదివాక కూడా మరి మన జీవితంలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. మన కష్టాలు మనకి ఉండవచ్చు.. మరి స్తోత్రంలో చెప్పిన విషయం నిజమే ఐతే (అందులో ఏమాత్రం సందేహం లేదు అనుకోండి) మరి మన జీవితంలో, కష్టాలలో మార్పు ఎందుకు రావటం లేదు?

అదే ప్రారబ్దం. సంచిత,ఆగామి, ప్రారబ్ద కర్మలలో ఒకటి ప్రారబ్ద కర్మ. అది ఈ జన్మకి అనుభవించి తీరాలి అంటారు. అంటే వాడికి  ఈ జన్మకి ఈ లోపం / బాధ తప్పదు.మన జాతకం చూపించినప్పుడు కొందరు జ్యోతిష్కులు చెప్పేది అదే కదా. మీరు పుట్టినప్పుడు ఆలాంటి గ్రహస్థితులు వున్నాయి అని అంటారు. అంటే ఈ జీవితానికి ఇంతే అని. కానీ మన భక్తితో మాత్రం పరిస్థితి మెరుగుపడుతుంది అంటే చెవికి ఒక మెషిన్ తో వినికిడి పెరగటమో లేకపోతే ఆ సమస్య  అంతే అని దానికి మనస్సు  సంగత్వం చెందకపోవటమో జరుగుతుంది. అదే పరిపక్వత.

ఎందుకంటే రోగం వచ్చినపుడు వైద్యుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు అప్పుడు మాత్రమే కదా గుర్తుకువచ్చేది. కుంతిని, కృష్ణుడు వరం కోరుకొమ్మంటే కేవలం కష్టాలు మాత్రమే ఇవ్వు కృష్ణా అని కోరుకుందట. అవును! అప్పుడు ఎల్లపుడూ భగవంతుని స్మరించుకోవచ్చు అని. ఈ పరీక్షలు కాస్త పక్కన పెట్టి ఇక అస్సలు విషయానికి వస్తే....

"అరుణాచలం" ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం గురించి  చెప్పుకోవచ్చు లేదా తెలుసుకోవచ్చు. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే రెండోసారి అరుణాచల దర్శనం / ప్రదక్షిణ నాకు భగవంతుని అనుగ్రహరూపంలో దక్కింది.

భగవంతుని పరీక్ష.

నేను మొదటి సారి అరుణాచల యాత్ర చేసిన అనుభవం ఇంతకు ముందు పోస్ట్ లో పెట్టాను. అది మీరు చదవకపోతే ఒకసారి ఇక్కడ చదవండి. అప్పుడు వచ్చిన పరీక్షలు కూడా చెప్పాను. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు ఇంకొక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఆషామాషా వంటి పరీక్ష కాదు. బలహీనత చూసి కొట్టడటంలో ఆయన్ని మించినోడు లేడు మాస్టారు.

కత్తి అంచు మీద నడవటం ఎంత కష్టమో అయన పరీక్ష పాస్ కావటం కూడా అంతే కష్టం. కాకపోతే ఆయన మీకు ఛాయస్ ఇస్తాడు. ఇటు మొగ్గు చూపుతావా లేక అటా అని. మీ బుద్ధి, తార్కికత, అవకాశవాదం, ప్రాధాన్య త అవ్వన్నీ కాదనుకుంటే మీ నిజమైనది అనుకున్నటువంటి భక్తి ఇవ్వన్నీ కూడా పరీక్షకి నిలబడతాయి. అప్పుడుతుంది అస్సలు పండగ. ఒక ఉదాహరణ చెబుతాను వినండి. మీరు అత్యంత నిజాయితీ పరులు. జాబ్ ప్రయత్నాలు చేసి, చేసి విసిగిపోయి వదిలేశారు. ఇంతలో మీకో అవకాశం వచ్చింది కానీ అది అవినీతి మార్గంలో. అప్పుడు ఉంటుంది అసలైన మీ విలువలకి పరీక్ష. మనసు, బుద్ది అప్పుడు హేతువాద దృక్పథం స్టార్ట్ చేస్తుంది. ఈరోజుల్లో విలువులేంటి అనో మరొకటో. అదేముంది మేము విలువులకి కట్టుబడి ఉంటాము అని అంటారా ?

ఐతే ... ఇది కూడా చెప్పండి. మీరు చేసిన వివాహ ప్రయత్నాలు అన్నీ విఫలమైనాయి. వివాహం అవుతుంది అని ఎటువంటి ఆశ లేదు. మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మలిని కరుణించలేదు. మీకు ఇరవయ్యిలో వున్న నైతిక, మానవీయ విలువలు ముప్పయిలు దాటాక ఈ భౌతిక ప్రపంచానికి పనికిరావు అని తెలుసుకుని బీటలువారాయి. మీరు తప్పు చేసిన మూడో  కంటికి తెలియదు (ముక్కంటికి తప్ప). వయసులో వివాహ సంస్కారంతో జరగవలసిన సమాగమానికి అన్ని దారులు మూసుకుపోయాయి. మీరు ఇప్పుడు బట్టలు సర్దుకుని అరుణాచలం వెళ్ళటానికి రెడీ అయి గేట్ తీస్తే, సరిగ్గా అప్పుడే, పెళ్లి అయి భర్త దగ్గరలేని పక్కింటి ఆవిడ వచ్చి .... ఇంక నేను వివరించనక్కరలేదు అనుకుంట. ఇప్పుడు మీరు నా వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం అయింది. కానీ ఇప్పుడు మీరు ఆలోచించవలసింది భగవంతుని పరీక్ష గురించి. ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు. మంచిది.

ఒక అడుగు అటు పడిందా జన్మజన్మల నుంచి తిరుగున్న మీ ఆత్మ ఎంతో అట్టడుగుకి వెళ్ళిపోతుంది. గెలిచారా మోక్షమార్గంలో ఒక మెట్టు ఎక్కేస్తారు.

మనకి ఇక్కడ సన్నివేశానికి బి.పి. పెరిపోతుంటే ఆయన మాత్రం అక్కడ ఆనంద తాండవం చేస్తుంటాడు.

ఇప్పుడు అర్థం అయ్యే వుంటుంది. ఉర్దూలో ఏదో సామెత చెప్తారు. దేవుడు కొట్టే దెబ్బ ముందు తెలియదు అని. ఆయన పరీక్ష కూడా అంతే. ఇది నా అనుభవం కావచ్చు. మరొకరిది కావచ్చు లేదా మన సర్కిల్ లో విన్న విషయం కావచ్చు. కానీ మీకు భగవంతుని పరీక్షలు ఎట్లా వుంటాయో ఒక అవగాహన కోసం చెప్పాను అంతే.

ఏదో ఒక పిక్చర్ మెసేజ్ గుర్తుకువస్తుంది. జీవితాంతం కష్టపడి గనిలో నిధి కోసం తవ్వి, తవ్వి అలసిపోయి ఇంకొక అడుగు తవ్వితే నిధి దొరుకుతుంది అనే క్షణంలో ఒకడు ఆపేస్తే, అటువంటి ప్రయత్నమే చేసే ఇంకొకడు ఆ అడుగు కూడా తవ్వి నిధిని సొంతం చేసుకుంటాడు.

మనం కూడా అంతే. పెద్ద తేడా లేదు. జీవితాంతం కష్టపడి మాయని జయించాలి అని, అన్ని ప్రయత్నాలు చేసి, ఇంకో అడుగుదూరంలో (భగవత్ అనుగ్రహంతో) జయిస్తాము అనేలోపే శాశ్వతంగా మాయలోబడి పోతుంటాము. 

విషయాలు నిజాయితీగా యథాతధంగా వివరించాను. మీ మనస్సు  నొప్పిస్తే క్షంతవ్యుడిని.

కాముడిని గెలవాలంటే, ఆ కాముడిని కాల్చిన వాడి శరణాగతి చెయ్యాలి. అప్పుడే ఆ జ్ఞాన తత్వం అనుభవంలోకి తీసుకొస్తాడు. అది అనుభవమైతేనే ఆ తేజోమూర్తి జ్ఞాన దర్శనం జరిగేది.  

No comments:

Post a Comment